Begin typing your search above and press return to search.

బాబు మిత్ర‌ప‌క్ష శ‌త్రువు మ‌ళ్లీ బాంబు పేల్చాడు

By:  Tupaki Desk   |   19 May 2016 10:01 AM GMT
బాబు మిత్ర‌ప‌క్ష శ‌త్రువు మ‌ళ్లీ బాంబు పేల్చాడు
X
సిద్ధార్థనాథ్ సింగ్....బీజేపీ జాతీయ కార్యదర్శి - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జి. స్వ‌ల్ప కాలంలోనే తెలుగు రాజకీయాల ప‌ట్ల అవ‌గాహ‌న ఉన్న వారంద‌రికీ సుప‌రిచితుడు అయిపోయారు. ఇదంతా ఒక్క‌టే స్టేట్‌ మెంట్ ద్వారా. అదే ఏపీకి ప్ర‌త్యేక హోదా చ్చేది లేద‌ని చెప్ప‌డం వ‌ల్ల‌. ఈ ఒక్క ప్ర‌క‌ట‌న ఏపీ రాజ‌కీయాల్లో వేడిని పెంచింది. తాజాగా ఏపీ ఆర్థిక రాజ‌ధాని విశాఖకు విచ్చేసిన సింగ్ విలేక‌రులతో మాట్లాడుతూ మ‌ళ్లీ అదే బాంబు పేల్చారు.

రాజ్యాంగపరమైన ఇబ్బందుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని సిద్దార్థ‌నాథ్ సింగ్ స్ప‌ష్టం చేశారు. అయితే అందుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ఆర్థిక సాయం అందచేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కంటే అధిక నిధులు కేటాయించేందుకు వీలుకల్పించే 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను తెలుగుదేశం సహా అన్ని పార్టీలు ఆమోదించాయని గుర్తుచేశారు. దీంతో రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఫైనాన్స్ కమిషన్ కారణంగా రాష్ట్రాలకు అదనంగా 10 శాతం నిధులు వస్తుండటంతో 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదాను వదులుకునేందుకు ముందుకు వచ్చాయని అన్నారు. ఇతరత్రా మార్గాల ద్వారా రాష్ట్రానికి నిధులు - వివిధ ప్రాజెక్టుల మంజూరు వంటివి చేస్తున్నామని సింగ్‌ వివరించారు. 13వ ఫైనాన్స్ కమిషన్ కింద రాష్ట్రానికి 98వేల కోట్లు కేటాయించగా, 14వ ఫైనాన్స్ కమిషన్‌ లో దాదాపు 2.08 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని తెలిపారు. ఇది గత ఫైనాన్స్ కమిషన్ కంటే 1.08 లక్షల కోట్లు ఎక్కువన్నారు. రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు 22వేల కోట్ల రూపాయలను గ్రాంట్ కింద నాలుగేళ్ళలో ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అందులో ఇప్పటికే 7000 కోట్ల రూపాయలు విడుదల చేశామని తెలిపారు.

తెలుగుదేశం పార్టీతో సమాచార - అవగాహనా లోపాన్ని అధిగమించేందుకు జాయింట్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ ఏర్పాటు చేయనున్నట్టు సిద్దార్థ‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఒకరినొకరు విమర్శించుకోవడం వల్ల ఇద్దరికీ ఉపయోగం ఉండదని ఆయ‌న అన్నారు. జాయింట్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ విషయమై కేంద్ర మంత్రి సుజనా చౌదరితో కలిసి త్వ‌ర‌లో చర్చించనున్నట్టు తెలిపారు. ఇదిలాఉండ‌గా సోషల్ మీడియా - మీడియా ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం చేసేందుకు నిర్ణయించామని సింగ్ తెలిపారు. త్వరలో జరుగనున్న విశాఖ మహానగర పాలక సంస్థ ఎన్నికల దృష్ట్యా వార్డుల వారీగా పార్టీ పరిస్థితులను పరిశీలించినట్టు తెలిపారు.