Begin typing your search above and press return to search.

ఎస్పీవై రెడ్డి - సుబ్బారెడ్డి ఒక్క‌టి..అఖిల‌ప్రియ‌కు ఇక్క‌ట్లే

By:  Tupaki Desk   |   6 Feb 2019 6:03 PM GMT
ఎస్పీవై రెడ్డి - సుబ్బారెడ్డి ఒక్క‌టి..అఖిల‌ప్రియ‌కు ఇక్క‌ట్లే
X
క‌ర్నూలు జిల్లా నంద్యాల రాజ‌కీయాలు మ‌రోమారు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. ఉప్పునిప్పుగా సాగుతున్న మంత్రి భూమా అఖిలప్రియ కుటుంబం - టీడీపీ నేత, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి మ‌ధ్య మ‌రోమారు క‌ల‌క‌లం చోటుచేసుకునే ఎపిసోడ్ మొద‌లైంది. సుబ్బారెడ్డికి ఎంపీ ఎస్పీవై రెడ్డి తోడు కావ‌డంతో...అఖిల‌ప్రియ వ‌ర్సెస్ ఈ ఇద్ద‌రు ముఖ్య‌నేత‌లు అన్న‌ట్లుగా ప‌రిస్థితులు మారాయి.

నంద్యాలలో ఎంపీ ఎస్పీవై రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన టీడీపీ నేత, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా నంద్యాల టికెట్‌ పై హాట్ కామెంట్స్ చేశారు. గత ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి కోసం నంద్యాల టికెట్ త్యాగం చేశాను.. ఇప్పుడు నేను నంద్యాల టికెట్ అశించటం తప్పా? అని ప్రశ్నించారు. ``భూమా కుటుంబానికి ఒకే టికెట్ ఉంటే నేను టికెట్ అడిగే వాడిని కాదు.. కానీ, వారికి రెండు టికెట్లు ఇచ్చారని ఆయన.. భూమా కుటుంబం ఒకే టికెట్ అశిస్తే హుందాగా ఉంటుంది. అయితే, నాపై రైళ్ల దాడి చేసిన వారికి సంస్కరం ఉంటుందని అనుకోవటం లేదు` అంటూ ఏవీ సుబ్బారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటుగా, నంద్యాల అభివృద్ధికి నేను, భూమా ప్రణాళికలు వేశాం.. సీఎం చంద్రబాబు మా కలలను నిజం చేశారన్నారు. ``నంద్యాలలో గ్రూప్ ఏర్పాటు చేయడానికి 14 ఏళ్లు కష్టపడ్డా. దానికోసం కోట్ల రూపాయలు ఖర్చుచేశామని... కార్యకర్తలకు అండగా ఉన్నా. ఏమీ చేయని వాళ్లు ఇప్పుడు ఉన్నత పదవుల్లో ఉన్నారు` అని ప‌రోక్షంగా మంత్రి అఖిల‌ప్రియ‌పై మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నన్ను నమ్మారు.. నేను చంద్రబాబును నమ్మా.. సీటు నాకే వస్తుందన్న నమ్మకం ఉందన్నారు. అన్ని పార్టీల్లో తనకు అభిమానులున్నారని... టిక్కెట్ తెచ్చుకుంటే గెలిపిస్తామంటున్నారని సుబ్బారెడ్డి వెల్లడించారు.

ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇదే సంద‌ర్భంలో సుబ్బారెడ్డికి మ‌ద్ద‌తుగా మాట్లాడ‌రాఉ. నంద్యాల అసెంబ్లీ టికెట్‌ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగితే ఏవీ సుబ్బారెడ్డికే ఇవ్వాలని చెబుతానన్నారు. ``ఏవీ సుబ్బారెడ్డి భూమా అనుచరుడు మాత్రమే అనుకున్నా.. కానీ, చాలా శక్తివంతుడని అర్థమవుతోంది. రాబోయే ఎన్నికల్లో ఏవీ సుబ్బారెడ్డికి నా తరుపున ఉన్న ఓట్లన్నీ వేయిస్తా. నంద్యాలలో టికెట్ ఏవీకి ఇస్తే గెలుపు ఖాయం` అనే నమ్మకాన్ని ఎస్పీవై రెడ్డి వ్యక్తం చేశారు. ఈ ఇద్ద‌రు ముఖ్య‌నేత‌లు టార్గెట్ నేప‌థ్యంలో...అఖిల‌ప్రియ ఎలా స్పందిస్తారో మ‌రి.