Begin typing your search above and press return to search.

కొందరు చెప్పలేదు.. నేను చెబుతున్నానంటూ ఓపెన్.. వైరల్ పోస్టు

By:  Tupaki Desk   |   5 Aug 2021 5:15 AM GMT
కొందరు చెప్పలేదు.. నేను చెబుతున్నానంటూ ఓపెన్.. వైరల్ పోస్టు
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ షురూ చేసిన.. ‘తెలంగాణ దళిత బంధు’ కార్యక్రమం ఎందుకన్న విషయం అందరికి తెలిసిందే. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొద్ది రోజుల్లో హుజూరాబాద్ లో ప్రారంభం కావాల్సిన ఈ పథకం.. యమా అర్జెంట్ గా.. తాను తొలుత ప్రకటించిన దానికి భిన్నంగా నల్గొండ జిల్లాలోని తన మనసు దోచేసిన వాసాలమర్రి నుంచి ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికే ఆ ఊరిని మొత్తంగా మార్చేస్తానని చెప్పిన కేసీఆర్.. తాజాగా దళితబంధుపథకంలో భాగంగా.. ఎంపిక చేసిన కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇస్తామని చెప్పటం తెలిసిందే.

ఈ పథకంలో భాగంగా వాసాలమర్రిలో ఎంపిక చేసిన 76 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చొప్పున రూ.7.6 కోట్ల మొత్తాన్ని విడుదల చేస్తామని.. ఆ మొత్తాన్ని ఈ రోజు (గురువారం) బాధితుల ఖాతాలోకి మళ్లిస్తామని ప్రకటించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పథకాల్ని తీసుకురావాల్సిందే. కానీ.. ఇంతలానా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది. సమాజంలో అణగారిన వర్గాలను పైకి తీసుకురావటానికి.. వారి బ్యాంకు ఖాతాల్లో లక్షలాది రూపాయిలు ఇవ్వటమే పరిష్కారమా? అలాంటప్పుడు మిగిలిన వర్గాల్లోని పేద కుటుంబాల వారి మాటేమిటి?

ఆకలి అయితే కడుపు నిండా అన్నం పెట్టాలి. ఆ అన్నం అరిగే వరకు పని ఉండేలా ఏర్పాట్లు చేయాలి. అంతేకానీ.. ఇలా డబ్బులు ఇచ్చుకుంటూ పోతే ఎలా? అన్నది ప్రశ్నగా మారింది. ఈ పథకంపై తాజాగా ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు ఒకటి వైరల్ గా మారింది. సుత్తి లేకుండా సూటిగా విషయాన్ని చెప్పేసిన ఈ పోస్టు చదివిన వారంతా.. విషయాన్ని ఎంత సింఫుల్ గా చక్కగా చెప్పేశారన్న భావన కలుగుతుంది. ఒక పాత్రికేయ మిత్రుడు పెట్టిన ఈ పోస్టులో అతగాడు చివర్లో అన్న మాట ఇట్టే టచ్ చేయటం ఖాయం. ‘కొందరు చెప్పలేదు.. నేను చెబుతున్నా’అంటూ విషయాన్ని తేల్చేశారు. ఆలోచించేలా ఉన్న ఈ పోస్టు చదివాక మీకు కూడా.. చెప్పాలన్న భావన కలిగే అవకాశం ఎక్కువ. ఆ పోస్టును యథాతధంగా చూస్తే..

ఎవడి సొమ్ము ? ఎవడు దానం చేస్తున్నాడు?

చిన్న జీతంతో ఉద్యోగం చేస్తున్న వారు ఏ అత్యవసరం కోసమో 2 లక్షలు లోను కావాలని అడిగితే సవాలక్ష ప్రశ్నలు వేసి బ్యాంకులు లోను కూడా ఇవ్వవు.

కానీ ఉద్దరగా పది లక్షలు దానమా?

వాటిని ఏం చేసుకున్నా అడగరా?

ఏమిటీ అరాచకం ?

మీడియా ప్రశ్నించదా?

మిగతా వాళ్లు ప్రజలు కాదా?

సామాన్యులు నిలదీయరా?

కోర్టులు జోక్యం చేసుకోవా?

...
ఒక ప్రాజెక్టు కట్టి నీళ్లు ఇస్తే పంటలు పండతాయి. తిండివస్తుంది, నలుగురికి పని దొరుకుతుంది.

ఒక స్కూలు కట్టి చదువు నేర్పిస్తే బతుకులు బాగుపడతాయి

ఒక ఆస్పత్రి కట్టి వైద్యం చేస్తే కుటుంబాలు బాగుపడతాయి

కానీ ఇలా పది లక్షలు సమాజంలో కొందరికి మాత్రమే పంచితే మిగతా వాళ్లు ఏమైపోవాలి?

ఇదేం వివక్ష?

ఇదెక్కడి అరాచకం?

ఒక పనికిమాలిన ఎన్నిక కోసం సమాజాన్ని పాడు చేస్తారా?

జనంలో ఇంత చిచ్చుపెడతారా?

కష్టాల్లో ఉన్నోడికి పని ఇప్పించాలి.

ఒక ఉచిత నివాసం, ఉచిత వైద్యం, ఉచిత చదువు ఇస్తే చాలు.

ఇలా డబ్బులు ఇవ్వడం ఏంటి? అది కూడా పది లక్షలా?

గుర్తుపెట్టుకో నీ పతనానికి ఇదే పునాది !!

రాజకీయం గురించి ఎందుకులే, మన పని మనం చేసుకుందాం అని చాలామంది నాలాగే అనుకుంటారు, కానీ ఇలాంటి పనులు చేస్తే ఎవడికైనా ఓపిక నశిస్తుంది.

ఇది కొందరికి కోపం తెప్పించొచ్చు. అయినా పర్లేదు 80 శాతం ప్రజల్లో ఇదే ఆవేదన ఉంది. కొందరు చెప్పలేదు, నేను చెబుతున్నాను అంతే.