Begin typing your search above and press return to search.

మరో యుద్ధ ముప్పు.. ఏకంగా 180 యుద్ధ విమానాల మోహరింపుతో ఆ దేశం దూకుడు!

By:  Tupaki Desk   |   4 Nov 2022 3:30 PM GMT
మరో యుద్ధ ముప్పు.. ఏకంగా 180 యుద్ధ విమానాల మోహరింపుతో ఆ దేశం దూకుడు!
X
ప్రస్తుతం రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం ప్రభావంతో ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. ప్రపంచంలో గోధుమను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాలుగా ఉన్న రష్యా, ఉక్రెయిన్‌ ప్రస్తుతం ఎగుమతులను ఆపేశాయి. రష్యా తన చమురును యూరోప్‌ దేశాలకు విక్రయించడం ఆపేసింది. దీంతో ప్రపంచంలో ఇంధన ధరలు, ఆహార ధాన్యాల ధరలు భగ్గుమంటున్నాయి.

ఇప్పుడు మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు ఉత్తర కొరియా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఉత్తర కొరియా – దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తతలు మెల్లగా పెరుగుతున్నాయి.

నిన్నటి వరకు వరుస క్షిపణి పరీక్షలతో ఉత్తర కొరియా బెంబేలెత్తించింది. దీనికి ధీటుగా అమెరికాఇ, దక్షిణ కొరియా సైతం యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి. అంతేకాకుండా క్షిపణి పరీక్షలు నిర్వహించి ఉత్తర కొరియాకు పరోక్ష హెచ్చరికలు జారీ చేశాయి.

దీంతో రెచ్చిపోయిన ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఏకంగా 180 యుద్ధవిమానాలను దక్షిణ కొరియాతో సరిహద్దుల్లో మోహరించింది. దీంతో అప్రమత్తమైన దక్షిణ కొరియా సైతం అత్యవసరంగా 80 యుద్ధ విమానాలను గగనతల రక్షణకు తరలించింది. వీటిల్లో అత్యాధునిక ఎఫ్‌–35ఏ మోడల్‌ విమానాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. 1953లో కొరియా యుద్ధం ముగిసిన తర్వాత ఆ స్థాయిలో ఉద్రిక్తతలు తలెత్తడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

ఓ పక్క తమ మిత్ర దేశం అమెరికాతో కలిసి విజిలెంట్‌ స్ట్రామ్‌ పేరిట దక్షిణ కొరియా సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్న సమయంలోనే ఉత్తర కొరియా దుందుడుకు చర్యకు పాల్పడింది.

అక్టోబర్‌లో కూడా 10 యుద్ధ విమానాలను దక్షిణ కొరియా సరిహద్దుల సమీపంలో ఉత్తర కొరియా మోహరించింది. నవంబర్‌ 6 రాత్రి దాదాపు 80 శతఘ్ని గుండ్లను ఉత్తరకొరియా పేల్చడం గమనార్హం. ఇది 2018లో చేసుకొన్న ఒప్పందానికి విరుద్ధమని దక్షిణ కొరియా విమర్శిస్తోంది. ఈ ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే ఓ ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి (ఐసీబీఎం) సహా ఆరు మిస్సైళ్లను ఉత్తర కొరియా ప్రయోగించింది. వీటిలో ఒకటి దక్షిణ కొరియా సరిహద్దుల్లోకి వచ్చి పడ్డట్టు సమాచారం.

ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగ సమాచారంతో ప్రజలంతా సురక్షితమైన భవనాలు లేదా భూగర్భ ప్రాంతాల్లో తలదాచుకోవాలంటూ జపాన్‌ సూచనలు జారీ చేసింది. దక్షిణ కొరియాతోనే కాకుండా జపాన్‌తో ఉత్తర కొరియాకు వివాదాలు ఉండటం గమనార్హం. ఉత్తర కొరియా దుందుడుకు చర్యలతో జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో బుల్లెట్‌ ట్రైన్‌ సేవలను కూడా తాత్కాలికంగా నిలిపేశారు. నవంబర్‌ 5, 6 తేదీల్లో మొత్తం 30 క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించడం గమనార్హం. వీటిల్లో ఒకటి దక్షిణ కొరియా ప్రాదేశిక జలాల్లో పడింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.