Begin typing your search above and press return to search.

శివబాలాజీ భార్య కంటతడి .. సీఎం కేసీఆర్‌ కు విజ్ఞప్తి !

By:  Tupaki Desk   |   2 Oct 2020 2:00 PM GMT
శివబాలాజీ భార్య కంటతడి .. సీఎం కేసీఆర్‌ కు విజ్ఞప్తి !
X
స్కూల్ ఫీజుల వసూళ్ల విషయంలో ప్రైవేట్ విద్యాసంస్థలు యాజమాన్యాల అరాచకాలకు అడ్డుకట్టవేయాలని సినీ నటుడు శివబాలాజీ దంపతులు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కోరారు. సీఎం మీద గౌరవంతో, విశ్వాసంతో ఈ మేరకు విన్నవించుకుంటున్నామని, ప్రైవేట్ స్కూల్స్ టోటల్ ఫీజును ట్యూషన్ ఫీజు గా చూపించి కట్టమనడం దారుణమని తెలిపారు. 46 జీవో లోపభూయిష్టంగా ఉందని అభిప్రాయపడ్డారు. విద్యపేరిట డబ్బులు కూడబెట్టుకోవాలనుకోవడం దారుణమని.. దీనికిది ముమ్మాటికీ సరైన సమయం కాదన్నారు. ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ పరీక్షల పేరిట కార్పొరేట్ స్కూళ్లు విద్యార్థుల తల్లిదండ్రుల్ని దోపిడీ చేస్తున్నాయని ఆరోపణలు చేశారు.

కరోన టైం లో కూడా స్కూల్ ఫీజులు కట్టాలని ఒత్తిడి పెడుతున్నారని చెప్పారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నటుడు శివబాలాజీ అతని సతీమణి మధుమిత హెచ్ ఎస్ పి ఏ ప్రతినిధులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి ఈ మేరకు సీఎం కేసీఆర్ కు సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఫీజులు కట్టకపోతే ఆన్లైన్ క్లాసుల యూజర్ ఐడీ, పాస్ వర్డ్ లు తొలగిస్తున్నారని, వ్యక్తిగతంగా మెయిల్స్ పెట్టి అనేక విధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. మణికొండలోని మౌంట్ లితేరా స్కూలు నుండి ఇలాంటి ఒత్తిళ్లు ప్రారంభం అయ్యాయని తెలిపారు. మౌంట్ లితేరా స్కూల్ తో మొదలైన ఫీజుల ఒత్తిడి అనేక స్కూళ్లకు పాకిందని, ప్రైవేట్ స్కూళ్లు సిండికేట్ గా మారి అన్ని చోట్లా ఇదే పరిస్థితి కొనసాగిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా సమయంలో ట్యూషన్ ఫీజ్ మాత్రమే చెల్లించాలని కేసీఆర్ చెప్పిన మాటల్ని వాళ్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే, స్కూళ్లు ఇతరత్రా ఫీజులతో తల్లిదండ్రుల్ని క్షోభకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము తమ పిల్లల ఫీజులు మౌంట్ లితేరా స్కూల్ లో ఇప్పటికే 35 శాతం చెల్లించామని.. అయినా ఫీజు కట్టలేదని ఎగ్జామ్స్ రాయనివ్వటం లేదని మధుమిత కంటతడిపెట్టారు. విద్యార్థుల తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకొని సీఎం కేసీఆర్ ఈ సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేసారు.