Begin typing your search above and press return to search.

3500 ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌తో సింగ‌పూర్ నుంచి విశాఖ‌కు నౌక‌

By:  Tupaki Desk   |   13 May 2021 2:30 AM GMT
3500 ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌తో సింగ‌పూర్ నుంచి విశాఖ‌కు నౌక‌
X
భారత నౌకాదళానికి చెందిన ఐరావత్ నౌక సింగపూర్ నుంచి ఎనిమిది క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు 3500 పైచిలుకు ఆక్సిజన్ సిలిండర్లు.. ఇతర వైద్య పరికరాలను తీసుకుని మే 10న విశాఖపట్నం పోర్టుకు చేరింది. విదేశాల్లో చిక్కుబడిపోయిన భారతీయ పౌరులను స్వదేశం తీసుకువచ్చేందుకు సంయుక్తంగా ఆపరేషన్ సముద్ర సేతును నిర్వహించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ),.. భారతీయ నౌకాదళం (ఐఎన్),.. ఆరోగ్య మంత్రిత్వ శాఖలు తాజాగా ఆపరేషన్ సముద్ర సేతు 2 అమలు కోసం సమిష్టిగా కలిసి పనిచేస్తున్నాయి. వైద్య పరికరాలను చేరవేయడానికి సంబంధించి సముద్ర సేతు- 1 తరహాలోనే ఈ ఆపరేషన్ ను కూడా ఎంఈఏ,.. భారతీయ నేవీ అత్యంత సమన్వయంతో అమలు చేస్తున్నాయి. వీటిని భారత్ కు చేర్చిన తర్వాత ఆరోగ్య మంత్రిత్వ శాఖ బాధ్యతలు తీసుకుంటుంది.

35 ఇతర దేశాలు.. గల్ఫ్ పొరుగు దేశాల ప్రభుత్వాలతో పాటు అరబ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల నుంచి వెల్లువెత్తుతున్న సంఘీభావం, ప్రాణాంతకమైన కోవిడ్ -19 సెకండ్ వేవ్ ను ఎదుర్కొనడానికి భారత్ సాగిస్తున్న పోరును మరింత బలోపేతం చేస్తోంది. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా,.. వేగవంతంగా సహాయం అందే విధంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. గత నెల ఆఖరులో విదేశీ వ్యవహారాల మంత్రి డా. ఎస్. జైశంకర్‌ తన సహచర యుఏఈ విదేశాంగ మంత్రి గౌరవనీయ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో జరిపిన టెలిఫోన్ సంభాషణ అనంతరం గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) భారత్ కు వైద్య పరికరాలను సరఫరా చేసే విషయంలో తగు చర్యలు తీసుకుంది. ఎంఈఏ జోక్యం చేసుకున్న వెంటనే యూఏఈ నుంచి 7 ఐఎస్ వో ట్యాంకర్లతో పాటు ఒక్కోటి 20 మెట్రిక్ టన్నుల (ఎంటీ) ద్రవీకృత మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంవో)తో కూడిన తొలి షిప్ మెంట్ ముంద్రా పోర్టుకు చేరింది. జీసీసీ కూటమిలో సభ్యత్వం ఉన్న మరో దేశం బహ్రెయిన్ కూడా చేయూతనిచ్చేందుకు రంగంలోకి దిగింది.

యూఏఈ నుంచి తిరిగి వస్తూ నౌకాదళానికి చెందిన రెండు నౌకలు ఐఎన్‌.ఎస్ కోల్ కతా,.. ఐఎన్ఎస్ తల్వార్ బహ్రెయిన్ దేశ రాజధాని మనామా పోర్టు నుంచి 40 ఎంటీ లిక్విడ్ ఆక్సిజన్ ను కూడా తీసుకువచ్చాయి. ఖతార్ కూడా వేగంగా స్పందించింది. అప్పటికప్పుడు వెంటిలేటర్లు, .. కాన్సంట్రేటర్లు,... పీపీఈ కిట్ల రూపంలో 300 టన్నుల వైద్య సహాయాన్ని మూడు కార్గో విమానాల్లో పంపించింది. ఈ వైద్య పరికరాలను భారత్ కు సహాయంగా అందజేసింది. మంగళవారం కువైట్ అత్యవసరంగా 60 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు,.. వెంటిలేటర్లు,.. 282 ఆక్సిజన్ సిలిండర్లు,.. ఇతరత్రా వైద్య పరికరాలను భారత్ కు పంపింది. దౌత్యపరమైన మార్గాలతో పాటు అంతర్జాతీయంగా దేశానికి ఉన్న మంచి పేరు తోడ్పాటుతో ప్రస్తుత సంక్షోభాన్ని భారతదేశం దీటుగా ఎదుర్కొనేందుకు ఇతర దేశాల నుంచి వైద్య సహాయాన్ని సమకూర్చడంలో ఎంఈఏ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక దేశీయంగా చూస్తే,విదేశాంగ శాఖ కార్యదర్శి ప్రత్యేక విలేకరుల సమావేశంలో తెలిపినట్లుగా ``దిగుమతి చేసుకోవడంలోనూ,... సిస్టమ్ లను సెటప్ చేయడంలోనూ తలెత్తబోయే అవాంతరాల్లాంటివి ముందుగానే అంచనా వేసి,.. పరిష్కరించడం ద్వారా వైద్య సహాయాన్ని సమకూర్చుకోవడంలోనూ,.. భారత్ కు సాధ్యమైనంత వేగంగాను,.. సమర్ధమంతంగా చేర్చడంలోనూ పలు అంతర్-మంత్రిత్వ శాఖ బృందాలతో ఎంఈఏ కలిసి పనిచేస్తోంది అని తెలిసింది.