Begin typing your search above and press return to search.

బెంగళూరును భాగ్యనగరి దాటేస్తే..సిలికాన్ వ్యాలీ అడ్రెస్ గల్లంతే

By:  Tupaki Desk   |   24 Sep 2019 1:30 AM GMT
బెంగళూరును భాగ్యనగరి దాటేస్తే..సిలికాన్ వ్యాలీ అడ్రెస్ గల్లంతే
X
నిజమే...ఐటీ రంగంలో భాగ్యనగరి హైదరాబాద్... కర్ణాటక రాజధానిగానే కాకుండా భారత సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరును దాటేస్తే... చరిత్రలో చాలా అంశాలే దిద్దుబాటుకు గురి కాక తప్పదన్న మాట ఒప్పుకుని తీరాల్సిందే. ఎందుకంటే... ఐటీకి అమెరికాలోని సిలికాన్ వ్యాలీ ఏ స్ఠాయిలో పుట్టిల్లుగా మారిందో... అదే ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి భారత్ విషయానికి వస్తే... బెంగళూరు కూడా ఆ స్థాయిలో సత్తా చాటుతోంది. అలాంటిది బెంగళూరును ఐటీ రంగంలో హైదరాబాద్ దాటేస్తే... ఇంకేముంది... బెంగళూరుతో పాటు సిలికాన్ వ్యాలీ గణాంకాలతో పాటు వాటి ప్రసిద్ధి కూడా కాస్తంత సవరించుకోక తప్పదు. నిజమా? అంటే.. నిజమే మరి. వరల్డ్ టెక్నాలజీకి సిలికాన్ వ్యాలీ పుట్టిల్లు అయితే... అదే సిలికాన్ వ్యాలీలోని వందలు, వేలాది ఐటీ కంపెనీలకు ఔట్ సోర్సింగ్ సేవలందించే రంగమంతా మన బెంగళూరులోనే కేంద్రీకృతమైంది కదా. ఈ లెక్కన బెంగళూరును హైదరాబాద్ దాటేస్తే... సిలికాన్ వ్యాలీ కూడా తనకు సంబంధించిన రికార్డులను కాస్తంత తగ్గించుకోక తప్పదు.

అయినా ఇప్పుడు ఈ బెంగళూరు - హైదరాబాద్... వాటి వెంటనే సిలికాన్ వ్యాలీల ప్రస్తావన ఎందుకన్న విషయానికి వస్తే... నిన్నటికి నిన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రిగా ఇటీవలే వరుసగా రెండో పర్యాయం పదవీ బాధ్యతలు చేపట్టిన టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్).. ఐటీ రంగానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కదా. ఐటీలో ఇండియన్ సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన బెంగళూరును హైదరాబాద్ దాటేసిందని కేటీఆర్ చెప్పిన విషయం తెలుగు ప్రజలందరికీ సంతోషం కలిగించిన మాటగానే చెప్పాలి. తెలుగు నేలకు చెందిన మన హైదరాబాద్ పొరుగు రాష్ట్రం కర్ణాటక రాజధాని - అది కూడా భారత ఐటీ రంగానికి కీలక డెస్టినేషన్ గా ఉన్న బెంగళూరును దాటేసిందంటే సంతోషం కలగక మానదు కదా. కేటీఆర్ వ్యాఖ్యలు మనలో సంతోషాన్ని నింపిన మాట నిజమే గానీ... వాస్తవ గణాంకాల విషయంలోకి వెళితే మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యలు నేల విడిచి సాము చేసిన చందమేనన్న వాదన వినిపిస్తోంది.

కేటీఆర్ లాంటి ఓ సత్తా కలిగిన రాజకీయ నేత - మంత్రి ఇలా నేల విడిచి సాము చేశారా? అంటే... ఐటీపై నిన్న ఆయన చేసిన కామెంట్లు వింటే నిజమేనని చెప్పక తప్పదు. అయినా కేటీఆర్ ఏమన్నారో ఓ సారి పరిశీలన చేసుకుంటే... ఐటీ సొల్యూషన్స్ విషయంలో ప్రపంచ స్థాయి సామర్ధ్యం హైదరాబాద్ సొంతమని కేటీఆర్ అభివర్ణించారు. యాపిల్ - ఫేస్ బుక్ - అమెజాన్ లాంటి టాప్ ఐటీ కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యాలయాన్ని తెరవటం.. ఇక్కడే తమ కార్యకలాపాల్ని ముమ్మరంగా చేపట్టడం చూస్తే.. ఐటీ రంగంలో బెంగళూరుకు ప్రధాన పోటీదారుగా మారటమే కాదు.. కొన్ని విషయాల్లో బెంగళూరును కూడా హైదరాబాద్ దాటేసిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ మాటలు విన్న ఏ ఐటీ నిపుణుడైనా - ఐటీని విశ్లేషించగలిగే సామర్థ్యం ఉన్న ఏ వ్యక్తి అయినా కేటీఆర్ నేల విడిచి సాము చేశారనే చెబుతారు. ఎందుకంటే... ప్రస్తుతం బెంగళూరులో ఐటీ ఉద్యోగుల సంఖ్య ఏకంగా 50 లక్షలకు పైమాటే. మరి హైదరాబాద్ లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల సంఖ్య... ఎంత ఎక్కువగా చెప్పుకున్నా 17 లక్షలు దాటని పరిస్థితి. అంటే... బెంగళూరులో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల సంఖ్యలో కనీసం సగం మంది ఐటీ ఉద్యోగులు కూడా హైదరాబాద్ లో లేనట్టే. హైదరాబాద్ లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల సంఖ్య 17 లక్షలేనని స్వయంగా కేటీఆర్ చెప్పిన విషయం కూడా ఇక్కడ ప్రస్తావించక తప్పదు.

యాపిల్ - ఫేస్ బుక్ - అమేజాన్ - మైక్రోసాఫ్ట్... ఇలా ప్రపంచ ప్రసిద్దిగాంచిన ఐటీ కంపెనీలు కేవలం హైదరాబాద్ లో తమ బ్రాంచీలను ఓపెన్ చేస్తేనే... బెంగళూరును హైదరాబాద్ దాటేసినంతగా జబ్బలు చరుచుకుంటే... మరి ఇప్పటికీ మన ఐటీ ఉద్యోగుల్లో మెజారిటీ వాటా దేశంలోని ఇతర నగరాలకో - లేదంటే ఏకంగా విదేశాలకో వెళుతున్న వైనాన్ని ఏమనాలి? అలా పొరుగు నగరాలకు - పొరుగు దేశాలకు మన ఐటీ నిపుణులు లేకుంటే... ఆ కంపెనీలు మూతపడినట్టేనని జబ్బలు చరుచుకోవాలా? కాదు కదా. మన వద్ద సరిపడినంత మేర ఐటీ సంస్థలు లేకనే... మనోళ్లు ఇతర ప్రాంతాలకు తరలివెళున్నారనే చెప్పుకోవాలి కదా. ఐటీ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించడంలో హైదరాబాద్ ముందు వరుసలో ఉండొచ్చేమో గానీ... అదే విషయాన్ని ఆసరా చేసుకుని ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరునే హైదరాబాద్ దాటేసిందని చెప్పుకోవడం చూస్తుంటే... మన ఆశలకు ఓ హద్దంటూ లేదనే చెప్పాలి కదా. కలలు కనడం - అది కూడా భారీ కలలు కనడం మంచిదే... అయితే వాటిని ఆచరణలో పెట్టి ఫలితాలు సాధిస్తే.. మన గొప్పలను మనం కీర్తించుకోవడం కాకుండా ఇతరులే కీర్తిస్తారు కదా. అలాంటి వాదనను వదిలేసిన కేటీఆర్... ఐటీలో బెంగళూరును హైదరాబాద్ దాటేసిందని జబ్బలు చరుచుకోవడం చూస్తుంటే... సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్న చందంగానే ఉందన్న వాదన వినిస్తోంది.