Begin typing your search above and press return to search.

అమ్మ మృతిపై పార్ల‌మెంటు ద‌ద్ద‌రిల్లింది

By:  Tupaki Desk   |   10 March 2017 6:10 PM IST
అమ్మ మృతిపై పార్ల‌మెంటు ద‌ద్ద‌రిల్లింది
X
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత మృతి అంశం పార్ల‌మెంటులో తీవ్ర గంద‌ర‌గోళానికి దారితీసింది. జ‌య‌ల‌లిత మృతిలో అనుమానాలు ఉన్న నేప‌థ్యంలో ఈ విష‌యంపై చ‌ర్చించాల‌ని అన్నాడీఎంకేలోని పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన ఎంపీలు వాయిదా తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్‌ కు అంద‌జేశారు. అయితే స్పీక‌ర్ దాన్ని తిర‌స్క‌రించారు. అమ్మ మ‌ర‌ణంపై తామ తాము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడానికి నిరసనగా ఎనిమిది మంది ఎంపీలు వాకౌట్ చేశారు.

పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా లోక్ స‌భ ప్రారంభం కాగానే జయలలిత మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని నినాదాలు చేస్తూ పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన ఎంపీలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టారు. అయితే దానికి స్పీక‌ర్ స‌సేమిరా అన‌డంతో కొద్దిసేపు నినాదాలు చేశారు. అనంత‌రం వారు వాకౌట్ చేశారు.

ఇదిలాఉండ‌గా... త‌మిళ‌నాడు సీఎం ప‌ద‌విని ప‌ళ‌ని స్వామి చేప‌ట్టిన ప‌రిణామం మ‌రో మ‌లుపు తిరిగింది. సభలో విపక్షం లేకుండానే పళని స్వామి బలపరీక్ష కు స్పీకర్ అనుమతించారని, అది చెల్లదని పేర్కొంటూ డీఎంకే కోశాధికారి, తమిళనాడు అసెంబ్లీలో విపక్ష నేత అయిన స్టాలిక్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. కాగా నిబంధనల ప్రకారమే బలపరీక్ష నిర్వహించామని తమిళనాడు అసెంబ్లీ కార్యదర్శి కోర్టుకు తెలిపారు. కాగా, ప‌ళనిస్వామి బలపరీక్ష పై డీఎంకే నాయకుడు స్టాలిన్ వేసిన పిటిషన్ ను తాజాగా విచారించిన హైకోర్టు ఆ ఫుటేజీలను స్టాలిన్ కు ఇవ్వాలని తమిళనాడు అసెంబ్లీని ఆదేశించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/