Begin typing your search above and press return to search.

తగలబడుతున్న కర్ణాటక.. తమిళనాడు

By:  Tupaki Desk   |   12 Sep 2016 5:06 PM GMT
తగలబడుతున్న కర్ణాటక.. తమిళనాడు
X
రెండు ప్రాంతాల మధ్య గొడవలొస్తే ఎంతటి దారుణ పరిస్థితులు నెలకొంటాయన్నది తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. కావేరీ జలాల వ్యవహారం కర్ణాటక.. తమిళనాడుల మధ్య తీవ్ర ఉద్రిక్తతల్ని సృష్టించటమే కాదు.. రెండు రాష్ట్రాల్లో ఏమాత్రం ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం చోటు చేసుకున్నపలు పరిణామాలు రెండు రాష్ట్రాల్లో అవాంఛనీయ ఘటనలకు కారణంగా మారింది. తొలుత బెంగళూరులో తమిళ విద్యార్థిపై కన్నడిగులు కొందరు దాడి చేసిన ఘటనకు నిరసనగా.. తమిళనాడు రాజధాని చెన్నై మహానగరంలో ఉడ్ ల్యాండ్ హోటల్ పై పెట్రోల్ బాంబులు విసరటంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది.

ఇదిలా ఉండగా.. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో తమిళనాడుకు మరిన్ని జలాల్ని విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు కన్నడిగుల్ని మరింత కోపోద్రిక్తల్ని చేసింది. కావేరీ పరివాహక ప్రాంతాలన్నింటిలో తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. తమిళనాడుకు వ్యతిరేకంగా వీధుల్లోకి దూసుకొచ్చిన కన్నడిగులు నినాదాలు ఇచ్చారు. దుకాణులు మూసివేయించారు. నగర కూడళ్లలో టైర్లనుకాల్చేసి రవాణాకు అవాంతరం కల్పించారు. తమిళనాడుకు రోజుకు 12వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న ఆదేశాలతో పాటు మరికొన్ని భావోద్వేగ ఘటనలుకూడా కన్నడిగుల్లో కోపానికి గురి చేసినట్లుగా చెబుతున్నారు.

సోషల్ మీడియాతో పాటు.. వాట్సప్ లో పలు మేసేజ్ లు వైరల్ కావటంతో పాటు.. తమిళనాడులోని కన్నడిగులపై దాడి చేసి.. కావేరీ జలాలు తమిళులవి అంటూ నినాదాలు చేసినట్లుగా చెబుతున్న వీడియో ఒకటి కన్నడిగుల్లో మరింత కోపానికి గురి చేసినట్లుగా చెబుతున్నారు. అధికారికంగా దీనికి సంబంధించినసమాచారం లేనప్పటికీ.. అలా జరిగిందంటూ (?) సాగిన ప్రచారం కన్నడిగుల్లో మరింత కోపానికి గురి చేసినట్లుగా తెలుస్తోంది. ఇది బెంగళూరులో మరింత విధ్వంసానికి కారణమైందని చెబుతున్నారు.

తమిళనాడులో కర్ణాటకకు చెందిన లారీని దగ్థం చేసినట్లుగా టీవీల్లో ప్రసారమైన వార్తలు కన్నడిగుల్లో ఆవేశాన్ని హద్దులు దాటేలా చేసింది. దీంతో.. తమిళనాడు నెంబరు ప్లేట్ ఉన్న ఏ వాహనాన్ని ఆందోళనకారులు వదలటం లేదు. మొత్తం 12 లారీలతో పాటు.. 20 వోల్వో బస్సులు ఆందోళనకారుల చేతిలో దగ్థమయ్యాయి. దీంతో బెంగళూరుతో సహా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో పౌరజీవనం పూర్తిగా స్తంభించింది. బెంగళూరులో మెట్రో రైల్ ను నిలిపివేశారు. మహానగర బస్సులతో పాటు రాష్ట్ర రవాణా సంస్థలకు చెందిన బస్సుల్ని నిలిపివేశారు. ఇదిలా ఉండగా మాండ్య జిల్లా మద్దూరు దగ్గరి నగరగెరె గ్రామానికి చెందిన వైరముడి అనే యువకుడు కాలుతున్న టైర్ల మధ్యకు దూకి ఆత్మాహుతికి ప్రయత్నించాడు. అతన్ని రక్షించిన పోలీసులు.. వైద్యసేవలు అందించేందుకు ఆసుపత్రికి తరలించారు.

కర్ణాటకలో ఇలాంటి పరిస్థితి ఉంటే.. తమిళనాడులో ఇంతటి విధ్వంసం లేకున్నా.. ఉద్రిక్త పరిస్థితులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్కడ కన్నడిగుల ఆస్తులపై దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.రామేశ్వరంలో కర్ణాటకకు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సుపై దాడులు జరిగినట్లుగా చెబుతున్నారు. ఇలా ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా ఒకరి ఆస్తులపై మరొకరు దాడులు చేయటంతో తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాలు తగలబడుతున్న దుస్థితి.