Begin typing your search above and press return to search.

ట్వీట్ చేసి మరీ అందరి చేత తిట్టించుకుంది

By:  Tupaki Desk   |   14 Jan 2017 9:16 AM GMT
ట్వీట్ చేసి మరీ అందరి చేత తిట్టించుకుంది
X
మేధావులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారికి.. తమ మేధావితనాన్ని తరచూ ప్రదర్శించుకోవాలన్నట్లుగా కొందరు వ్యవహరిస్తుంటారు. ఇలాంటి తీరుతో అప్పటివరకూ తెచ్చుకున్న పేరుప్రఖ్యాతుల్ని నాశనం చేసుకోవటమే కాదు.. టన్నుల టన్నుల అపకీర్తిని మూటగట్టుకుంటారు. మారినకాలానికి తగ్గట్లుగా అప్ డేట్ కాకపోవటమో.. జనం కోణం నుంచి విషయాల్ని చూసే అలవాటును మిస్ కావటమో.. అసూయ లాంటివి మోతాదుకు మించి ఉండటమో కానీ.. వారి చేత లేనిపోని తప్పుల్ని చేసేలా చేస్తుంది.

తాజాగా ప్రముఖ రచయిత్రి శోభాడే తీరు చూస్తే ఇదే తీరులో ఉన్నట్లు కనిపిస్తుంది. రియో ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు.. వారు సాధించిన పతకాలపై విమర్శలు చేసి అందరి చేతా తిట్టించుకున్న ఆమె.. తాజాగా కేంద్రమంత్రి కమ్ చిన్నమ్మగా సుపరిచితురాలైన సుష్మా స్వరాజ్ కు ఇచ్చిన సలహాపై అందరూ తిట్టిపోయటం కనిపిస్తుంది.

కొత్త సంవత్సరం సందర్భంగా ట్వీట్స్ ఆపేసి.. ప్రశాంతంగా ఉండాలనే నిర్ణయం తీసుకోవాలంటూ చెత్త సలహాను ఇచ్చారు శోభాడే. దీనిపై సోషల్ మీడియాలోని వారంతా తిట్టి పోస్తున్నారు. ఓపక్క అస్వస్థతతో ఉన్నప్పటికీ.. విదేశాల్లో ఉన్న భారతీయులు పడే కష్టాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ..వారి వెతల్ని తీరుస్తూ ప్రశంసలు అందుకుంటున్న సుష్మకు అలాంటి సలహాలు ఇస్తారా అని ప్రశ్నించటమే కాదు.. అలా కామ్ గా ఉండాల్సింది మీరేనంటూ శోభాడే మీద రివర్స్ అయ్యారు జనాలు.

‘‘విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులకు ఆమె సాయం చేస్తున్నారు. అలాంటి సుష్మకు మీరిచ్చే సలహా ఇదా? ఆమెను చూసి అసూయ పడకుండా.. గౌరవించటం నేర్చుకుంటే మంచిది’’ అంటూ పలువురు శోభాడేను తప్పు పడుతున్నారు. జనాగ్రహం చూసిన తర్వాత అయినా శోభాడే తన తీరును మార్చుకుంటారో లేదో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/