Begin typing your search above and press return to search.

నిమ్స్ వైద్యులకు షాక్.. 18 ఏళ్ల యువతి వెన్నుముకలో బుల్లెట్

By:  Tupaki Desk   |   23 Dec 2019 5:02 AM GMT
నిమ్స్ వైద్యులకు షాక్.. 18 ఏళ్ల యువతి వెన్నుముకలో బుల్లెట్
X
అనూహ్య ఘటన ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వైద్య చికిత్స కోసం 18 ఏళ్ల అస్మా బేగం అనే యువతి నిమ్స్ కు వచ్చింది. కుటుంబ సభ్యులతో పాటు ఆసుపత్రికి వచ్చిన ఆమెకు వైద్యులు పరీక్షలు జరిపారు. ఆమెకు పరీక్షలు చేసిన వైద్యులు షాకింగ్ అంశాన్ని గుర్తించారు. సదరు యువతి వెన్ను భాగంలో బుల్లెట్ ఉందన్న విషయాన్ని గుర్తించారు. దాదాపు ఏడాది పాటు ఆమె వెన్నులో బుల్లెట్ ఉన్నట్లుగా తేల్చారు.

వైద్యం కోసం వచ్చిన అమ్మాయి వెన్నులో బుల్లెట్ ఉన్న వైనాన్ని గుర్తించినంతనే వైద్యులు అలెర్ట్ అయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పంజాగుట్ట పోలీసులు ఆ యువతి కుటుంబ సభ్యుల్ని విచారిస్తున్నారు. వెన్నులోని బుల్లెట్ మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు

ఇందులో భాగంగా బుల్లెట్ ఎలా దిగింది? ఎందుకు ఉండిపోయింది? బుల్లెట్ గాయమైన తర్వాత కూడా ఆ విషయాన్ని పోలీసులకు ఎందుకు తెలియజేయలేదు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని బహుదూర్ పురాకు చెందిన అస్మా రెండు నెలల క్రితం వైద్య చికిత్స కోసం నిమ్స్ కు వచ్చింది.తనకు వెన్నుపూస భాగంలో తీవ్రస్థాయిలో నొప్పి ఉన్నట్లు ఆమె తెలిపింది.

ప్రాధమిక చికిత్స చేసి మందులు రాసి పంపారు. తర్వాత కొద్ది రోజులకు మళ్లీ ఆసుపత్రికి వచ్చింది. నొప్పి తీవ్రమైతే సర్జరీ చేస్తామని చెప్పి పంపారు. శనివారం రాత్రి నొప్పి తీవ్రత పెరగటంతో ఆమె ఆసుపత్రికి వచ్చారు. నొప్పి ఉన్న ప్రాంతంలో ఎక్స్ రే తీయగా వెన్నుపూస భాగంలో నల్లటి వస్తువును గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స జరిపారు. ఆపరేషన్ సమయంలో బయటపడ్డ వస్తువును చూసిన వైద్యులు కంగుతిన్నారు. అస్మా వెన్నుపూసలో ఉన్న నల్లటి వస్తువ మరేదో కాదు.. బుల్లెట్. దీంతో ఈ సమాచారాన్ని పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఏడాది నుంచి ఆమె వెన్నులో బుల్లెట్ ఉండటంపై ఎలా సాధ్యమైందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరోవైపు ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఏడాది క్రితం గుర్తు తెలియని వ్యక్తులు తమ కుమార్తెపై కాల్పులు జరిపారని చెప్పారు. మరింత కాలంగా అస్మా వెన్నులో బుల్లెట్ ఉన్నప్పటికీ.. పోలీసులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇదే అంశాన్ని అస్మా తల్లిదండ్రుల్ని ప్రశ్నిస్తున్నారు. సర్జరీ జరిగిన అస్మాను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆమెకు ఆరోగ్యం మెరుగైన వెంటనే ప్రశ్నిస్తామని పోలీసులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ పరిణామం సంచలనంగా మారే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.