Begin typing your search above and press return to search.

భ‌క్తుల్ని డేరా బాబా ఆస్థాయిలో దోచుకున్నార‌ట‌

By:  Tupaki Desk   |   8 Sep 2017 5:08 AM GMT
భ‌క్తుల్ని డేరా బాబా ఆస్థాయిలో దోచుకున్నార‌ట‌
X
న‌మ్మినోళ్ల‌ను మాత్ర‌మే మోసం చేయ‌గ‌లం. ఆ విష‌యం డేరా బాబాకు తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీదేమో. త‌న ఆశ్ర‌మంలోని సాధ్వీల‌ను అత్యాచారం చేసిన వ్య‌వ‌హారంలో దోషిగా తేలి.. ప్ర‌స్తుతం జైలుశిక్ష అనుభ‌విస్తున్న గుర్మీత్ దుర్మార్గాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

త‌న‌ను గుడ్డిగా నమ్మే వారిని ఓ రేంజ్ లో దోచేయ‌టానికి గుర్మీత్ వేసిన ఎత్తులు ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. అత‌గాడి శృంగార లీల‌ల గురించి ఇప్ప‌టికే క‌థ‌లు.. క‌థ‌లుగా బ‌య‌ట‌కు రాగా.. ఇప్పుడు డేరా ఆశ్ర‌మంలో చోటు చేసుకున్న ఆరాచ‌కం.. భ‌క్తుల్ని దోపిడీ చేసిన తీరు చూస్తే నోటివెంట మాట రాదు.

త‌న‌ను విప‌రీతంగా అభిమానించి.. ఆరాధించే వారిని నిలువు దోపిడీ చేసేందుకు డేరా బాబా ఏ మాత్రం వెనుకాడ‌లేద‌న్న సంచ‌ల‌న నిజం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. త‌న ఆశ్ర‌మంలో విక్ర‌యించిన వ‌స్తువుల ధ‌ర‌లకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చి సంచ‌ల‌నంగా మారింది.

రెండు ట‌మోటాలు రూ.వెయ్యి.. ఒక మిర‌ప‌కాయ వెయ్యి.. బొప్పాయి రూ.5వేలు.. ఇలా డేరా ఆశ్ర‌మంలో ధ‌ర‌లు ఉండేవి. అంతేనా.. ఆరాచ‌కంగా వంద‌గ్రాముల బెల్లం ఏకంగా రూ.1.25ల‌క్ష‌లు ప‌లికేద‌ట‌. మ‌రింత భారీగా ఉన్న ధ‌ర‌లున్న వ‌స్తువుల్ని భ‌క్తులు కొనేవారా? అంటే.. ఎంచ‌క్క‌గా కొనేసేవార‌ట‌. ఎందుకంటే.. బాబా ఆశ్ర‌మంలో అమ్మే వ‌స్తువుల్ని బాబానే స్వ‌యంగా పండించేవార‌ని.. వీటిని తింటే ఎలాంటి రోగాలు ద‌రి చేర‌వంటూ చేసిన ప్ర‌చారాన్ని న‌మ్మి కొనేసేవార‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

కిలో యాభై రూపాయిలు దాటితేనే ట‌మోటాలు కొనుగోలు చేయ‌టానికి ఒక‌టికి రెండుసార్లు ఆలోచించే ప్ర‌జ‌ల‌కు భిన్నంగా వేలాది రూపాయిల్ని నాలుగైదు ట‌మోటాల కోసం ఖ‌ర్చు చేయ‌టం షాకింగ్ వ్య‌వ‌హారంగా చెప్ప‌క త‌ప్ప‌దు. త‌న‌ను గుడ్డిగా న‌మ్మేసే భ‌క్తుల అమాయ‌క‌త్వాన్ని ఆస‌రాగా చేసుకొని వంద‌ల కోట్ల రూపాయిల్ని పోగువేశార‌న్న విష‌యం ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది.

భ‌క్తుల్ని దోపిడి చేసిన బాబా.. తాను చేసిన పాపాల‌కు కోర్టులు వేసిన శిక్ష వేసిన సంద‌ర్భంగా పెద్ద ఎత్తున హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌టం తెలిసిందే. అయితే.. వీటి వెనుక కిరాయి మూక‌లు భారీగా ఉన్నాయ‌న్న నిజాన్ని తాజాగా అధికారులు గుర్తించారు. అల్ల‌ర్ల కార‌ణంగా ప‌దుల సంఖ్య‌లో అమాయ‌కులు మ‌ర‌ణించ‌టం.. వంద‌ల కోట్ల ఆస్తిన‌ష్టం వాటిల్ల‌టం తెలిసిందే. అయితే.. ఇదంతా ప‌క్కా ప్లాన్ తోనే జ‌రిగింద‌న్న విష‌యాన్ని పోలీసులు గుర్తించారు.

రూ.5కోట్ల‌తో ఇంత భారీ విధ్వంసానికి తెర తీసిన వైనాన్ని పోలీసులు ప‌క్కా ఆధారాల‌తో గుర్తించారు. బాబాకు కోర్టు దోషిగా నిర్దారించిన ప‌క్షంలో పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్ప‌డాలంటూ దుర్మార్గ వ్యూహ ర‌చ‌న చేసిన‌ట్లుగా బాబా అనుచ‌రులు ప్ర‌మోద్ కుమార్‌.. రాజీవ్ సింగ్‌.. ఆదిత్య‌.. సురేంద్ర‌లు పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డించారు. అల్ల‌ర్లు సృష్టించ‌టానికి అవ‌స‌ర‌మైన వ‌స్తు సామాగ్రి (పెట్రోలు.. కారంపొడి.. హాకీ స్టిక్కులు త‌దిత‌రాలు) ని అల్ల‌రిమూక‌ల‌కు పెద్ద ఎత్తున అంద‌జేసిన వైనాన్ని గుర్తించారు.