Begin typing your search above and press return to search.

ఏపీ రాజధానిపై టీడీపీకి సోము వీర్రాజు షాక్

By:  Tupaki Desk   |   30 July 2020 6:26 PM GMT
ఏపీ రాజధానిపై టీడీపీకి సోము వీర్రాజు షాక్
X
రాజధాని విషయంలో తాము జోక్యం చేసుకోమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు గురువారం తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా చేయగా, ప్రస్తుత ప్రభుత్వం దీనిని మూడు రాజధానులుగా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ అంశంపై వీర్రాజు తాజాగా టీడీపీకి అసంతృప్తి కలిగించే కామెంట్స్ చేశారు. రాజధాని అంశంలో కేంద్రం జోక్యం చేసుకోదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయంలో కేంద్రం ఎప్పుడూ జోక్యం చేసుకోదన్నారు. రాజధాని పేరుతో గత ప్రభుత్వం సింగపూర్, జపాన్, చైనా అంటూ ప్రజల్ని మభ్యపెట్టిందన్నారు.

నాడు మాజీ సీఎం చంద్రబాబు సింగపూర్, జపాన్ అంటూ ప్రజలను మభ్యపెట్టినా కేంద్రం మాట్లాడలేదని, ఇప్పుడు మూడు రాజధానుల విషయంలోను అదే వైఖరితో ఉన్నామన్నారు. అయితే అమరావతి రైతులకు న్యాయం జరగాలన్నదే తమ నినాదమని, దీనికి కట్టుబడి ఉంటామన్నారు. రాజధాని పేరుతో టీడీపీ తమను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్ర రాజకీయాలపై సీరియస్‌గా దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.

చంద్రబాబు మళ్లీ తమకు దగ్గరవుతున్న సంకేతాలు ఇస్తున్నారని, ఇది ఆయన రాజకీయ చదరంగం అని సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. బీజేపీ, జనసేనకు ఇరవై శాతం వరకు ఓటు బ్యాంకు ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. టీడీపీ అంటే ఫ్యామిలీ పార్టీ అని, కానీ బీజేపీ ప్రజల పార్టీ అన్నారు. టీడీపీలో ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు అధ్యక్షుడు అయ్యాడని గుర్తు చేశారు. నేడు జగన్, నిన్న చంద్రబాబు చేతుల్లోనే పవర్ ఉంటుందని, తమకు జగన్ ఆ పదవి ఇచ్చారని, చంద్రబాబు ఈ పదవి ఇచ్చారని చెబుతారని కానీ నడిపించేది వారేనని అభిప్రాయపడ్డారు.