Begin typing your search above and press return to search.

గులాంనబి అజాద్ దుర్మార్గం చెప్పిన కాంగ్రెస్ సీనియర్ నేత

By:  Tupaki Desk   |   30 Aug 2020 2:30 AM GMT
గులాంనబి అజాద్ దుర్మార్గం చెప్పిన కాంగ్రెస్ సీనియర్ నేత
X
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎలా సాగుతున్నాయో తెలిసిందే. ఇప్పటివరకు ఎప్పుడూ లేనట్లుగా గాంధీ కుటుంబసభ్యుడు రాహుల్ పై సీనియర్లు మూకుమ్మడిగా మొదలెట్టిన యుద్ధం ఇప్పుడు అంతకంతకూ ముదురుతోంది. లేఖతో షాకిచ్చిన సీనియర్లకు.. గాంధీ వీరవిధేయులు ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఒక్కో సీనియర్ నేత బతుకుల్ని విప్పి చెబుతున్నారు. తాజాగా.. తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజకీయంగా గులాంనబి అజాద్ తన గొంతు కోశాడని.. లేకుంటే తాను ముఖ్యమంత్రిని అయ్యేవాడినని చెప్పారు. అతని వ్యాఖ్యల వెనుక దురుద్దేశం ఉందన్న వీహెచ్.. గాంధీ కుటుంబాన్ని వ్యతిరేకిస్తే తాము అండగా ఉంటామన్నారు. ‘గాంధీ ఫ్యామిలీని అంటే మా మనసు రగులుతోంది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాకు టైం ఇస్తే మరిన్ని విషయాలు చెబుతా’’ అని పేర్కొన్నారు. ఎప్పుడూ లేని విధంగా.. ఇంతకు ముందెప్పుడూ అనని రీతిలో అజాద్ ను ఉతికి ఆరేసినత పని చేశారు. .

దివంగత మహానేత వైఎస్ ను పాదయాత్రకు రాకుండా అడ్డుకున్నది అజాదేనని పేర్కొన్నారు. పార్టీలో అంతర్గత ఎన్నికలు జరగాలనటం సరికాదని.. అతని వ్యాఖ్యలు తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని చెప్పారు. పార్టీ గురించి మాట్లాడే హక్కు లేదన్న వీహెచ్.. తాను పీసీసీ అధ్యక్షుడ్ని కాకుండా అడ్డుకున్నాడని చెప్పారు. అప్పట్లో పార్టీ ఎన్నికలు జరుగుతుంటే.. జరగనివ్వలేదన్నారు. తనకు పదవులు ఉంటే ఒకలా.. పదవులు లేకుంటే మరోలా మాట్లాడే అలవాటు ఉందన్నారు.

పార్టీ అధినేత్రి ఆసుపత్రిలో ఉంటే లేఖ ఎలా రాస్తారని ప్రశ్నించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల ద్వారా పార్టీ పదవుల్ని ఎంపిక చేయమని ఎందుకు చెప్పలేదో చెప్పాలన్నారు. నలభైఏళ్లు కాంగ్రెస్ పార్టీ కారణంగా పదవుల్ని అనుభవించి.. కష్టకాలంలో పార్టీ ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదన్నారు. గాంధీ కుటుంబం ఉంటేనే కాంగ్రెస్ ఉంటుందని.. లేకుంటే పార్టీనే ఉండదన్నారు. రానున్న రోజుల్లో సీనియర్లపై పెద్ద ఎత్తున విమర్శలు చేసేందుకు వీహెచ్ బాటలో మరెంతమంది తెర మీదకు వస్తారో చూడాలి.