Begin typing your search above and press return to search.

శేఖ‌ర్ రెడ్డికి విశాఖ నుంచే కొత్త నోట్లు

By:  Tupaki Desk   |   16 Dec 2016 6:15 AM GMT
శేఖ‌ర్ రెడ్డికి విశాఖ నుంచే కొత్త నోట్లు
X
భారీ స్థాయిలో కొత్త నోట్లు - అవినీతి సొమ్ముతో దొరికిపోయిన టీడీపీ పాలక మండలి మాజీ సభ్యులు శేఖర్‌ రెడ్డి ఉదంతంలో అనూహ్య ప‌రిణామాలు తెర‌మీద‌కు వ‌స్తునన్నాయి. రూ.130 కోట్లు నల్లధనాన్ని వైట్‌ గా మార్చుకుని పట్టుబడ్డ శేఖ‌ర్ రెడ్డికి విశాఖ నుంచే ఈ మొత్తం వెళ్లాయ‌ని తేలింది. విశాఖ‌ప‌ట్ట‌ణంలోని ఎస్‌ బీఐ స్పెషల్‌ బ్రాంచ్‌ (చెస్ట్‌) నుంచే నగదు వెళ్లినట్లు ఐటి అధికారుల విచారణలో బయటపడింది. ఈ విషయం ఏపీలో క‌ల‌క‌లం సృష్టిస్తోంది.

శేఖ‌ర్ రెడ్డి వ‌ద్ద ప‌ట్టుబ‌డ్డ సొమ్ములో అన్నీ కొత్త రెండు వేల నోట్ల కట్టలు ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై లోతుగా ఆరాతీయ‌గా...దొరికిన దాంట్లో రూ.20 కోట్లు కరెన్సీపై విశాఖ జిల్లాకు కేటాయించిన సీరియల్‌ ఉన్నట్లు సమాచారం. పేదలు - సామాన్యులు రెండు వేలు కూడా దొరక్క అగచాట్లు పడుతున్న నేపథ్యంలో అంత పెద్ద మొత్తంలో కొత్త నోట్లు సంపన్నులకు ఎలా చేరాయన్న దానిపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. నేరుగా ఆర్‌ బిఐ నుంచే శేఖర్‌ రెడ్డికి నగదు అంది ఉంటుందని పలువురు ఆర్థికరంగ - బ్యాంకింగ్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదే విషయమై విశాఖలోని బ్యాంకు వర్గాలను ఆరా తీయగా విశాఖ నుంచి అంత పెద్ద మొత్తం బదిలీ చేసే అవకాశాల్లేవంటున్నారు. అయితే విశాఖ ఎస్‌ బిఐ చెస్ట్‌ కు వచ్చిన నగదును ఇతర ప్రాంతాల బ్యాంకులు లేదా ఎటిఎంలకు సర్దుబాటు చేసిన తర్వాత పక్కదారి పట్టి ఉండొచ్చన్నారు. ఇక్కడి చెస్ట్‌ నుంచి వెళ్లిన నోట్లపై ఉన్న సీరియల్‌ విశాఖ చెంది ఉంటే ఏ బ్యాంకుకు పంపించారో అక్కడి సిబ్బందిని ఐటి అధికారులు - పోలీసు లు విచారిస్తే అసలు విషయాలు బయట పడే అవకాశం ఉంది. ఈ ప్రచారాన్ని పోలీసులు అంగీకరించినప్పటికీ తమకు విచారణ విషయమై ఎలాంటి ఆదేశాలూ రాలేదని చెబుతున్నారు. ఏటీఎంలను ప్రయివేటు ఏజెన్సీలు నిర్వహిస్తున్నందున అక్కడి నుంచి కూడా నగదు పక్కదారి పట్టే అవకాశాలున్నాయని బ్యాంకు వర్గాలు అంటున్నాయి. వేర్వేరు బ్యాంకులకు చెందిన ఏటీఎంలకు ఆయా చెస్ట్‌ బ్యాంకుల నుండే నగదు ప్రతి రోజూ అందిస్తారు. ఈ నగదును ఏటీఎంల్లో పెట్టకుండా పక్కదారి పట్టించి శేఖర్‌ రెడ్డి వంటి వారికి తరలించారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/