Begin typing your search above and press return to search.

తెలంగాణలో అధికారులు రియాక్టు కావాలంటే కేటీఆర్ ట్వీట్ చేయాలా?

By:  Tupaki Desk   |   4 Jun 2022 3:30 PM GMT
తెలంగాణలో అధికారులు రియాక్టు కావాలంటే కేటీఆర్ ట్వీట్ చేయాలా?
X
రాష్ట్రం అన్న తర్వాత ముఖ్యమంత్రి పదవి తిరుగులేనిది. ఆయనకంటే ఉన్నతస్థానంలో గవర్నర్ ఉన్నప్పటికీ ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రికే అధికారాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు.. ఆ తర్వాత ఇతరత్రా ఉంటారన్న ప్రాథమిక అవగాహన ఎవరికైనా ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏమంటే.. తెలంగాణలో ఏదైనా అనూహ్య ఘటన చోటు చేసుకున్నా.. ఏదైనా సంచలనం జరిగినా.. దారుణ నేరానికి ఎవరైనా పాల్పడినా.. దానికి వెంటనే స్పందించినట్లుగా కనిపించదు.

అయితే.. మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున విమర్శలు.. వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తిస్తే వెంటనే నష్ట నివారణ చర్యలు షురూ అవుతాయి. తాజాగా హైదరాబాద్ లోజరిగిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఉదంతాన్నే తీసుకుందాం. పబ్ లో పరిచయమైన ఆమెకు మాయ మాటలు చెప్పి.. బేకరీకి తీసుకెళ్లి.. తిరిగి తీసుకొచ్చే సమయంలో గ్యాంగ్ రేప్ జరిగిన సంచలన ఉదంతం తెర మీదకు రావటం.. దీనికి సంబంధించిన వివరాలు మీడియాలో పొక్కటం కలకలాన్ని రేపింది. ఈ దారుణ ఉదంతంలో మజ్లిస్ ఎమ్మెల్యే కుమారుడు.. హోం మంత్రి మనమడు ఉన్నట్లుగా ఆరోపణలు వ్యక్తమయ్యాయి.

అయితే.. హోం మంత్రి కుమారుడికి ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదంటూ శుక్రవారం రాత్రి ప్రెస్ మీట్ పెట్టిన డీసీపీ సర్టిఫై చేశారు. హోం మంత్రి మహమూద్ అలీ మనమడు సైతం మీడియా ప్రతినిధులకు ప్రకటనల్ని జారీ చేశారు. ఆ వాదనే నిజమని అనుకుందాం? అయితే.. ఈ వ్యవహారం జరిగింది మే 28 అయితే.. మే 31న బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అప్పటి నుంచి జూన్ 3 వరకు చూస్తే దాదాపు మూడున్నర రోజుల పాటు ఈ విషయం గురించి బయటకు వచ్చిందే లేదు. చివరకు రెండు మీడియా సంస్థలు ఈ విషయాన్ని ప్రస్తావించటం.. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టుల వెల్లువెత్తుతూ.. తెలంగాణ ప్రభుత్వాన్నిప్రశ్నించటం మొదలైంది.

ఇలాంటి వేళ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో రియాక్టు అవుతూ.. నిందితులు ఏ స్థాయిలో ఉన్నా.. ఎంతటి వారైనా సరే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అన్ని రోజుల నుంచి మౌనంగా ఉంటూ.. ఈ కేసు గురించి పల్లెత్తు మాటను చెప్పింది లేదు తెలంగాణరాష్ట్ర హోం మంత్రి. అలాంటి ఆయన మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారో లేదో.. కాసేపటికే హోం మంత్రి స్పందించారు.

నేరం చేసిన వారు ఎంతటి స్థానంలో ఉన్నా సరే చట్ట ప్రకారం శిక్షిస్తామంటూ ట్వీట్ చేశారు. ఇక్కడ తలెత్తే ప్రాథమిక ప్రశ్న ఏమంటే.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు సంబంధించిన విషయాల మీద రియాక్టు కావాల్సిన హోం మంత్రికి ఆయన బాధ్యతను మంత్రి కేటీఆర్ గుర్తు చేసినట్లుగా ట్వీట్ చేసుడేంది? అన్నది ఇప్పుడు చర్చగా మారింది.