Begin typing your search above and press return to search.

వివేకా హత్య కేసులో షాకింగ్ మ‌లుపు.. ద‌స్త‌గిరి 'కుట్ర' వ్యాఖ్య‌లు!

By:  Tupaki Desk   |   13 Oct 2022 5:31 AM GMT
వివేకా హత్య కేసులో షాకింగ్ మ‌లుపు.. ద‌స్త‌గిరి కుట్ర వ్యాఖ్య‌లు!
X
ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్‌గా ఉన్న డ్రైవర్‌ దస్తగిరి మరోసారి కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వారం రోజుల కిందట తన ఇంటి పెంపుడు కుక్క అకస్మాత్తుగా చనిపోయిందని, ఇందులో ఏదో కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఆయ‌న చాలా కీల‌క‌మైన విష‌యాన్ని కూడా వెల్ల‌డించ‌డం.. ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్‌గా ఉన్న డ్రైవర్‌ దస్తగిరి వారంలో మూడు సార్లు.. కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాజాగా పులివెందుల నుంచి కడప వచ్చిన దస్తగిరి ముందుగా సీబీఐ అధికారులను కలిసి తనకు ఎదురవుతున్న ముప్పును వివరించారు. అనంతరం కడప ఎస్పీ కార్యాలయానికి వెళ్లి లిఖిత పూర్వక ఫిర్యాదు అందజేశారు.

వారం రోజుల కిందట తన ఇంటి పెంపుడు కుక్క అకస్మాత్తుగా చనిపోయిందని, ఇందులో ఏదో కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నెల 2న తన ఇంటి పెంపుడు కుక్క చనిపోతే.. 6వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు ఆరుగురు ఇన్నోవా కారులో తన ఇంటి వద్దకు వచ్చి కుక్కను కొంటామని అడిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తాను ఇంటి వద్ద లేని సమయం చూసి అడిగి వెళ్లారని, కుక్క చనిపోవడం, ఆరుగురు ఇంటికి రావడం చూస్తే ఏదో అనుమానం కలుగుతోందని ఫిర్యాదులో వివరించారు.

వాటిపై విచారణ చేయాలని కోరుతూ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు దస్తగిరి ఫిర్యాదు చేశారు. రెండు రోజుల కిందటే తన గన్‌మెన్‌ల మార్పు అంశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కడప ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు అందజేసిన దస్తగిరి.. ఇప్పుడు మళ్లీ మరోమారు ఫిర్యాదు అందజేయడం చర్చనీయాంశమైంది.

ఇదే విషయాలను ప్రస్తావిస్తూ కడపలోని సీబీఐ అధికారులకు కూడా లేఖ అందజేశారు. సీబీఐ అధికారులతో ఇంకా చాలా విషయాలను దస్తగిరి వివరించినట్టు తెలిసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.