Begin typing your search above and press return to search.

పుల్ గా తాగేసి.. రోడ్డు మీదకు బదులుగా రైల్వే ట్రాక్ మీద దూసుకెళ్లింది

By:  Tupaki Desk   |   14 Nov 2020 11:30 PM GMT
పుల్ గా తాగేసి.. రోడ్డు మీదకు బదులుగా రైల్వే ట్రాక్ మీద దూసుకెళ్లింది
X
రెండు రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఒక ఉదంతం ఆసక్తికరంగా మారటమే కాదు.. పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు మీద తాగేస్తున్న మందుబాబుల్ని.. పోలీస్ జీపులో వెళుతున్న సీఐ వారిని చూసి ఆగి ప్రశ్నించారు. ఈ క్రమంలో వారిలోని ఒకడు సీఐ వాహనాన్నిఎత్తుకెళ్లిపోయిన ఉదంతం సంచలనంగా మారింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మందుబాబులు ఎంతలా చెలరేగిపోతున్నారనటానికి ఈ ఉదంతం ఒక నిదర్శనంగా నిలిచే పరిస్థితి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఒక మహిళ ఫుల్ గా తాగేసి.. కారును డ్రైవ్ చేయటమే కాదు.. తాను ఎటు వెళుతున్నానో కూడా తెలీని పరిస్థితుల్లో కారును ఏకంగా రైల్వే ట్రాక్ మీదకు దూసుకెళ్లిన వైనం స్పెయిన్ లో చోటు చేసుకుంది. మద్యం తాగేందుకు చట్టబద్ధంగా ఉన్న పరిమితికి మూడు రెట్లు అధికంగా తాగేసిన సదరు మహిళ.. ఒళ్లు పై తెలీని మత్తులో రైల్వే ట్రాక్ మీదకు వెళ్లిపోయింది.

దాదాపు కిలో మీటరు వరకు వెళ్లిన ఆమె.. మరింత దూరం వెళ్లేది. కానీ.. అప్పటికే ఆమె కారు మూడు టైర్లు పంక్చరు కావటంతో ట్రాక్ మీద ఆగిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు సదరుమహిళను అదుపులోకి తీసుకున్నారు. సెక్యురిటీ సిబ్బంది సాయంతో ఆగిన కారును పక్కకు తీశారు. ఈ సమయంలో ఆ ట్రాక్ మీద రైళ్లు రాకపోవటంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. మద్యం తాగి నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు ఆమెను పోలీసులు అరెస్టు చేసి.. క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కారు నడిపిన కారణంగా రైల్వే ట్రాక్ దెబ్బ తినలేదు. కానీ.. రైళ్ల రాకపోకల్ని దాదాపు రెండు గంటల పాటు ఆపేశారు. దీనికి సంబంధించిన సీసీ కెమేరా ఫుటేజ్ తాజాగా వైరల్ గా మారింది.