Begin typing your search above and press return to search.

పరామర్శ కాస్తా నిరవధిక దీక్ష గా మార్చిన షర్మిల

By:  Tupaki Desk   |   16 Sep 2021 3:24 AM GMT
పరామర్శ కాస్తా నిరవధిక దీక్ష గా మార్చిన షర్మిల
X
ఆరేళ్ల చిన్నారిని దారుణ హత్యాచారం చేసిన నిందితుడు రాజును కఠినంగా శిక్షించాలన్నడిమాండ్ అంతకంతకూ తీవ్రం కావటమే కాదు.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ దారుణ ఉదంతం గురించి తెలంగాణ అధికారపక్షం నేతలు ఎక్కడా ప్రస్తావించకుండా.. టోన్ డౌన్ చేసే ప్రయత్నం చేస్తున్నా.. అందుకు భిన్నంగా విపక్షాలు.. ప్రజాసంఘాలు.. సెలబ్రిటీలు.. సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఎవరికి వారుగా స్పందిస్తున్న వైనంతో ఈ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

చిన్నారి తల్లిదండ్రుల్ని పరామర్శించేందుకు వెళుతున్న ప్రముఖుల మాదిరే వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలి హోదాలో షర్మిల వారింటికి వెళ్లారు. పరామర్శకు వెళ్లిన ఆమె.. నిందితుడ్ని వెంటనే అరెస్టు చేయాలని.. బాధిత కుటుంబానికి భద్రత కల్పించాలని.. వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఇంట్లో కుక్కకు ఇచ్చే విలువ మనుషులకు ఇవ్వటం లేదన్న ఆమె.. గిరిజనుల ప్రాణాలంటే లెక్క లేదా? అని ప్రశ్నించారు.

చిన్నారిని చిదిమేసిన నిందితుడ్ని వెంటనే అరెస్టు చేసి.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా కఠిన శిక్ష వేయించాలని డిమాండ్ చేసిన ఆమె.. బాధిత కుటుంబానికి రూ.10కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. కేసీఆర్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో మహిళలపై లైంగిక వేధింపుల కేసులు మూడు రెట్లు పెరిగాయని గణాంకాల్ని ఉటంకించిన ఆమె.. మంత్రి కేటీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు.

మున్సిపల్ ఎన్నికల సమయంలో సింగరేని కాలనీని దత్తత తీసుకొని డెవలప్ చేస్తానని ప్రకటించిన మంత్రి కేటీఆర్... తర్వాత ఎందుకు పట్టించుకోలేదు? అని సూటిగా ప్రశ్నించారు. మంత్రి తీసుకున్న దత్తత ప్రాంతంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. దారుణ ఉదంతం చోటు చేసుకున్నప్పటికి మంత్రి కేటీఆర్ మాత్రం బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదన్న ఆమె.. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఇప్పుడున్న పరిస్థితి ఎదురయ్యేది కాదన్నారు. నిందితుడిపై బాధిత కుటుంబం అనుమానం వ్యక్తం చేసినా పట్టించుకోలేదన్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. పరామర్శకు వచ్చిన షర్మిల.. అనూహ్యంగా బాధిత కుటుంబం వద్దే.. న్యాయం జరిగే వరకు నిరవధిక దీక్ష చేస్తానని.. నిరాహార దీక్షను షురూ చేశారు. అయితే.. ఆ ప్రాంతం ఇరుకుగా ఉండటంతో బుధవారం సాయంత్రానికి దగ్గర్లోని ఖాళీ జాగాలోకి ఏర్పాట్లు చేసి.. తన దీక్షను అక్కడకు తరలించారు. ఇదిలా ఉండగా.. బాధిత కుటుంబానికి పరామర్శకు వచ్చిన విజయమ్మ.. అనంతరం దీక్షా శిబరంలోకి వెళ్లి కుమార్తె షర్మిలతో పాటు కూర్చొని తన సంఘీభావాన్ని తెలియజేశారు. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా షర్మిల తన దీక్షను కొనసాగించటం గమనార్హం. అర్థరాత్రి రెండున్నర గంటల వేళలో.. పోలీసులు షర్మిల దీక్షను భగ్నం చేశారు. మొత్తంగా తన మాటలతోనే కాదు చేతలతో కూడా కేసీఆర్ సర్కారుకు షాకిచ్చారనే చెప్పాలి.