Begin typing your search above and press return to search.

సెలక్టర్లూ.. కోహ్లి ఆటలో సగమైనా ఆడారా?

By:  Tupaki Desk   |   18 Dec 2021 10:52 AM GMT
సెలక్టర్లూ.. కోహ్లి ఆటలో సగమైనా ఆడారా?
X
సెలెక్టర్లు జోకర్లు.. మొహీందర్ అమరనాథ్.. జట్టులోకి ఎంపిక చేసేది వీళ్లనా.. వినోద్ కాంబ్లీ.. ప్రపంచ కప్ మ్యాచ్ లు చూసేందుకు ఇప్పుడే త్రీడీ కళ్లద్దాలు కొనుక్కున్నా.. అంబటి రాయుడు.. భారత క్రికెట్లో సెలక్టర్ల మీద గతంలో వచ్చిన కామెంట్లివి. తమకు జట్టులో చోటు దక్కనప్పుడు ఆటగాళ్లలో కోపం సహజం. అది విమర్శల రూపంలో బయటకొస్తుంటుంది.

అమరనాథ్ అయితే.. సెలక్టర్లను ఏకంగా జోకర్ల గుంపుగా అభివర్ణించాడు. ఇటీవలి కాలంలోనూ సెలక్టర్ల ఎంపిక ప్రక్రియ వివాదానికి దారితీసింది. మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఎంపికైన సందర్భంలోనూ.. అతడి అంతర్జాతీయ అనుభవాన్ని అప్పటి కెప్టెన్ ధోని అనుభవంతో పోలుస్తూ విమర్శ లు చేశారు. అయితే ఎమ్మెస్కే తన చక్కటి పనితీరుతో వాటికి చెక్ పెట్టారు.

విమర్శలు సహజం 1997 వెస్టిండీస్ పర్యటనలో గాయపడిన జవగళ్ శ్రీనాథ్ స్థానంలో హైదరాబాద్ రంజీ క్రికెటర్ నోయల్ డేవిడ్ ను ఎంపిక చేయడం... దానిపై అప్పటి జట్టు కెప్టెన్ సచిన్ టెండూల్కర్ .. ఎవరీ నోయల్ అంటూ ప్రశ్నించడం పెద్ద చర్చకు దారితీసింది. అయితే, నోయల్ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఆ తర్వాత జట్టులోకి ఎంపిక కాలేకపోయాడు.

ఇక 2019 ప్రపంచకప్ సందర్భంగానూ అంబటి రాయుడును కాదని ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ను ఎంపికచేయడం.. అది కూడా బ్యాటింగ్ ఆర్డర్లో కీలకమైన నాలుగో స్థానానికి తీసుకోవడం మరింత దుమారం లేపింది. ఈ ఉద్దేశంలోనే రాయుడు 3డి కళ్లద్దాల కామెంట్ చేశాడు.

ట్రోల్ అవుతున్నకీర్తి ఆజాద్ వ్యాఖ్యలు ఇటీవల టీమిండియా టెస్టు కెప్టెన్సీ వివాదం ఏ స్థాయిలో సాగిందో తెలిసిందే. కోహ్లీ-బీసీసీఐ మధ్య వివాదమే ప్రధానాంశంగా మారింది. ఈ విషయంపై తాజాగా మాజీ సెలెక్టర్‌, మాజీ ఆల్‌రౌండర్‌ కీర్తి ఆజాద్‌ స్పందించారు. ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు.

సెలక్టర్ల తీరును తప్పుబట్టారు. కోహ్లీని వన్డే సారథిగా తొలగించాలని సెలెక్టర్లు నిర్ణయించి ఉంటే ఆ విషయాన్ని మొదట బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ దృష్టికి తీసుకెళ్లాలని.. ఆయన ఆమోదం పొందాక.. కోహ్లీతో ప్రత్యేకంగా మాట్లాడేవాడని మాజీ క్రికెటర్‌ చెప్పుకొచ్చారు.

సహజంగా ఎప్పుడైనా ఒక జట్టును ఎంపిక చేసినప్పుడు, లేదా కెప్టెన్‌ని మార్చినప్పుడు సెలెక్టర్లు నిర్ణయం తీసుకొని దాన్ని అధ్యక్షుడికి చూపించిన తర్వాతే అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుందన్నారు. కాగా, కీర్తి ఆజాద్ ఒకప్పుడు సెలక్టరే. తాను పనిచేసిన ఆ రోజుల్లోనూ ఇలాగే చేశామని తెలిపారు. అయితే, ఇక్కడ కోహ్లీని వన్డే సారథిగా తొలగించడం కన్నా.. అతడికి ఆ విషయాన్ని తెలియజేసిన విధానమే మరింత బాధపెట్టి ఉండొచ్చని అన్నారు. చివరగా ఈ నిర్ణయం తీసుకున్న సెలెక్టర్లంతా చాలా గొప్ప వాళ్లని ప్రశంసిస్తూనే.. వాళ్లంతా కోహ్లీ ఆడిన ఆటలో సగం మ్యాచ్‌లు కూడా ఆడలేదని ఎద్దేవా చేశారు.

ముగ్గురూ పేసర్లే..

ప్రస్తుతం టీమిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యులుగా చేతన్ శర్మ, అభయ్ కురువిల్లా, దేశాశిష్ మొహంతి ఉన్నారు. వీరు ముగ్గురూ పేస్ బౌలర్లే. చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ అంతర్జాతీయ కెరీర్లో 23 టెస్టులు,65 వన్డేలు ఆడాడు. అభయ్ కురువిల్లా 10టెస్టులు, 25 వన్డేలు ఆడాడు. మొహంతి రెండే టెస్టులు, 45 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఇక కోహ్లి 97 టెస్టులు, 254 వన్డేల్లో భారత్ కు ఆడాడు. ఇంకా నాలుగేళ్లయినా జట్టుకు ప్రాతినిధ్యం వహించే సత్తా ఉన్నవాడు.