Begin typing your search above and press return to search.

మూగ‌బోయిన హోరు... మైక్‌లు బంద్‌

By:  Tupaki Desk   |   19 Oct 2019 4:20 PM GMT
మూగ‌బోయిన హోరు... మైక్‌లు బంద్‌
X
దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల ప్ర‌చారంకు తెర‌ప‌డింది. ఈరోజుతో ఎన్నిక‌ల హోరు మూగ‌బోయింది. దేశంలోని మహారాష్ట్ర, హర్యానాలలో శాసనసభలకు, తెలంగాణలోని హుజూర్‌నగర్‌తో సహా దేశంలోని 18 రాష్ట్రాలలోని 64 శాసనసభ స్థానాలకు, ఒక పార్లమెంటు స్థానానికి జరిగే ఎన్నికల ప్రచారానికి నేటితో తెర పడింది. ఈ నెల 21వ తేదీన పోలింగ్‌ జరుగనున్నది. 24వ తేదీన కౌంటింగ్‌ జరుగుతుంది. అదే రోజున ఫలితాలు వెలువడుతాయి. మహారాష్ట్రలో 288 అసెంబ్లి నియోజక వర్గాలకు, హర్యానాలో 90 అసెంబ్లి నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ ఈ నెల 21న ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం విధించింది. బీహార్‌లోని సమస్తిపూర్‌ లోక్‌సభ నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరుగనున్నది. కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజక వర్గాలకు, ఉత్తర్‌ ప్రదేశ్‌లో 11 అసెంబ్లి నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌లో సిటింగ్‌ ఎమ్మెల్యేలు ఆ పదవులకు రాజీనామాలు చేసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంతో అక్కడ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

ఎన్నికల కమిషన్‌ ముందుగా 64 శాసనసభ సీట్లకు ఒక లోక్‌సభ నియోజక వర్గానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. అనంతరం గుజరాత్‌లోని రెండు అసెంబ్లి నియోజక వర్గాలను, మహారాష్ట్రలోని సతారా లోక్‌సభ స్థానాన్ని కూడా ఆ జాబితాలో చేర్చింది. ఉప ఎన్నికలు జరుగున్న నియోజక వర్గాల వివరాలు ఈ కిందివిధంగా ఉన్నాయి. అస్సాంలో 4, బీహార్‌లో 5, ఛత్తీస్‌గఢ్‌లో 1, హిమాచల్‌ ప్రదేశ్‌లో 2, కేరళలో 5, మధ్యప్రదేశ్‌లో 1, మేఘాలయలో 1, ఒడిశాలో 1, పుదుచ్చేరిలో 1, పంజాబ్‌లో 4, రాజస్థాన్‌లో 2, సిక్కింలో 3, తమిళనాడులో 2, తెలంగాణలో 1, ఉత్తర్‌ ప్రదేశ్‌లో 11 అసెంబ్లి నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి.

బీహార్‌లోని సమస్తిపూర్‌, మహారాష్ట్రలోని సతారా లోక్‌సభ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నిక‌ల కోసం గ‌త కొంత‌కాలంగా అన్ని రాజ‌కీయ పార్టీలు హోరాహోరీగా ప్ర‌చారం చేసి చేసి ఉన్నారు. ఇప్పుడు ఎన్నిక ప్ర‌చారానికి తెర‌ప‌డ‌టంతో ప్ర‌జ‌లు ఊపీరి పీల్చుకుంటున్నారు.