Begin typing your search above and press return to search.

మమతకు షాక్.. అసలు దాడి జరగలేదని నివేదిక

By:  Tupaki Desk   |   13 March 2021 2:57 PM GMT
మమతకు షాక్.. అసలు దాడి జరగలేదని నివేదిక
X
నందిగ్రామ్ ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళుతున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై బీజేపీ శ్రేణులు దాడి చేశాయన్న వార్త సంచలనమైన సంగతి తెలిసిందే. తనపై 4-5 వ్యక్తులు దాడి చేశారని మమత చెబుతోంది. అయితే సానుభూతి కోసమే మమత డ్రామాలు ఆడుతోందని బీజేపీ మండిపడుతోంది.ఈ క్రమంలోనే మమతా బెనర్జీ ఆస్పత్రి పాలై.. స్ట్రెచర్ పై ఉన్న ఫొటో వైరల్ అయ్యింది. తాను వీల్ చైర్ లో కూర్చొని అయినా ప్రచారం చేస్తానని చెప్పిన మాటలు కూడా చర్చనీయాంశమయ్యాయి.

ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం ఈ ఘటనపై సీరియస్ అయ్యింది. ఈసీ ఆరాతీసింది. ఒక నిజనిర్ధారణ కోసం ప్రత్యేక పరిశీలకులను నియమించింది. ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకులు వివేక్ దూబే, అజయ్ నాయక్ నంది గ్రామ్ వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం ఈసీకి నివేదిక సమర్పించారు.

మమతా బెనర్జీపై ఎవరూ దాడిచేయలేదని.. అది ప్రమాదవశాత్తూ జరిగిన సంఘటన అని ఎన్నికల సంఘం పరిశీలకులు తమ నివేదికలో ఈసీకి స్పష్టం చేశారు. ఆమెపై దాడి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. ఆ సమయంలో మమత వెంట పోలీసులు కూడా ఉన్నారని తెలిపారు.

ప్రత్యక్ష సాక్షులు సైతం మీడియాకు ఇదే విషయం చెప్పారు. ఇది చిన్న యాక్సిడెంట్ అని, ఆమెపై ఎవరూ దాడి చేయలేదని చెప్పారు. కారు డోర్‌ను తెరిచి ఉంచి.. ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో.. కారు డోర్‌ ఓ పిల్లర్‌కి తగిలి, బలంగా మూసుకుందని తెలిపారు. అది బలంగా మూసుకోవడం వల్లే మమత కాలికి గాయాలయ్యాయని పేర్కొన్నారు.