Begin typing your search above and press return to search.

వావ్ అనిపించేలా... జీఈఎస్ ప్ర‌త్యేక‌త‌లు!

By:  Tupaki Desk   |   28 Nov 2017 7:01 AM GMT
వావ్ అనిపించేలా... జీఈఎస్ ప్ర‌త్యేక‌త‌లు!
X
నెల‌రోజులుగా మీడియా - సోష‌ల్‌ మీడియాలో విస్త‌ృత ప్ర‌చారం సాగిన జీఈఎస్ (ప్రపంచ పెట్టుబడిదారుల) సదస్సు నేడు ప్రారంభ‌మవ‌నుంది. ఈ స‌ద‌స్సుకు ఉన్న ప్ర‌త్యేక‌త‌లేంటి? దీనికి ఇంత ప్ర‌చారం ఇవ్వ‌ల్సిన అవ‌స‌రం ఉందా? అసలు ఈ స‌ద‌స్సు ముఖ్య ఉద్దేశ‌మేంటి? క‌లిగే ప్ర‌యోజ‌నాలేంటి? అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ముద్దుల త‌న‌య‌ - ఆయ‌న స‌ల‌హాదారు ఇవాంక రాక‌తో అత్యంత ఆస‌క్తిరేపుతున్న జీఈఎస్ స‌ద‌స్సుకు సంబంధించిన విశేషాలు ఇప్పుడు చూద్దాం.

హైద్రాబాద్‌లో జరుగుతున్న జీఈఎస్ (ప్రపంచ పెట్టుబడిదారుల) సదస్సుకు అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ సదస్సును తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ - సౌదీ అరేబియా - ఇజ్రాయిల్ త‌దిత‌ర పది దేశాల నుంచి మహిళా ప్రతినిధులే ఈ సదస్సుకు హజర‌వుతున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించనున్నారు. అమెరికాలో కాకుండా దక్షిణాసియాలో జరుగుతున్న తొలి సదస్సు హైద్రాబాద్‌ దే కావడం విశేషం. జీఈఎస్ 2017 సదస్సులో ప్రపంచవ్యాప్తంగా సుమారు 1600 మంది ప్రతినిధులు హజరౌతున్నారు. ఈ సదస్సుకు ఇవాంకా ట్రంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకొని నిర్వహిస్తున్న ఈ సదస్సులో ఇవాంకా పాల్గొనడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. మరో వైపు ఈ సదస్సుకు హజర‌వుతున్న‌ ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. మూడు రోజుల పాటు హైద్రాబాద్‌ నగరం జీఈఎస్ సదస్సుకు అతిథ్యం ఇవ్వనుంది.

గతంలో ఎప్పుడూ లేని విధంగా 52.5 శాతం మహిళా ప్రతినిధులే ఈ సదస్సులో పాల్గొంటున్నారు. అమెరికాలోని 38 రాష్ట్రాల నుంచి హజరైన ప్రతినిధులకు ఇవాంకా ట్రంప్ సారథ్యం వహిస్తున్నారు. ఈ సదస్సులో పాల్గొంటున్న మహిళా పారిశ్రామికవేత్తల్లో 30 ఏళ్ల‌లోపు వయస్సున్న వారు 5 శాతం ఉంటారని నిర్వాహకులు ప్రకటించారు. ఈ సదస్సులో పాల్గొంటున్నవారిలో పారిశ్రామికవేత్తల్లో అత్యంత పిన్న వయస్సు 13 ఏళ్లు. 84 ఏళ్ల‌ వయస్సున్న వారు కూడ ఈ సదస్సులో పాల్గొంటున్నారు. 2010 నుండి జీఈఎస్ సదస్సులు జరుగుతున్నాయి. అయితే ఎక్కువగా ఈ సదస్సులు అమెరికాలోనే జరిగాయి. ఇస్తాంబుల్ - దుబాయ్‌ - నైరోబి - కౌలాలంపూర్‌ లలో జరిగాయి. గత ఏడాది సిలికాన్ వ్యాలీలో జరిగింది. దక్షిణాసియాలో తొలిసారిగా హైద్రాబాద్‌ లో ఈ సదస్సు జరుగుతోంది. హెచ్‌ ఐసీసీలో మూడ్రోజులపాటు జరిగే సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ - ఇవాంకా ట్రంప్ - ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర‌రావు సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తారు. ప్రారంభ వేడుకల్లో వీరితో పాటు కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్ - నిర్మలా సీతారామన్‌ సహా పలువురు ముఖ్యులు పాల్గొంటారు.

వివిధ దేశాల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు ఉన్న అవకాశాలపై ప్లీనరీ సెషన్‌ మొదలవుతుంది. సిస్కో చైర్మన్‌ జాన్‌ చాంబర్స్‌ మోడరేటర్‌ గా వ్యవహరిస్తారు. ప్యానెల్‌ స్పీకర్లుగా ఇవాంక - ఎస్సారెస్‌ ఏవియేషన్ - పెట్రోలియం ఎండీ శిబొంగ్లే సాంబో - కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ - స్కాండినెవియా బ్యాంక్‌ ఛైర్మన్‌ మార్కస్‌ వ్యాలెన్‌ బర్గ్‌ ఉంటారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఇన్నోవేషన్స్‌ ఆన్‌ వర్క్‌ ఫోర్స్‌ డెవెలప్‌ మెంట్‌ అండ్‌ స్కిల్స్‌ ట్రైనింగ్‌ అనే చర్చా గోష్ఠిలోనూ ఇవాంకా పాల్గొంటారు. ఈ చర్చకు పరిశ్రమలు - ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ మోడరేటర్‌ గా వ్యవహరిస్తారు. ప్యానెల్‌లో ఇవాంకతో పాటు చెర్రీ బ్లెయిర్ - ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో చందా కొచ్చర్ - డెల్‌ సీసీవో కరెన్‌ క్వింటోస్‌ ఉంటారు.