Begin typing your search above and press return to search.

వేస‌వి సెల‌వులు.. వ‌ర్షాకాలంలో ఇస్తారా? జ‌గ‌న్‌పై సోము ఫైర్‌

By:  Tupaki Desk   |   25 April 2022 1:30 PM GMT
వేస‌వి సెల‌వులు.. వ‌ర్షాకాలంలో ఇస్తారా?  జ‌గ‌న్‌పై సోము ఫైర్‌
X
ఏపీ సీఎం జ‌గ‌న్‌పై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వేస‌వి సెల‌వుల‌ను మార్చ‌డంపై ఆయ‌న తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని విద్యాశాఖ వెంటనే ఉపసం హరించుకోవాలని డిమాండ్ చేశారు.

సోమవారం మీడియాతో మాట్లాడుతూ... సెలవులు వేసవిలో కాకుండా వర్షాకాలం ఇస్తారా అంటూ యెద్దేవా చేశారు. మే7వ తేదీతో ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతున్న దశలో వాల్యూవేషన్ డ్యూటీలో ఉండే ఉపాధ్యాయులకు ఈఎల్స్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ విధంగా డొంకతిరుగుడుగా వ్యవహరిస్తోందని సోమువీర్రాజు మండిపడ్డారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంవత్సరాన్ని జూన్ 12 నుంచి జులై 8కి మార్చటాన్ని ఆయన తప్పుబట్టారు. పాఠశాలలు మూసివేయటం వంటి విధానాలతో విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని విమర్శించారు. అమ్మ ఒడిని ఏటా అందిస్తామ‌ని చెప్పిన ప్ర‌భుత్వం ఇప్పటికే ఒక సంవ‌త్స‌రం ఎగ్గొట్టేందుకు ప్లాన్ చేసుకుంద‌న్నారు.

ఇప్ప‌టికే ల‌బ్ధిదారుల సంఖ్య‌ను కూడా గ‌ణ‌నీయంగా త‌గ్గించార‌ని మండిప‌డ్డారు. క‌రెంటు మీట‌ర్ రీడింగ్ 300 యూనిట్లు వ‌చ్చినా.. ఆదాయం ఎక్కువున్నా.. కారున్నా.. దీనిని కోసేయ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించారు. ఇది త‌ప్పు డు విధాన‌మ‌న్నారు.

ఇక‌, కేంద్రం ఇస్తున్న నిధుల‌తోనే రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌థ‌కాలు అమ‌లు చేసుకుంటూ.. నిధుల‌ను మ‌ళ్లిస్తోంద‌ని సోము వీర్రాజు మండిప‌డ్డారు. తాము అన్నీ గ‌మ‌నిస్తున్నామ‌ని.. ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల‌పై ఇప్ప‌టికే ఒక నివేదిక సిద్ధం చేశామ‌ని.. త్వ‌ర‌లోనే ఢిల్లీకి వెళ్లి.. కేంద్రానికి అంద‌జేయ‌నున్నామ‌ని అన్నారు.

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న బీజేపీ.. ఎవ‌రితోనూ పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల్లోకి వెళ్ల‌బోద‌న్నారు. ఇప్ప‌టికే జ‌న‌సేన‌తో ఉన్న పొత్తు చాల‌న్నారు. తాము గెలిచి తీరుతామ‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా పార్టీని ముందుకు న‌డిపిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. ఈ విష‌యంలో మ‌రో వ్యూహం అంటూ ఏమీ లేద‌న్న ఆయ‌న‌.. త్వ‌ర‌లోనే పార్టీ స‌భ్య‌త్వ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు.