Begin typing your search above and press return to search.

ఈ నెల 30న బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తుది తీర్పు...ఉత్కంఠ

By:  Tupaki Desk   |   16 Sep 2020 3:30 PM GMT
ఈ నెల 30న బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తుది తీర్పు...ఉత్కంఠ
X
1992లో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అయోధ్య-రామజన్మభూమి వివాదం దశాబ్దాలపాటు అపరిష్కృతంగా ఉంది. ఈ నేపథ్యంలోనే కొద్ది నెలల క్రితం రామ మందిరం- బాబ్రీ మ‌సీదు స్థ‌ల వివాదంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పునిచ్చింది. బాబ్రీ మ‌సీదు ఉన్న స్థ‌లంలో రామ మందిరం నిర్మించేందుకు అనుమ‌తినివ్వడంతో ఈ వివాదానికి తెరపడింది. ఆగ‌స్టు 5న చారిత్రక రామాల‌యానికి శంకుస్థాప‌న కూడా జరిగింది. ఈ క్ర‌మంలోనే‌ బాబ్రీ కూల్చివేత కేసులో తుది తీర్పును సెప్టెంబరు 30లోపు వెలువరించాలని సుప్రీం....సీబీఐ ప్ర‌త్యేక కోర్టును ఆదేశించింది. ఈ క్రమంలోనే తాజాగా సెప్టెంబరు 30న బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తుది తీర్పు వెలువరించేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితులైన బీజేపీ కురువృద్ధులు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతిలు సెప్టెంబరు 30న తప్పకుండా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ద‌శాబ్దాల త‌ర‌బ‌డి సాగుతున్న‌ బాబ్రీ మసీదు కూల్చివేత కేసు చివ‌రి ద‌శ‌కు చేరింది. కేసుకు సంబంధించిన విచార‌ణ ఇప్ప‌టికే పూర్త‌యింది. దీంతో ఈ నెల 30న తుది తీర్పు ఇచ్చేందుకు సీబీఐ ప్ర‌త్యేక కోర్టు సిద్ధ‌మైంది. 1992, డిసెంబరు 6న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో బీజేపీ కురువృద్ధులు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, కల్యాణ్ సింగ్ స‌హా 32 మంది తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే జూలై 24న అద్వాని స్టేట్మెంట్ ను ప్రత్యేక సీబీఐ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రికార్డ్ చేసింది. తాను ఏ తప్పు చేయలేదని అద్వాని విచారణలో వెల్లడించారు. తనకు ఎలాంటి శిక్ష పడినా అనుభవించడానికి సిద్ధమేనని ఉమాభారతి విచారణ అనంతరం అన్నారు. ఈ కేసు విచారణ పూర్తయిన నేపథ్యంలో సెప్టెంబరు 30న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా తప్పక హాజ‌రు కావాల‌ని కోర్టు ఆదేశించింది. దీంతో, తుదితీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.