Begin typing your search above and press return to search.

ఉగ్రవాదుల అడ్డాగా పటాన్ కోట్ ఎయిర్ బేస్

By:  Tupaki Desk   |   4 Jan 2016 5:05 AM GMT
ఉగ్రవాదుల అడ్డాగా పటాన్ కోట్ ఎయిర్ బేస్
X
ఉగ్రవాదులు షాకుల మీద షాకులిస్తున్నారు. పంజాబ్ లోని అత్యంత వ్యూహాత్మక ఎయిర్ బేస్ మీద దాడికి పాల్పడిన ఉగ్రవాదుల వ్యవహారంలో భారీ కుట్ర దాగినట్లుగా తెలుస్తోంది. శనివారం తెల్లవారు జామున పంజాబ్ రాష్ట్రంలోని పటాన్ కోట్ ఎయిర్ బేస్ మీద ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారన్న వార్తలు వచ్చాయి. మధ్యాహ్నానానికి ఉగ్రవాదుల్ని హతమార్చినట్లుగా ప్రకటించారు.

కానీ.. ఆ తర్వాత కూడా కాల్పులుచోటు చేసుకున్నాయి. మొత్తంగా శనివారం సాయంత్రానికి ఉగ్రవాదుల్ని హతమార్చారని.. ఆపరేషన్ ముగిసినట్లుగా కేంద్రం ప్రకటించింది. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి మృత్యువాత పడిన ఉగ్రవాదుల సంఖ్యను వెల్లడించటంలో పొరపాటు చేశారు. మొత్తం నలుగురు ఉగ్రవాదులు మరణిస్తే.. ఐదుగురిగా ట్వీట్ చేసి.. ఆ తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నారు.

పటాన్ కోట్ ఎయిర్ బేస్ మీద దాడి ముగిసిందని ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. కలుగులో నుంచి వచ్చే ఎలుకల మాదిరి పరిస్థితి తయారైంది. శనివారం ముష్కరుల్ని అంతమొందించినట్లుగా వార్తలు వచ్చినా అందులో నిజం లేదన్న విషయం ఆదివారం జరిపిన కాల్పులు స్పష్టం చేశాయి. ఎయిర్ బేస్ లో నక్కిన ఉగ్రవాదులు విడతల వారీగా బయటకు రావటం.. కాల్పులకు తెగబడటం గమనార్హం. శని.. ఆదివారం చోటుచేసుకున్న ఉగ్రదాడులతో కలిపి ఆరుగురు ఉగ్రవాదులు హతమైతే.. ఏడుగురు సైనికాధికారులు మృతి చెందారు. సోమవారం ఉదయం కూడా కాల్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో.. పటాన్ కోట్ ఎయిర్ బేస్ ఉగ్రవాదుల అడ్డాగా మారిందన్న మాట వినిపిస్తోంది. చూస్తుంటే.. భారీ వ్యూహంతో తాజా దాడి జరిగినట్లుగా ఉంది. తాజాగా చోటు చేసుకున్న కాల్పుల నేపథ్యంలో ఎయిర్ బేస్ లో ఎంతమంది ముష్కరులు ఉన్నారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.