Begin typing your search above and press return to search.

రాష్ట్రపతి ఎన్నిక వేళ.. అబ్బాయికి బాబాయ్ షాక్

By:  Tupaki Desk   |   10 July 2022 4:22 AM GMT
రాష్ట్రపతి ఎన్నిక  వేళ.. అబ్బాయికి బాబాయ్ షాక్
X
రాష్ట్రపతి ఎన్నికల వేళ.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్నింటికి మించి ఈ ఎన్నికల్లో తాము బరిలోకి దింపిన అభ్యర్థిని సొంతంగా గెలిపించుకునేంత బలం లేని అధికారపక్షం.. ఇప్పుడు విపక్షం మీద ఫోకస్ చేసింది. తమ అభ్యర్థిని గెలిపించుకోవటం కోసం పడుతున్న ఆరాటంతో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా అలాంటిదే మరో పరిణామం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లో విపక్ష అఖిలేశ్ యాదవ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీకి చెందిన కొందరిని తమకు అనుకూలంగా మార్చుకోవటంలో బీజేపీ అధినాయకత్వం సక్సెస్ అయ్యిందంటున్నారు. దీంతో అఖిలేశ్ యాదవ్ కు షాకిచ్చినట్లుగా చెప్పాలి.

ఈ ఉదంతంలో అబ్బాయ్ అఖిలేశ్ కు బాబాయ్ శివపాల్ యాదవ్ మరోసారి షాకిచ్చిన వైనం ఆసక్తికరంగా మారింది. నిజానికి బాబాయ్.. అబ్బాయిల మధ్య రాజకీయ రగడ ఉంది. ఒకదశలో సమాజ్ వాదీ పార్టీ నుంచి బయటకు వెళ్లి.. సొంత కుంపటి పెట్టుకున్న ఆయన.. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. ఎన్నికల అనంతరం వచ్చిన ఫలితాల నేపథ్యంలో బాబాయ్.. అబ్బాయిల మధ్య దూరం పెరిగినట్లుగా చెబుతారు.

తాజాగా జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఇదే అంశం మరోసారి బయటకు వచ్చింది. బీజేపీ బలపర్చిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటు వేయాలని శివపాల్ డిసైడ్ కావటంతో అబ్బాయ్ కు మరోసారి బాబాయ్ షాకిచ్చారని చెప్పక తప్పదు. ద్రౌపది ముర్ముకు ఓటు వేయాలని యూపీ సీఎం యోగి తనను కోరారని.. అందుకే ఆమెకు ఓటు వేయాలని తాను నిర్ణయించుకున్నట్లు శివపాల్ వెల్లడించారు. అదే సమయంలో విపక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న యశ్వంత్ సిన్హాకు ఓటు వేయాలని అఖిలేశ్ తనను అడగలేదని.. అందుకే తాను ఓటు వేయలేనని చెబుతున్నారు. యశ్వంత్ సిన్హాతో నిర్వహించిన ప్రోగ్రాంకు సైతం అఖిలేశ్ తనను పిలవలేదన్న విషయాన్ని గుర్తు చేసి మరీ షాకిచ్చిన తీరుతో అబ్బాయ్ కు మరోసారి బాబాయ్ దెబ్బేశారన్న మాట వినిపిస్తోంది.