Begin typing your search above and press return to search.

తాజాగా ఎంపికైన సీబీఐ చీఫ్ బ్యాగ్రౌండ్ ఇంత పెద్దది బాస్

By:  Tupaki Desk   |   26 May 2021 6:30 AM GMT
తాజాగా ఎంపికైన సీబీఐ చీఫ్ బ్యాగ్రౌండ్ ఇంత పెద్దది బాస్
X
అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు రిటైర్ అయినప్పుడు.. వారి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేయాల్సిన బాధ్యత కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉండేది. గతంలో ఇలా ఏదైనా పోస్టు ఖాళీ అవుతుందంటే.. ప్రభుత్వం ముందే కసరత్తు చేసుకొని.. తర్వాత ఆ స్థానాన్ని ఎవరికి అప్పగించాలన్న దానిపై నిర్ణయం తీసుకునేది. కానీ.. ఇప్పటి ప్రభుత్వాల తీరు భిన్నంగా ఉంటోంది. తెలంగాణలో వర్సిటీ వీసీల నియామకం ఎన్నాళ్లు ఖాళీగా ఉంచారో తెలిసిందే. ఇటీవల సీఎం కేసీఆర్ ఒకేసారి గంపగుత్తగా అన్ని వర్సిటీ వీసీల్ని ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వర్సిటీ వీసీల ఎంపికను కాస్త పక్కన పెడితే.. దేశీయంగా ప్రఖ్యాత దర్యాప్తు సంస్థ సీబీఐ చీఫ్ గా ఉన్న రిషికుమార్ శుక్లా ఈ ఏడాది ఫిబ్రవరి 3న రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అదనపు డైరెక్టర్ గా ప్రవీణ్ సిన్హాను తాత్కాలిక డైరెక్టర్ గా నియమించారు. అంతేకానీ.. పూర్తిస్థాయిలో సీబీఐ బిగ్ బాస్ ను ఎంపిక చేయలేదు మోడీ సర్కారు.

తాజాగా దీనిపై కసరత్తు చేసి.. చివరకు1985 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సుబోద్ కుమార్ జైస్వాల్ ను సీబీఐ డైరెక్టర్ గా ఎంపిక చేశారు. రెండేళ్ల పాటు ఆయనీ పదవిలో కొనసాగనున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్రం విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. సీబీఐ డైరెక్టర్ ఎంపిక తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. లోక్ సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరిలతో కూడిన ముగ్గురు సభ్యుల హైపవర్ కమిటీ మూడు పేర్లను షార్ట్ లిస్టు చేసింది. అందులో సుబోధ్.. కేఆర్ చంద్ర.. వీఎస్ కే కౌముది పేర్లు ఉండగా.. చివరకు సుబోధ్ పేరును ఫైనల్ చేశారు.

సుబోధ్ జైస్వాల్ బ్యాక్ గ్రౌండ్ చూస్తే.. 1985 బ్యాచ్ కు చెందిన మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారిగా ఆయన ముంబయి యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ లో పని చేశారు. పలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లకు లీడ్ చేశారు. 2002లో నకిలీ స్టాంపు పేపర్ స్కాంపై దర్యాప్తు చేసిన సిట్ కు ఆయన నాయకత్వం వహించారు. అబ్దుల్ కరీం తెల్గీ ప్రధాన ప్రాతధారిగా తేలిన రూ.20వేల కోట్ల ఈ స్కాం అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనమైంది.

2006లో చోటు చేసుకున్న వరుస ట్రైన్ బాంబు పేలుళ్ల కేసులో కీలకభూమిక పోషించారు. 2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్ల కేసును దర్యాప్తు చేశారు. ముంబయి పోలీసు కమిషనర్ గా పని చేశారు. 2019లో మహారాష్ట్ర డీజీపీగా నియమితులయ్యారు. పని చేస్తున్న స్థానాల్లో రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి కాకుండానే ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేయటంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వంతో ఆయనకు విబేధాలు వచ్చాయి.

ఆయన తన కెరీర్ లో ఇంటెలిజెన్సు బ్యూరో (ఐబీ).. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)లోనూ సుదీర్ఘ కాలం పని చేశారు. 2001లో రాష్ట్రపతి పోలీసు మెడల్ తో పాటు.. 2020లో కేంద్ర ప్రభుత్వం నుంచి అసాధారణ్ సురక్షా సేవా ప్రమాణ్ పత్ర్ అందుకున్న సామర్థ్యం ఆయన సొంతం. ఇన్ని పదవుల్ని చేపట్టిన ఆయన తాజాగా సీబీఐ చీఫ్ గా ఎంపికయ్యారు. మరీ పదవిలో ఆయనెన్ని మెరుపులు మెరిపిస్తారో చూడాలి.