Begin typing your search above and press return to search.

గుంటూరు జిల్లాలో సెల్ఫీలపై సంచలన ‘‘బ్యాన్’’

By:  Tupaki Desk   |   22 Nov 2019 4:41 AM GMT
గుంటూరు జిల్లాలో సెల్ఫీలపై సంచలన ‘‘బ్యాన్’’
X
ఇవాల్టి రోజున ఎక్కడపడితే అక్కడ.. ఎవరు పడితే వారు.. సెల్ఫీలు తీసుకోవటం కనిపిస్తుంది. చిన్నా పెద్దా.. ధనిక.. పేద.. ఇలా స్మార్ట్ ఫోన్ వినియోగించే వారిలో నూటికి 90 శాతం మంది సెల్ఫీలు తీసుకునే వారే. మిగిలిన వారితో పోలిస్తే.. యూత్ లో సెల్పీల మోజు మరింత ఎక్కువ. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీలోని గుంటూరు జిల్లా పోలీసులు సంచలన నిర్ణయాన్ని తీసుకన్నారు.

ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు తీసుకోవటంపై ఆంక్షలు విధించారు. ఇటీవల కాలంలో సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇటీవల ఒక బీటెక్ విద్యార్థిని సెల్ఫీ కోసం వెళ్లి కాల్వలో పడి మరణించిన వైనాన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా పోలీసులు కఠిన నిర్ణయాన్ని ప్రకటించారు.

ఇకపై జిల్లాలో ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు తీసుకోకూడదని తేల్చారు. ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలకు అస్సలు అనుమతించరు. జిల్లాలోని కాల్వ గట్లు.. చెరువులు.. జలాశయాల వద్ద సెల్ఫీలపై బ్యాన్ విధించారు. ఒకవేళ ఎవరైనా సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేస్తే చర్యలు తీసుకుంటామని.. జరిమానాలు విధిస్తామని స్పష్టం చేస్తున్నారు.

మాటలకే పరిమితం కాకుండా.. రిజర్వాయర్లు..కాల్వల వద్ద ఫోటోలు దిగొద్దంటూ వార్నింగ్ బోర్డులు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. జిల్లాలోని పులిచింతల జలాశయంలో సెల్పీలకు అస్సలు ప్రయత్నం చేయొద్దంటున్నారు. ఎందుకంటే.. జలాశయంలో మెసళ్లు ఉన్నాయని.. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా జలాశయంలో పడటానికి ఎక్కువ అవకాశం ఉందంటున్నారు. సో.. గుంటూరు జిల్లాకు చెందిన వారు.. ఆ జిల్లాకు వెళ్లేవారు సెల్ఫీల విషయంలో జర జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. లేకుంటే అనవసరమైన చిక్కుల్లో పడటం ఖాయం.