Begin typing your search above and press return to search.

రైల్వే జోన్ వ‌చ్చేస్తుందంటున్న టీడీపీ ఎంపీ

By:  Tupaki Desk   |   10 Feb 2018 4:35 AM GMT
రైల్వే జోన్ వ‌చ్చేస్తుందంటున్న టీడీపీ ఎంపీ
X
కేంద్ర ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు ఏపీకి గుడ్ న్యూస్ చెప్ప‌నుంద‌ట‌. ఏపీకి సంబంధించిన కీల‌క డిమాండ్ల‌లో ఒక దానికి మోక్షం క‌లిగించ‌నుందట‌. ఈ మేర‌కు త్వ‌ర‌లో శుభ‌వార్త వినిపించ‌నుంద‌ట‌. అయితే ఈ విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వంలోని ముఖ్యులో...లేదా అధికార పార్టీ నేత‌లో వెల్ల‌డించ‌లేదు. బీజేపీతో మిత్ర‌ప‌క్షంగా ఉండి...ప్ర‌జ‌ల ఆకాంక్ష‌కు వినిపించ‌డం లేద‌నే అప‌ప్ర‌ద‌ను మూట‌గ‌ట్టుకుంటున్న టీడీపీ నేత‌లు చెప్తున్నారు. అంతేకాదు..గత అయిదు రోజులుగా చేస్తున్న ఆందోళన ఫలిస్తోందని తెలుగుదేశం ఎంపీలు ప్ర‌క‌టించుకుంటున్నారు.

పార్లమెంటు ముగిసిన తర్వాత భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలో భాజపా అగ్రనేతలు - తెలుగుదేశం నేతలు సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు చర్చలు సాగాయి. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను నెరవేర్చేందుకు కేంద్రం అంగీకరించిందని స‌మాచారం.. అయితే, ఇదివరకు వలె కేవలం మాటలతో కాకుండా స్పష్టమైన కాలపరిమితిని కూడా ఇందుకు నిర్దేశించినట్టు సమాచారం. రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు మార్చి 5న ప్రారంభం కానున్నాయి. ఆలోపు విభజన చట్టంలోని మెజారిటీ అంశాలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అంగీకారం కుదిరిందని టీడీపీ నేత‌లు చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేవలం మాటలు - హామీలతో కాకుండా నిర్దిష్ట కాలపరిమితి స్పష్టం చేయాలని డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి కేంద్రమంత్రి సుజనా చౌదరి కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ - పియూష్‌ గోయల్‌ తో పాటు అమిత్‌షాలకు తెలుగుదేశం డిమాండ్లను వివరించారు. దీనిపై స్పందించిన అమిత్‌ షా వెనువెంటనే కార్యాచరణను ప్రకటించాలని జైట్లీ - గోయల్‌ ను కోరారు.

కాగా, ఈ భేటీకి సంబంధించిన అనూహ్య‌మైన తీపిక‌బురును టీడీపీ ఎంపీలు పంచుకున్నారు. లోటుకు సంబంధించి మొదటి సంవత్సరంలో పది నెలలకు వచ్చిన లోటును ఒకేసారి చెల్లించేందుకు అభ్యంతరం లేదని జైట్లీ అంగీకరించినట్టు సమావేశానంతరం తనను కలిసిన విలేకరులతో టీడీపీ సీఎం రమేష్‌ చెప్పారు. అలాగే, విశాఖ రైల్వే జోన్‌ ను ఏక్షణంలో ప్రకటించమని చెప్పినా ప్రకటన వెలువరించేందుకు సిద్ధంగా ఉండాలని గోయల్‌ తో అమిత్‌ షా స్పష్టం చేసినట్టు సీఎం రమేష్‌ చెప్పారు. దుగరాజపట్నం పోర్టుకు సంబంధించి ఇస్రో కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసిందని, అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కోరితే అక్కడ పోర్టును నిర్మించడానికి సిద్ధమని చెప్పినట్టు అధికారవర్గాలు కూడా తెలిపాయి. అలాగే, కడప ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ - ప్రయివేట్‌ భాగస్వామ్యంలో నిర్మించేందుకు ఒప్పుకున్నారు. పోలవరంకు సంబంధించి ఇప్పటికే నిరాటంకంగా పనులు సాగుతున్నాయని - నిధుల కొరత లేదని జైట్లీ చెప్పారని మరో ఎంపీ తోట నరసింహం వెల్లడించారు. ఈఏపీ నిధులకు సంబంధించి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించినట్టు జైట్ల్లీ చెప్పారని ఎంపీలు తెలిపారు. అలాగే, కాకినాడ పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ కు సంబంధించి వెంటనే ప్రకటన చేయాలని చమురు సంస్థలను ఆదేశించినట్టు, ఇందుకు లేఖను కూడా ఇప్పటికే పంపించినట్ట జైట్లీ చెప్పారని ఎంపీలు వెల్లడించారు.