Begin typing your search above and press return to search.

కోహ్లి విశ్రాంతి తీసుకోవాలా? చివరి అవకాశంలో ఉన్నాడా?

By:  Tupaki Desk   |   9 July 2022 1:30 PM GMT
కోహ్లి విశ్రాంతి తీసుకోవాలా? చివరి అవకాశంలో ఉన్నాడా?
X
2109 నవంబరు నుంచి మూడు ఫార్మాట్లలో ఒక్క సెంచరీ కూడా లేదు.. ఇదే సమయంలో ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ జో రూట్ టెస్టుల్లోనే 11 సెంచరీలు కొట్టాడు.. 955 రోజులైంది సెంచరీ కొట్టి..64 మ్యాచ్ లు కూడా ఆడాడు.. అయినా మూడంకెల స్కోరు లేదు.. 2021 ప్రారంభంలో రూట్ టెస్టు సెంచరీల సంఖ్య 17. మరిప్పుడు 28. అంటే ఏడాదిన్నరలో 11 బాదేశాడు. మరి కోహ్లి..2109 నవంబరులో 27వ సెంచరీని అందుకున్నాడు. నాటి నుంచి మళ్లీ హెల్మెట్ తీసి అభివాదం (సెంచరీ మార్క్) చేరిందే లేదు.

సాదాసీదాగా ఔట్ ఒకప్పడు కోహ్లి అంటే.. అత్యంత నాణ్యమైన బంతికి మాత్రమే ఔటయ్యేవాడు. అత్యంత నైపుణ్యం ఉన్న బౌలర్ల బౌలింగ్ లో మాత్రమే ఇబ్బంది పడేవాడు. కానీ, ఇప్పుడు మాత్రం సాదాసీదా స్పిన్నర్ బౌలింగ్ లోనూ వికెట్ల ముందు దొరికిపోతున్నాడు. కొత్తగా కెరీర్ ఆరంభించిన పేసర్ల బంతులకూ వికెట్ ఇచ్చేస్తున్నాడు. ఐపీఎల్ 15వ సీజన్‌లో పెద్దగా రాణించలేదు. 16 మ్యాచ్‌లు ఆడి కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా 22.73 సగటుతో కేవలం 341 పరుగులే చేశాడు. అయితే, కీలక దశలో గుజరాత్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ (73, 58) అర్ధ శతకాలతో రాణించి అందర్నీ అలరించాడు.

ఆ సమయంలో తన షాట్లలో కచ్చితత్వం.. తన ఆటలో పూర్తి ఆత్మవిశ్వాసం కనిపించడంతో ఇక తిరిగి గాడిలో పడినట్లేనని అంతా అనుకున్నారు.కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ పోస్టులు పెట్టి మరీ సంబరపడ్డారు. తీరా బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాక మళ్లీ పరుగులు చేయలేక విఫలమయ్యాడు. ఆ సమయంలోనే టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి స్పందిస్తూ కొద్దికాలం విశ్రాంతినివ్వాలని సూచించాడు. శాస్త్రితో పాటు మరికొంత మంది మాజీలు అదే సూచన చేశాడు. దీంతో టీమ్‌ఇండియా యాజమాన్యం సైతం ఆలోచించి విశ్రాంతినిచ్చింది. ఆ మెగా టోర్నీ పూర్తయ్యాక జూన్‌లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కూ కోహ్లీని ఎంపిక చేయలేదు. సుమారు నెల రోజులకుపైగా విరామం దొరకడంతో కోహ్లీ కుటుంబంతో కలిసి ప్రశాంతంగా గడిపాడు. దీంతో తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన కీలకమైన ఐదో టెస్టులోనైనా రాణిస్తాడని ఎదురు చూసిన అభిమానులకు మరోసారి నిరాశే మిగిలిచ్చాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ (11,20) ఘోరంగా విఫలమయ్యాడు.

టి20 ప్రపంచ కప్ జట్టులో ఉంటాడా?టీమ్‌ఇండియా ఇప్పుడు ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ ఆడుతోంది. తొలి మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ మినహా ప్రతి ఒక్కరూ రాణించారు. కెప్టెన్‌ రోహిత్‌తో పాటు దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, దినేశ్‌ కార్తీక్‌ ఇలా బ్యాటింగ్‌ ఆర్డర్‌లోని ప్రతి ఒక్కరూ దంచికొట్టారు. రాబోయే ప్రపంచకప్‌లో ఎలాగైనా జట్టులో స్థానం సంపాదించాలనే కసితో ఈ ఆటగాళ్లంతా వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా దీపక్‌ హుడా రెచ్చిపోతున్నాడు. ఇంతకు ముందు ఐర్లాండ్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో అదరగొట్టడమే కాకుండా ఒక మ్యాచ్‌లో శతకం సాధించాడు. అలాగే ఇంగ్లాండ్‌తో తొలి మ్యాచ్‌లో కోహ్లీ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి దుమ్ములేపాడు. దీంతో అతడు మూడో స్థానంలో పాతుకుపోయేందుకు ఎదురు చూస్తున్నాడు.

ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌ ఆడిన కోహ్లీ, రిషభ్‌ పంత్, శ్రేయస్‌ అయ్యర్‌, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లకు తొలి మ్యాచ్‌లో విశ్రాంతినివ్వగా.. వాళ్లంతా రెండో టీ20 నుంచి అందుబాటులోకి వస్తారు. దీంతో ఇప్పటికే ఉన్న ఆటగాళ్లతో పాటు వీరు కూడా కలిస్తే తుది జట్టులో ఎవరు చోటు దక్కించుకుంటారనేది ఆసక్తిగా మారింది. అయితే, కోహ్లీ ఈ ఇంగ్లాండ్‌ పర్యటన తర్వాత వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లబోడని, అప్పుడు విశ్రాంతి తీసుకోవాలని చూస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి ముందు ఇదే అతడికి చివరి ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ కానుంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సిరీస్‌లో కోహ్లీ రాణించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ టీమ్‌ఇండియా రెండో టీ20లో దీపక్‌ హుడాను మూడో స్థానంలోనే ఆడించాలని చూస్తే అప్పుడు కోహ్లీ.. ఇషాన్‌ కిషన్‌ స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. దీంతో అతడు రోహిత్‌తో కలిసి బ్యాటింగ్‌ చేయొచ్చు. అలాగైనా అతడు మెరుస్తాడో లేదో చూడాలి. ఒకవేళ ఇప్పుడు కూడా విఫలమైతే ఇక పొట్టి క్రికెట్‌లో అతడి మనుగడ కష్టమే.

విశ్రాంతి తీసుకోవాలన్న ఇంగ్లండ్ స్టార్ ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ కొన్నాళ్లపాటు క్రికెట్‌ నుంచి విరామం తీసుకోవాలని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌ మైకెల్‌ వాన్‌ సూచించాడు. ఏ ఫార్మాట్‌లోనైనా విరాట్ కోహ్లీ శతకం బాది దాదాపు మూడేళ్లు కావస్తోంది. దీంతో విరాట్ బ్యాటింగ్‌పై సర్వత్రా విమర్శలు చెలరేగాయి. ఈ క్రమంలో విరాట్ కోహ్లీకి మైకెల్‌ వాన్‌ పలు సూచనలు చేశాడు. "విరాట్‌ను కొంతకాలంగా పరిశీలిస్తున్నా. భారత టీ20 లీగ్‌ ముగిసిన తర్వాత కాస్త విశ్రాంతి లభించింది. అయితే నాకు మాత్రం కోహ్లీ కొన్ని రోజులు ఆటకు విరామం తీసుకుంటే మంచిదనిపిస్తోంది. కనీసం మూడు నెలలపాటు క్రికెట్ నుంచి విరామం తీసుకోవాలని చెబుతున్నా. బీచ్‌ల వద్ద హాయిగా సేదదీరాలి. 20 ఏళ్ల కెరీర్‌లో కుటుంబంతో మిస్‌ అయిన అనుభూతులను ఆస్వాదించాలి. మూడు నెలల బ్రేక్‌ ఆటగాడి ఫిట్‌నెస్‌, ఫామ్‌పై ఎఫెక్ట్ చూపదా...? అని అడిగితే మాత్రం ఉండదని చెబుతా. కచ్చితంగా అతడికి సాయం చేస్తుంది" అని మైకెల్‌ వాన్‌ వివరించాడు.