Begin typing your search above and press return to search.

వాట్సాప్ గ్రూపులలో షేరింగ్: పక్కా ప్లాన్ తోనే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో హింస?

By:  Tupaki Desk   |   17 Jun 2022 11:30 AM GMT
వాట్సాప్ గ్రూపులలో షేరింగ్: పక్కా ప్లాన్ తోనే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో హింస?
X
సైన్యం నియామకాలపై కేంద్రం ప్రకటించిన 'అగ్నిపథ్' పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగిశాయి. పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనూ విద్యార్థులు తీవ్ర విధ్వంసం సృష్టించారు. రైళ్లకు నిప్పటించి నిరసన తెలిపారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతిచెందారు.

అగ్నిపథ్ స్కీమ్ ను ఎత్తివేయాలని ఆర్మీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. రెగ్యులర్ రిక్రూట్ మెంట్ ను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. తాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ముట్టడించేందుకు ముందస్తు ప్లాన్ వేసినట్లు ఆర్మీ అభ్యర్థులు తెలిపారు. నిరసన తెలిపేందుకు రైల్వే స్టేషన్ ను ఎంచుకున్నామన్నారు. రాత్రి నుంచే రైల్వే స్టేషన్ లోనే ఉన్నామని.. వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసుకొని సమాచారం చేరవేసుకున్నామని ఆర్మీ అభ్యర్థులు మీడియాతో తెలిపారు.

పక్కా ప్రణాళికతోనే సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చి ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు సంఘటనలు జరిగిన తీరుచూస్తే అర్థమవుతోంది. నిరసనలు తెలియజేయాలని ముందుగానే నిర్ణయించుకున్నామని.. కాల్పుల్లో మృతిచెందిన వారికి న్యాయం జరగాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ముందస్తు ప్లాన్ తోనే రైల్వే స్టేషన్ లో ఈ విధ్వంసం సృష్టించినట్టుత ెలిపారు. పోలీసులు కాల్పులు జరిపినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు.

అగ్నిపథ్ ప్రకటన వెలువడినప్పటి నుంచి ఆందోళనకారులు నిరసనలకు వ్యూహం పన్నినట్లు తెలిసింది. ఆందోళన కోసం తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి యువకులు గురువారం రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు. జిల్లాల వారీగా వాళ్లంతా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని సమాచారాన్ని పంచుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరసన కోసం గురువారం రాత్రే ఇక్కడికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం స్టేషన్ బయటే యువకులు కాసేపు బైఠాయించి ఆందోళన చేశారు.

అక్కడే ఓ బస్సు అద్దాలను పగులగొట్టారు. ఉదయం 9 గంటల సమయంలో ఆందోళనకారులు ఒక్కసారిగా సికింద్రాబాద్ స్టేషన్ లోపలికి దూసుకొచ్చి పట్టాలపై భైఠాయించారు. ఫ్లాట్ ఫాంపై ఉన్న స్టాళ్లను తొలగించి స్టేషన్ లో నిలిపిన రైళ్ల కిటీకీ అద్దాలను ధ్వంసం చేశారు. రైల్వే పార్సిల్ లో వస్తువులను తీసుకొచ్చి పట్టాలపై వేసి నిప్పంటించారు. ఆ తర్వాత ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుకు నిప్పు పెట్టారు.

ఇక అదనపు బలగాలు అక్కడికి రాగా వాళ్లపై రాళ్ల వర్షం కురిపించారు. పరిస్థితి అదుపు చేసేందుకు లాఠీచార్జ్ చేసి టియర్ గ్యాస్ ప్రయోగించినా ఆందోళన సద్దుమణకపోవడంతో రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో గాయపడి ఒకరు మృతి చెందినట్టు తెలిసింది. దీంతో సికింద్రాబాద్ లో పరిస్థితులు మరింతగా అదుపుతప్పి విధ్వంసకాండ కొనసాగింది. ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని అభ్యర్థులు హెచ్చరిస్తున్నారు.