Begin typing your search above and press return to search.

కేంద్ర‌మంత్రికి బిల్లుతో షాకిచ్చిన అధికారి

By:  Tupaki Desk   |   10 July 2017 5:18 AM GMT
కేంద్ర‌మంత్రికి బిల్లుతో షాకిచ్చిన అధికారి
X
ఒక ఆస‌క్తిక‌ర వైనం వెలుగులోకి వ‌చ్చింది. కేంద్రం ఇటీవ‌ల తీసుకొచ్చిన జీఎస్టీ విధానంతో వ‌చ్చిన మార్పును క‌ళ్ల‌కు క‌ట్టేలా చూపించిన వైనంగా దీన్ని చెప్పాలి. కేంద్ర‌మంత్రికి చిన్నపాటి షాక్ ఇచ్చేలా ఒక అధికారి ప్ర‌య‌త్నం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ఫోటోలో ఉన్న వారిలో ఇద్ద‌రు ప్ర‌ముఖులు సుప‌రిచితులు. వారిలో ఒక‌రు కేంద్ర‌మంత్రి ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ కాగా.. మ‌రొక‌రు రాష్ట్ర వాణిజ్య ప‌న్నులు.. ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ సోమేష్ కుమార్‌. జీఎస్టీ అమ‌లు నేప‌థ్యంలో.. వినియోగ‌దారుల‌కు ఇస్తున్న బిల్లుల సైజు భారీగా ఉంటున్నాయి. దీనికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా త‌న భార్య‌కు ఒక సూప‌ర్ మార్కెట్ ఇచ్చిన చాంతాడు లాంటి బిల్లును మంత్రికి చూపించారు సోమేశ్ కుమార్‌.

ఆదివారం ర‌వీంద్ర‌భార‌తిలో నిర్వ‌హించిన జీఎస్టీ అవ‌గాహ‌న స‌ద‌స్సు కార్య‌క్ర‌మానికి కేంద్ర‌మంత్రి న‌ఖ్వీ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వేదిక మీద త‌న ప‌క్క‌నే కూర్చున్న కేంద్ర‌మంత్రికి జీఎస్టీ అనంత‌రం సూప‌ర్ మార్కెట్లు ఇస్తున్న పొడ‌వాటి బిల్లును చూపించారు. ఇటీవ‌ల త‌న స‌తీమ‌ణి సూప‌ర్ మార్కెట్ కు వెళ్లింద‌ని.. ఈ సంద‌ర్భంగా అక్కడ కొన్న ఒక్కో వ‌స్తువుకు ఒక్కో జీఎస్టీ ప‌న్ను ఉండ‌టంతో.. ఏ వ‌స్తువుకు ఎంత జీఎస్టీ ప‌న్ను చూపిస్తూ బిల్లు ఇవ్వ‌టం కార‌ణంగా.. అంత పెద్ద బిల్లు వ‌చ్చింద‌ని చెప్పారు. చాంతాడు మాదిరి ఉన్న బిల్లును స‌భా వేదిక మీద ఉన్న సోమేశ్ కుమార్‌.. మంత్రివ‌ర్యుల‌కు చూపించ‌టం అంద‌రి దృష్టిని విపరీతంగా ఆక‌ర్షించింది.