Begin typing your search above and press return to search.

ఇంట గెలవలేని సోమిరెడ్డి రచ్చ గెలుస్తారట..

By:  Tupaki Desk   |   3 March 2017 6:46 AM GMT
ఇంట గెలవలేని సోమిరెడ్డి రచ్చ గెలుస్తారట..
X
కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకాను ఓడించి వైఎస్ కంచుకోటను బద్దలు కొడుతామని టీడీపీ నేతలు జబ్బలు చరుస్తున్నారు. మరీ ముఖ్యంగా అక్కడి వ్యవహారాలు చూస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే భారీ డైలాగులే కొడుతున్నారు. అయితే.. కడప సంగతేమో గానీ సోమిరెడ్డి సొంతజిల్లాలోనే టీడీపీకి చుక్కలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులు వైసీపీలోకి చేరిపోతున్నారు. సోమిరెడ్డి నేరుగాజోక్యం చేసుకుని పార్టీ మారవద్దని సూచించినా కొందరు నేతలు లెక్క చేయలేదట.

కోవూరు నియోజకవర్గంలో 30ఏళ్లుగా టీడీపీకి సేవ చేస్తున్న పలువురు నేతలు గురువారం వైసీపీలో చేరిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి తమను తొక్కేస్తున్నారని.. మూడేళ్లుగా చిత్రహింసలు పెట్టారంటూ ఇందుకూరు టీడీపీ ఎంపీపీ కైలాసం రేణుక ఆరోపించారు. ఆమెతో పాటు భర్త - మాజీ జెడ్పీటీసీ కైలాసం ఆదిశేషారెడ్డి - ఎంపీటీసీలు వెంకటసుబ్బమ్మ - సుప్రియ - పలువురు మాజీ సర్పంచ్ వైసీపీలో చేరిపోయారు. పట్టభద్రుల టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ముఖ్య అనుచరులైన ఇద్దరు ఎంపీటీసీలు కూడా వైసీపీలో చేరిపోయారు. ఈ పరిణామంతో టీడీపీ నేతలు కలవరపడుతున్నారు.

పరిస్థితి విషమిస్తుండడంతో.. కడప రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వెళ్లిన సోమిరెడ్డి రంగంలోకి దిగారు. కైలాసం ఆదిశేషారెడ్డిని బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అయితే వారితో ఫోన్‌ లో మాట్లాడేందుకు కూడా ఆయన ఇష్టపడలేదట. మూడేళ్లుగా తమను ఎమ్మెల్యే పోలంరెడ్డి వేధిస్తుంటే ఒక్క టీడీపీ నాయకుడు కూడా అండగా నిలబడలేదని… ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు పోతాయన్న ఉద్దేశంతో ఆఘమేఘాల మీద స్పందిస్తున్నారని ఆదిశేషారెడ్డి మండిపడ్డారు. పార్టీని వీడతున్న నేతలకు ఫోన్లు చేస్తూ సోమిరెడ్డి ఎంతగా బతిమలాడుతున్నా వారు ససేమిరా అంటున్నారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/