Begin typing your search above and press return to search.

మొగుడిపై పోలీసు కేసు పెట్టిన సింగర్

By:  Tupaki Desk   |   12 March 2016 6:27 PM GMT
మొగుడిపై పోలీసు కేసు పెట్టిన సింగర్
X
‘ఆడపిల్లనమ్మా... ఆడపిల్లనమ్మా’ అంటూ అమ్మాయిల వ్యథల గురంచి పాటను ఆలపించి మహిళాలోకాన్ని ఆకట్టుకున్న సింగర్ మధుప్రియకు భర్త నుంచి వేధింపులు ఎదురు కావడంతో పోలీసులను ఆశ్రయించింది. తనను నిత్యం కొడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడని హుమయూన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పెళ్లైన ముణ్నెళ్లవరకు తనను అద్భుతంగా చూసుకున్నాడని... ఆ తరువాత అతని అసలు స్వరూపం బయట పడిందని అంటోంది. ఆస్తి తీసుకురమ్మని వేధిస్తూ... నిత్యం తనను వేధిస్తూ టార్చర్ పెడుతున్నాడని మీడియా ముందు తన భర్త శ్రీకాంత్ పై తీవ్రంగా స్పందించింది.

సింగర్ మధుప్రియ, తన సహచరుడు శ్రీకాంత్ ను ప్రేమించి గతేడాది అక్టోబరులో తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది. అప్పట్లో వీరి వివాహం వివాదాస్పదమైంది. తల్లిదండ్రులను లెక్కచేయకుండా మధుప్రియ తన ప్రియుడు శ్రీకాంత్ ను పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. అప్పటి నుంచి మూణ్నెల వరకు బాగానే వున్నారని, ఆ తరువాత నుంచి తనను ‘మీ అమ్మానాన్న వద్దకు వెళ్లి ఆస్తి తీసుకురాపో’అని వేధిస్తున్నాడని ఆరోపించింది. గత ఆర్నెళ్లుగా తానే శ్రీకాంత్ ను పోషించాని, ఇక అతడు పెట్టే చిత్రహింసలు భరించలేకే పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. తల్లిదండ్రుల మాట వినకుండా పెళ్లి చేసుకుని వచ్చి చాలా పెద్ద తప్పుచేశానని, మీడియా ద్వారా తన తల్లిదండ్రులకు క్షమాపణ చెబుతున్నానన్నారు. అమ్మాయిలు ప్రేమించండి... కానీ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోండని తోటి అమ్మాయిలకు సూచన కూడా చేసింది.