Begin typing your search above and press return to search.

షర్మిల షాకింగ్ నిర్ణయం.. ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ మొదటి ఎపిసోడ్ ఆమెతోనే!

By:  Tupaki Desk   |   22 Sep 2021 2:45 AM GMT
షర్మిల షాకింగ్ నిర్ణయం.. ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ మొదటి ఎపిసోడ్ ఆమెతోనే!
X
రాజకీయాల్లో సంచలనాలు మామూలే అయినా.. అవి ఉత్తగా ఏమీ చోటు చేసుకోవు. దాని వెనుక చాలానే లెక్కలు ఉంటాయన్నది తెలిసిందే. తెర మీదకు వచ్చిన ఒక ఉదంతం వెనుక చాలానే మధనం ఉంటుంది. ఆ తర్వాతే అందరికి ఓపెన్ అవుతుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి అధికారికంగా బయటకు రానుంది. ‘ఆ రెండు పత్రికలు’ అంటూ తనతో ఉన్న పంచాయితీ విషయాన్ని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ దాచుకోలేదు. ఇంతకూ ఆ రెండు పత్రికలు ఏమిటో తెలుగు ప్రజలందరికి తెలిసిందే. తనను అదే పనిగా బద్నాం చేస్తున్న ఆ రెండు పత్రికలకు పోటీగా.. భారీ ఎత్తున పత్రికను తీసుకురావటం ద్వారా సరైన సమాధానం చెప్పొచ్చన్న వైఎస్ ఆలోచనకు ప్రతిరూపంగానే ‘సాక్షి’ పుట్టిందన్నది సత్యం.

అలా వైఎస్ కుటుంబం మీడియా రంగంలోకి రావటానికి ఆ రెండు పత్రికలతో తమకున్న పేచీనే కారణం. అలాంటి ఆ రెండు పత్రికలతో ఉన్న రాజకీయ శత్రుత్వం రోజులు గడిచేకొద్దీ పెరగటమే కానీ తరిగింది లేదు. వైఎస్ మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్ రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా వ్యవహరించటం.. సొంతంగా పార్టీ పెట్టుకోవటం.. ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న అనంతరం అధికారంలోకి రావటం తెలిసిందే.

ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆయన అనునిత్యం ఆ రెండు పత్రికలతో పోరాడుతూనే ఉంటున్నారు. ఆ రెండింటిలో ఆంధ్రజ్యోతితో ఆయన అమితమైన చికాకుల్ని ఎదుర్కొంటున్నారు. ప్రతి వారాంతంలో ‘కొత్త పలుకు’ పేరుతో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాక్రిష్ణ రాసే కాలమ్ లో ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి ఏదో ఒక విమర్శ ఘాటుగా రావటం.. ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా వ్యవహరించటం చూస్తున్నదే. ఆర్కేతో ఏ మాత్రం పొసగని వైఎస్ కుటుంబం.. ఇప్పుడు ఆయనతో ఇంటర్వ్యూకు ఒప్పుకోవటం సంచలనంగా మారింది. దీనికి మూలంగా మారారు షర్మిల.

ఆర్కేకు చెందిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానల్ లో.. ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమం ఎంత ఫేమస్ అన్న విషయం అందరికి తెలిసిందే. ప్రఖ్యాత సెలబ్రిటీలు.. రాజకీయ నేతలు.. వివిధ రంగాల ప్రముఖులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తుంటారు. గడిచిన కొన్నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించటం లేదు. దీనికి కారణం వ్యక్తిగతమైన చికాకులే అని చెబుతారు. కుటుంబంలో నెలకొన్న ఇష్యూలతో పాటు.. మిగిలిన అంశాలు.. ఈ షోను పక్కన పెట్టటానికి కారణంగా చెబుతారు.

తాజాగా మరోసారి ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆర్కే సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఆ మీడియా సంస్థ ప్రకటించింది కూడా. ఈ ఆదివారం రెండో సీజన్ షురూ కానుంది. అయితే.. సీజన్ 2లో.. మొదటి ఎపిసోడ్ ను వైఎస్ షర్మిలతో ఆయన నిర్వహిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. తన సోదరుడు జగన్ తో విభేదించిన షర్మిల.. తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయటం.. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున విమర్శల్ని ఎదుర్కోవటం తెలిసిందే. ఆ మాటకు వస్తే.. షర్మిల తెలంగాణ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన తొలి వార్తను పబ్లిష్ చేసింది కూడా ఆంధ్రజ్యోతినే. ఈ వార్త పబ్లిష్ అయ్యాక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు రావటం ఒక ఎత్తు అయితే.. రెండు రోజుల తర్వాత షర్మిల పేరుతో ఒక ఖండన అనే వివరణ వచ్చినా.. అదంతలా అతికినట్లుగా అనిపించకపోవటం.. ఇది జరిగిన కొన్నాళ్లకే ఆమె పార్టీ పెట్టటం లాంటివి జరిగిపోయాయి.

తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినంతనే బోలెడంత ఆసక్తి వ్యక్తమైనా.. అదేమంత తేలిక కాదన్న విషయం స్పష్టమైంది. మొదట్లో రెడ్లు.. క్రిస్టియన్లు ఈ పార్టీ మీద ఆసక్తి చూపించినా.. తర్వాతి కాలంలో వారు ఆ పార్టీ దరికి చేరేందుకు పెద్దగా ఆసక్తి చూపించని పరిస్థితి. అయితే.. షర్మిల మాత్రం ఏ మాత్రం నిరాశకు గురి కాకుండా.. ఉత్సాహంగా తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. పట్టుదల.. అంతకు మించిన మొండితనంతో ఆమె పోరాడుతున్నారు. అంతేకాదు.. పాదయాత్ర షెడ్యూల్ ప్రకటించారు. ఇప్పటికే ప్రతి మంగళవారం నిరాహారదీక్ష చేస్తూ.. తెలంగాణలో నిరుద్యోగ అంశాన్ని టేకప్ చేసిన ఆమె.. యూత్ ను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారు.

అయితే.. ఆమె అంచనాలకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఇలా ప్రతి అంశంలోనూ ప్రతికూలతల్ని ఎదుర్కొంటున్న షర్మిల.. తాజాగా ఆంధ్రజ్యోతి ఆర్కేకు ఇంటర్వ్యూ ఇవ్వాలని నిర్ణయించటం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.ఈ ఇంటర్వ్యూలో ఆమె పలు వ్యక్తిగత అంశాల్ని.. రాజకీయ పరమైన అంశాల మీద తన వాదనను వినిపించినట్లుగా చెబుతున్నారు. ఆమె వాదనను ప్రజలకు చేరవేసే బాధ్యతను తీసుకున్న ఆర్కే.. పనిలో పనిగా.. తన టార్గెట్ అయితే జగన్ మైండ్ సెట్ ను.. ఆయన వ్యక్తిత్వాన్ని.. ఆయన వ్యవహరించే తీరు ఎలా ఉంటుందన్న విషయాల్ని షర్మిల చేత చెప్పిస్తారని చెబుతున్నారు.

అంతేకాదు.. తన రాజకీయ వారసులు ఎవరన్న విషయాన్ని వైఎస్ సన్నిహితుల వద్ద చెప్పేవారన్న విషయాన్ని షర్మిల నోట పలికించటం ద్వారా.. ఆమె ఇమేజ్ ను పెంచేలా ప్రోగ్రాంను ప్లాన్ చేశారని చెబుతున్నారు. మొత్తంగా ఈ ఇంటర్వ్యూ.. విన్ టు విన్ పద్దతిన సాగుతుందన్న మాట వినిపిస్తోంది. ఆర్కేతో ఇంటర్వ్యూ అంటేనే.. అదెలా ఉంటుంది? దాని పరిణామాలు ఎలా ఉంటాయన్న విషయాలు షర్మిలకు తెలీకుండా ఏమీ ఉండవు. కానీ.. ఆ విషయాలన్నింటిని ఆలోచించిన తర్వాత ఇంటర్వ్యూకు ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు.

తన వార్తలకు ప్రాధాన్యత ఇవ్వటంలో తన సోదరుడి పత్రిక.. చానల్ పెద్దగా సహకరించటం లేదన్న విషయాన్ని షర్మిల తాను చేసిన ఒక దీక్ష సందర్భంగా ఓపెన్ కావటం తెలిసిందే. మీ చానల్ లో మమ్మల్ని చూపించరుగా.. పక్కకు వెళ్లండన్న మాట ఆమె నోట రావటంతోనే.. జగన్ తో ఆమెకున్న విభేదాల తీవ్రత ఎంతన్న విషయం అప్పట్లోనే బయటపడింది. ఆ మాట తర్వాత.. జగన్ మీడియాలో షర్మిలకు సంబంధించిన వార్తలు రావటం గమనార్హం.

ఆర్కేకు ఇంటర్వ్యూ విషయం ప్రస్తావన వచ్చినంతనే.. అందరికి సాక్షి మీడియాకు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు చిన్న కొడుకు దివంగత సుమన్ ఇంటర్వ్యూ ఇవ్వటం.. అందులో తన తండ్రి రామోజీ రావు మీద విమర్శలు చేయటం.. కుటుంబ లుకలుకలు బయటపడేలా ఆయన వ్యవహరించటాన్ని గుర్తు చేసుకుంటున్నారు. షర్మిల వాదనను వినిపించేందుకు ఈనాడు ముందుకు రాదు. మిగిలిన మీడియాలలో ప్రింట్ కమ్ చానల్ ఉన్న సంస్థలు రెండే అందులో ఒకటి ఆంధ్రజ్యోతి.. రెండోది నమస్తే తెలంగాణ.

ఇందులో ఆంధ్రజ్యోతి మాత్రమే ఆమె వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లగలదు. అదే సమయంలో.. తనకు ఏమాత్రం పొసగని జగన్ ను డ్యామేజ్ చేయటం.. అది కూడా షర్మిల నోటి నుంచే అన్న కాన్సెప్టు.. ఆర్కే ఇంటర్వ్యూకు అసలుసిసలు ముడి వస్తువు అన్నది మర్చిపోకూడదు. ఏమైనా.. షర్మిల ఇంటర్వ్యూ మరో రాజకీయ సంచలనానికి తెర తీయటం ఖాయమని చెబుతున్నారు. అదే సమయంలో.. ఎంత గొడవలు ఉంటే మాత్రం.. వైఎస్ కుటుంబంతో మొదట్నుంచి పొసగని ఆర్కేకు ఇంటర్వ్యూ ఇవ్వటమా? అన్న ఆగ్రహం కూడా వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.. అసాధ్యమైనది ఏమీ ఉండదన్న మాటకు నిదర్శనంగా ఈ ఇంటర్వ్యూను చెప్పక తప్పదని చెప్పాలి.