Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ఓట‌మి గురించి వీర్రాజు విశ్లేష‌ణ‌

By:  Tupaki Desk   |   17 Jun 2017 10:40 AM GMT
కాంగ్రెస్ ఓట‌మి గురించి వీర్రాజు విశ్లేష‌ణ‌
X
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు - ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియా ముందుకు వ‌చ్చేది త‌క్కువ‌. అయితే అలా వ‌చ్చి విలేక‌రుల స‌మావేశం - పార్టీ కార్య‌క్ర‌మం - బ‌హిరంగ స‌భ‌....ఏదైనా ఆయ‌న ప్ర‌సంగించారు అంటే అందులో హాట్ కామెంట్లు - ఘాటు విమ‌ర్శ‌లు త‌ప్ప‌క ఉంటాయి. అలా త‌న‌దైన శైలిలోని ప్ర‌త్యేక విశ్లేష‌ణ‌లు తాజాగా వీర్రాజు వివ‌రించారు. ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోడీ మూడేళ్ల పాలనపై తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఆవును తినే సంస్కృతి కాంగ్రెస్‌ పార్టీలో ఉండటం వల్లే మతిభ్రమించి బీజేపీని విమర్శిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ గోభక్షణ పార్టీ కాబ‌ట్టే దేశంలో పతనమైందని వీర్రాజు వివ‌రించారు.

పచ్చిమాంసం తినే సంస్కృతి కలిగిన కాంగ్రెస్ పార్టీ బీజేపీని విమర్శిస్తుండ‌టం చూస్తే విస్మ‌య‌క‌రంగా ఉంద‌ని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ భద్రాచలం రాముడిని తిరిగి తీసుకురాగలదా? అని ప్రశ్నించారు. పోలవరం ముంపు మండలాలను, భద్రాచలం రాముడిని తెలంగాణకు ఇచ్చేసిన కాంగ్రెస్‌ కు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రాయలసీమను దగాచేసి దుమ్ముగూడెంను తెలంగాణకు పట్టుకుపోయిన కాంగ్రెస్ దగాకోరు పార్టీ అని వీర్రాజు ఆరోపించారు. సామాన్య వ్యక్తి నరేంద్రమోడీ దేశాన్ని అభివృద్ధిపథంలో పయనింపజేస్తున్నారని చెప్పారు. పదేళ్లు కేంద్ర మంత్రిగా ఉన్న పళ్లంరాజు సొంత జిల్లా తూర్పు గోదావరికి ఒక్క ప్రాజెక్టు కూడా సాధించలేకపోయారని వీర్రాజు ఎద్దేవా చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో రాష్ట్రానికి లక్షల కోట్లు వరదలా వస్తున్నాయని సోము వీర్రాజు అన్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వ హయాంలో తూర్పు గోదావరి జిల్లాకు రూ.3600 కోట్ల నేవిగేషన్ ప్రాజెక్టు, రూ.330 కోట్లతో కాకినాడ మెయిన్ లైన్, రూ.1.34 లక్షల కోట్లతో నాలుగు లేన్ల రోడ్లు, రూ.450 కోట్లతో నల్లజర్ల రోడ్డు, రూ.3600 కోట్లతో అంతర్వేదిలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ యూనిట్ వచ్చిందన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి సమ్మేళన్‌ను ప్రారంభించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ మూడేళ్లలో ఎటువంటి అవినీతి మచ్చ లేకుండా పాలన సాగించిన ఘనత నరేంద్రమోడీనన్నారు. కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని నాశనం చేస్తే బీజేపీ అభివృద్ధి చేస్తోందని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో కామన్‌వెల్త్‌ క్రీడలు, 2జీ స్పెక్ట్రమ్‌, బొగ్గు తదితర కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. నిరాశా నిస్పృహల మధ్య ఉన్న కాంగ్రెస్‌ మోడీపై బురద జల్లుతోందని చెప్పారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ను మోడీ తీర్చిదిద్దుతున్నారన్నారు. ఒక దేశం, ఒక పన్ను పేరిట జిఎస్‌టి అత్యంత విప్లవాత్మక పన్ను సంస్కరణ అని ఆయన అభిప్రాయపడ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/