Begin typing your search above and press return to search.

ఏపీ స‌ర్కారుపై సోము ఫైర్‌.. రీజ‌న్ ఇదే

By:  Tupaki Desk   |   18 April 2022 1:30 AM GMT
ఏపీ స‌ర్కారుపై సోము ఫైర్‌.. రీజ‌న్ ఇదే
X
ఏపీ సీఎం, ప్ర‌భుత్వంపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఓ రేంజ్‌లో ఫైర‌య్యారు. ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటుతో దేవాల‌యాల విభ‌జ‌న కూడా జ‌రిగిపోయింది. ఆయా దేవాల‌యాల‌కు సంబంధించి కొత్త‌గా కార్యాల‌ను ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. అయితే.. ఈ క్ర‌మంలో కొత్త జిల్లాల్లోని కొత్త ఆఫీసుల మరమ్మతులు, ఫర్నీచర్‌ ఖర్చులు భరించాలంటూ దేవదాయ కమిషనర్‌ ఆలయాల ఈవోలకు ఆదేశాలు జారీచేశారు. ప్రాంతాలవారీగా కొత్త జిల్లాల్లోని పెద్ద ఆలయాలకు ఆ నగదు ఇచ్చే బాధ్యత ముడిపెట్టారు. కామన్‌గుడ్‌ ఫండ్‌(సీజీఎఫ్‌) నుంచి ఈ నగదును రీయింబర్స్‌ చేస్తామని పేర్కొన్నారు.

కానీ ఆలయాల నుంచి ఇలా లక్షలాది రూపాయల నగదు తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలయాల నుంచి దేవదాయశాఖ ఏటా సీజీఎఫ్‌, ఈఏఎఫ్‌, అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌ల కింద నిర్దేశిత శాతాల్లో నగదు వసూలు చేస్తోంది. వాటితోనే కమిషనర్‌ నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకూ జీతాలు ఇస్తారు. అలాగే ఆలయాల జీర్ణోద్ధరణ పనులకు సీజీఎఫ్‌ నిధులను వినియోగిస్తారు. ఆ మొత్తాలు మినహా ఆలయాల నుంచి ఎలాంటి నగదును ఏ రూపంలోనూ వసూలుచేయకూడదని నిబంధనలు చెబుతున్నాయి.

కానీ అందుకు విరుద్ధంగా ఇప్పుడు రీయింబర్స్‌ అనే పేరుతో ప్రభుత్వం ఆలయాల నుంచి వసూళ్లు చేపడుతోంది. ఈ నగదును ప్రభుత్వం వెచ్చించే వీలున్నప్పటికీ ఆ భారం ఆలయాలపైనే మోపింది. లేదంటే ప్రభుత్వం ముందు నగదు ఇస్తే, సీజీఎఫ్‌ నుంచి ప్రభుత్వానికే రీయింబర్స్‌ చేసే వీలుంది. కానీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకుండా కొత్త జిల్లాల భారం పూర్తిగా ఆలయాలపై వేసింది.

ఈ నేప‌థ్యంలో దీనిపై స్పందించిన సోము వీర్రాజు.. జిల్లా కార్యాలయాల నిర్వహణకు దేవాలయాల నిధులిస్తే ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని సోము వీర్రాజు హెచ్చరించారు. కొత్త జిల్లాలలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటుకు హిందూ దేవాలయాలు నుంచి నిధులు ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం దేవాలయాల నుంచి నిధులు సేకరించా లని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. అదేస‌మ‌యంలో ఆయ‌న అమ్మఒడి ప‌థ‌కంపైనా స్పందించారు. దీనిని గత ఏడాది ఇవ్వలేదని.. ఈ ఏడాది జూన్ నెలలో ఇస్తామని చెప్పారని సోము వీర్రాజు గుర్తుచేశారు.

జిల్లాల విభజన పూర్తి కాగానే అమ్మఒడికి కొత్త నిబంధనలు ప్రకటించారని ఆరోపించారు. అమ్మ ఒడి పథకానికి 300 యూనిట్లు విద్యుత్ ప్రామాణికం పెడితే ఎలా అని నిలదీశారు. ఆధార్‌లో కొత్త జిల్లా నమోదు వంటివి చాలా నిబంధనలు పెట్టారని.. ఈ కారణంగా 60శాతం మందికి అమ్మ ఒడి డబ్బులు రావని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మఒడి తొలి ఏడాది ఎలా ఇచ్చారో అలాగే ఈ ఏడాది కూడా ఇవ్వాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న తుగ్లక్ చర్యలను తాము అడ్డుకుంటామని ఆయన పేర్కొన్నారు.