Begin typing your search above and press return to search.

వజ్రాల వాచీని వదిలేసి.. సాదా వాచీతో సీఎం

By:  Tupaki Desk   |   16 Feb 2016 1:08 PM IST
వజ్రాల వాచీని వదిలేసి.. సాదా వాచీతో సీఎం
X
ఆఫ్తుడు ఇచ్చిన వజ్రాల వాచీని పెట్టుకొని విమర్శల్ని ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎట్టకేలకు ఆ వాచీని దూరం పెట్టేశారు. రూ.75లక్షల విలువైన వాచీని పెట్టుకొని అందరి కంట్లో పడిన ఆయన.. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంధించిన ఆరోపణాస్త్రాలతో ఉక్కిరిబిక్కిరి కావటం తెలిసిందే. రూ.10లక్షల సూట్ ధరించిన ప్రధాని మోడీ ఎంత అప్రదిష్ట పాలయ్యారో.. అంతకు రెట్టింపుగా సిద్ధరామయ్య సమస్యల్లోకి చిక్కుకుపోతున్నారు. ఆయన ధరించిన వాచీకి సంబంధించి వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పలేని ఆయన.. తాజాగా ఆ ఖరీదైన వాచీని వదిలిపెట్టేయటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. తాజాగా కర్ణాటకలోని మైసూరు జిల్లాలో జరుగుతున్న స్థానిక ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సిద్ధరామయ్య సాదాసీదా వాచీతో కనిపించటం విశేషం. ఇదిలా ఉంటే.. కుమారస్వామి మరో బాంబు పేల్చారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు.. ఆయన క్యాబినెట్ లోని పలువురు మంత్రులు ఖరీదైన బహుమతులు పొందారని.. వాటికి సంబంధించిన ఆధారాల్ని తాను త్వరలోనే ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఖరీదైన బహుమతుల వ్యవహారం కర్ణాటక కాంగ్రెస్ సర్కారుకు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారాయి.