Begin typing your search above and press return to search.

వెంక‌య్య‌పై నిప్పులు చెరిగిన తెలుగు ఎంపీ

By:  Tupaki Desk   |   6 Nov 2015 7:23 AM GMT
వెంక‌య్య‌పై నిప్పులు చెరిగిన తెలుగు ఎంపీ
X
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుపై తెలుగు ఎంపీ - సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. దేశంలో అస‌హ‌నం త‌దిత‌ర ప‌రిణామాల‌పై వెంకయ్యనాయుడు విడుదల జేసిన పుస్తకం 'నిజం తెలుసుకోండి' (నో ది ట్రూత్‌)లో కొత్తదనమేమీ లేదని చెప్పారు. వామ‌ప‌క్ష పార్టీల‌పై బీజేపీ గతంలో చేసిన ఆరోపణలను ఇందులో మరోసారి ప్రస్తావించారని ఏచూరి వ్యాఖ్యానించారు. వెంక‌య్య ఎన్నో విష‌యాలు తెలుసుకోవాలంటూ చ‌రిత్ర విప్పారు.

బీజేపీ-ఆర్ ఎస్ ఎస్‌ ల ఆలోచనా విధానాన్ని విద్యా - మేధావి వర్గం ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే వుంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశంలో చెలరేగుతున్న అసహనం అంతా ఆర్ ఎస్ ఎస్‌ - దాని అనుబంధ సంఘాలను వ్యతిరేకిస్తున్న వారికి బెదిరింపుల రూపంలో సాగుతోందని ఏచూరి స్పష్టం చేశారు. ప్రభుత్వ పురస్కారాలను వాపస్‌ చేసే నిరసన ప్రక్రియ కొత్తదేమీ కాదని, గతంలో ఇది అనేక సార్లు జరిగిందని చెప్పారు.

దేశంలో మేధావుల ఆలోచనలను లెఫ్ట్‌ తప్పుదోవ పట్టిస్తోందని ఆ పుస్త‌కంలో విమర్శించారని, వామపక్ష మేధావుల ఆలోచనా ధోరణి పరిశీలనాత్మకంగానే ఉంటుందని, ఇకపై కూడా అదే విధంగా కొనసాగుతుందని ఏచూరి స్పష్టం చేశారు. వారి మేధోసంపత్తి - హేతువాదం - చరిత్ర అధ్యయనం వంటివి ఇందుకు ప్రధాన కారణాలని ఆయన వివరించారు. ఈ ఉన్నత ప్రమాణాలను అందుకోలేక ఆపసోపాలు పడుతున్న ఆర్ ఎస్ ఎస్‌ మరోసారి తప్పుడు సమాచారంతో 'సైద్ధాంతిక దురుద్దేశాల'ను ఆపాదిస్తోందని విమర్శించారు. భారత్‌ లో మేధావి వర్గం అంతా సీపీఎంతోనే ఉందంటూ వ్యాఖ్యానించిన వెంకయ్య నాయుడుకు తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

దేశంలో వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న హింసాత్మక దాడులు ప్రస్తుత అసహనానికి పరాకాష్టగా నిలుస్తున్నాయన్నారు. ఈ అంశాలను ఇప్పటివరకూ ప్రభుత్వ దృష్టికి తీసుకురాలేదనటం పచ్చి అబద్ధమని, మోడీ ప్రధానిగా అధికారపగ్గాలు చేపట్టిన తరువాత పార్లమెంట్‌ తొలి సమావేశంలోనే హింసకు పాల్పడుతున్న వారు, బాధ్యతారహిత వ్యాఖ్యల ద్వారా హింసను ప్రేరేపిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని లేదా కనీసం చర్య తీసుకుంటామన్న హామీ అయినా ఇవ్వాలన్న డిమాండ్లు వెల్లువెత్తిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వెంక‌య్య‌నాయుడుకు మోడీపై ప్ర‌భుత్వంపై అభిమానం ఉంటే దాన్ని చాటుకునేందుకు మ‌రెన్నో మార్గాలున్నాయ‌నే విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని కోరారు.