Begin typing your search above and press return to search.

ఏపీపీఎస్సీ చైర్మన్ ఇష్టారాజ్యం..విద్యార్థుల భవిత దుర్భరం?

By:  Tupaki Desk   |   28 Nov 2019 10:05 AM GMT
ఏపీపీఎస్సీ చైర్మన్ ఇష్టారాజ్యం..విద్యార్థుల భవిత దుర్భరం?
X
ఒకే ఒక్కరి వల్ల జగన్ సంకల్పం బూడిదలో పోసిన పన్నీరవుతోంది. టీడీపీ హయాంలో సీఎం చంద్రబాబు నామినేట్ చేసిన ఆ మనిషి ఇప్పుడు ఏపీలోని వందలాది మంది యువత భవిష్యత్తును చిదిమేస్తున్న వైనం విస్తుగొలుపుతోంది.

చంద్రబాబు ఓడిపోయాడు.ఏపీలో జగన్ సర్కారు వచ్చింది. అయినా టీడీపీ నామినేట్ చేసిన పదవిని పట్టువిడవకుండా పదవితో అంటకాగి జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెచ్చరిల్లేలే ఏపీపీఎస్సీ చైర్మన్ వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రాజ్యాంగ పదవి నుంచి తొలగించే అధికారం జగన్ సర్కారు కు డైరెక్టుగా లేకపోవడంతో ఆ ఆవినీతిని కళ్లప్పగించి చూడడం తప్ప ఏమీ చేయలేని వైనం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

సీఎం జగన్ అవినీతి రహితంగా.. పారదర్శక పాలనతో ముందుకెళ్తున్నాడు. ప్రతి శాఖ - పని - ప్రాజెక్టుల్లో జవాబుదారీతనానికి పెద్దపీట వేస్తున్నారు. కానీ టీడీపీ హయాంలో ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమాకం అయిన అయిన ఉదయ్‌ భాస్కర్‌ పై ఇప్పుడు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వర్గానికి మాత్రమే కొమ్ముకాస్తూ నిరుద్యోగ యువతీయువకుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. తన వర్గం వారికే ఎక్కువ మార్కులు వచ్చేలా కోచింగ్‌ సెంటర్లతో ఒప్పందాలు చేసుకొని విద్యార్థుల జీవితాలను ఫణంగా పెడుతున్నారని మండిపడుతున్నారు. ఏపీపీఎస్సీలో ఒక కులానికి మాత్రమే మేలు చేస్తూ మిగిలిన సామాజిక వర్గాల యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు ఆర్థిక అండదండలు అందించాడన్న పేరున్న సుజనా చౌదరి రికమండేషన్‌ తో ప్రస్తుత ఏపీపీఎస్సీ చైర్మన్‌ నియామకం అయ్యాడని ప్రచారంలో ఉంది. ఈయన నియామకం రోజునుంచే వివాదాస్పద నిర్ణయాలు - తన సామాజిక వర్గానికి మాత్రమే లాభం చేకూర్చేలా ఒంటెద్దు పోకడలు చేశాడనే ఆరోపణలున్నాయి. ఎన్నికల తరువాత ప్రభుత్వం మారి జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎం అయ్యాక గత ప్రభుత్వంలో నియమించిన నామినేటెడ్‌ పోస్టులో ఉన్నవారంతా రాజీనామాలు చేశారు. కొంతమంది తప్పుకున్నారు. అయితే సదురు ఏపీపీపీఎస్సీ చైర్మన్ మాత్రం ఆ చైర్మన్‌ పదవిని పట్టుకుని వేలాడుతుండడం జగన్ సర్కారుకు ఇబ్బందిగా మారింది.

ఏపీపీఎస్సీలో ఇప్పుడు చైర్మన్ తీసుకుంటున్న ప్రతీ నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయని ప్రభుత్వ వర్గాలు ఆడిపోసుకుంటున్నాయి. చైర్మన్‌ హోదాలో మిగిలిన సభ్యులతో కనీస సంప్రదింపులు జరపకుండా గ్రూప్‌1 - 2 - 3 పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను అనేకసార్లు మార్చుతూ విద్యార్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతున్నాడని స్వయంగా ఏపీపీఎస్సీ వర్గాలే ఆరోపిస్తున్నాయి.. పదే పదే సిలబస్‌ మార్చడం మూలంగా విద్యార్థులు ఈ పరీక్షలకు ఏ సిలబస్‌ చదువుకోవాలో తెలియక గందరగోళంలో పడుతున్నారు.

ఇక ఏపీపీఎస్సీ చైర్మన్ హోదాలోనే ఉండి కూడా తెరవెనుక వ్యాపారాలు చేస్తున్నాడన్న ఆరోపణలు వస్తున్నాయి.

హైదరాబాద్‌ లో ఉన్న ఒక అనామక కోచింగ్‌ సెంటర్‌ తో అతను లావాదేవీలు నడుపుతూ తెరవెనుక వ్యాపారాలు కూడా చేస్తున్నాడని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఆ కోచింగ్‌ సెంటర్‌ కు లాభం చేకూర్చేలాగా విద్యార్థులను ఎక్కువ రోజులు అతను సూచించిన కేంద్రాల్లోనే కోచింగ్‌ తీసుకునేలా ఒప్పందం కుదిర్చుకున్నాడని విద్యార్థులు బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. బలహీనవర్గాలకు - నిరుపేదలకు ఈ కోచింగ్‌ సెంటర్‌ ల ఫీజులు అధికంగా ఉండడం - ప్రతిభ ఉన్నా కానీ చదువుకోలేని పేద అభ్యర్థులు హైదరాబద్‌ కు రాలేకపోతున్నారు.

ఇక ప్రశ్నాపత్రాల తయారీలో సబ్జెక్ట్‌ లో లేనటువంటి ప్రశ్నలను గ్రూప్‌1 పరీక్షలో పొందుపరిచడం తాజాగా దుమారం రేపింది. ఈ ప్రశ్నాపత్రంలో 25 తప్పులు రావడంతో అనేక మంది విద్యార్థులు నష్టపోయారు. గ్రూప్‌1 పరీక్షలోనే కాకుండా ఏపీపీఎస్సీ నిర్వహించిన అన్నిపరీక్షల్లో అనేక పొరపాట్లు - తప్పుల తడకగా ఉన్న ప్రశ్నలు ఇప్పటి ఏపీపీఎస్సీ చైర్మన్ హయాంలోనే రావడంతో జగన్ సర్కారు దీనిపై సీరియస్ గా దృష్టిసారించింది. ఏపీపీఎస్సీ గ్రూప్‌ సభ్యులను సంప్రదించకుండా నెగెటివ్‌ మార్క్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టడం మూలంగా అనేక మంది విద్యార్థులు నష్టపోయారు. ఇందులో అధికంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల జీవితాలు నాశనమయ్యాయి.

ఏపీపీఎస్సీ చైర్మన్‌ హోదాలో 8 మంది సభ్యులను - శాశ్వత ఉద్యోగులను సంప్రదించకుండా నియంతృత్వ ధోరణిలో నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఏపీపీఎస్సీలోని వర్గాలే ఆరోపిస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.