Begin typing your search above and press return to search.

ఉండవల్లితో సీక్రేట్స్... ఏపీలో సంచలనం...?

By:  Tupaki Desk   |   25 Feb 2022 1:30 PM GMT
ఉండవల్లితో సీక్రేట్స్... ఏపీలో సంచలనం...?
X
ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయాలు తెలిసిన వారికి వేరేగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఆయన రెండు సార్లు రాజమండ్రీ నుంచి ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియర్ గా పేరు గడించారు. ఇక వైఎస్సార్ కి వెన్నుదన్నుగా ఉండేవారు. ఒక విధంగా వైఎస్సార్ అయిందుంపావు ఏళ్ళ ముఖ్యమంత్రిత్వంలో ఉండవల్లి హవా ఒక రేంజిలో సాగింది.

అలాంటి ఉండవల్లి వైఎస్సార్ మరణం తరువాత బాగా తగ్గిపోయారు. ఇక 2014లో ఉమ్మడి ఏపీ విభజన తరువాత ఆయన కాంగ్రెస్ కి రాజీనామా చేసి ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆయన తన అభిప్రాయాలను మాత్రం కుండబద్ధలు కొట్టినట్లుగా మీడియా సమావేశం పెట్టి మరీ ప్రతీసారీ చెబుతూంటారు. అక్కడ జగన్ సీఎం గా ఉన్నా చంద్రబాబు అయినా ఆయనకు పట్టింపు లేదు.

ఏపీ ప్రయోజనాలే తనకు ముఖ్యమని అంటారు. ఇక ఉండవల్లి జగన్ తో భేటీ అయింది ఇప్పటిదాకా రెండు సార్లే అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ మధ్యనే ఆయన వైఎస్సార్ మీద హైదరాబాద్ లో విజయమ్మ ఒక సభ పెడితే హాజరై వచ్చారు. అలాంటి ఉండవల్లిని వైఎస్సార్ అల్లుడు, షర్మిల భర్త అయిన బ్రదర్ అనిల్ కలసి సీక్రెట్ గా చర్చలు జరిపారు.

ఆనక ఇద్దరూ మీడియాతో మాట్లాడినా చాలా విషయాలు చర్చించుకున్నాం, కొన్ని రహస్యాలు ఉన్నాయి, వాటిని చెప్పకూడదు అంటూ బ్రదర్ అనిల్ ఆసక్తిని పెంచేశారు. ఇక రాజకీయాలు, కుటుంబ విషయాలు ఎన్నో తమ మధ్య చర్చకు వచ్చాయి అన్నారు. ఉండవల్లి కూడా ఇదే మాట చెప్పారు. అనిల్ అయితే కొన్ని విషయాలని సరైన సమయంలో తానే మీడియాకు చెబుతాను అని అన్నారు.

మొత్తానికి వైఎస్సార్ కు అత్యంత సన్నిహితుడిగా, రాజకీయ జ్ఞానవంతుడిగా ఉండవల్లిని కలిశాను, ఆయన నుంచి చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను అని అనిల్ చెప్పారు. ఇవన్నీ ఇలా ఉంటే సడెన్ గా ఉండవల్లిని బ్రదర్ అనిల్ కలవడం వెనక విశేషం ఏముంది అన్న చర్చ రాజకీయాల్లో సాగుతోంది. ఈ మధ్యనే వైఎస్ షర్మిల పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు ఇచ్చింది.

అదే విధంగా వైఎస్సార్టీపీ ని కూడా అక్కడ పటిష్టం చేయాలనుకుంటున్నారు. ఇక ఏపీలో చూస్తే జగన్ సీఎం గా ఉన్నారు. మరి రాజకీయాలు అంటే వీటి మీద మాట్లాడారా. ఉండవల్లి అవసరం ఎంతవరకూ ఇలాంటి విషయాల్లో తీసుకోవాలనుకుంటున్నారు అన్నది ఒక చర్చ. కుటుంబ విషయాలు అంటే షర్మిలకు జగన్ కి మధ్య ఎవో విభేధాలు ఉన్నాయని చర్చ అయితే ఉంది. మరి దాని మీద పరిష్కారాల కోసం మధ్యవర్తిగా ఉండవల్లిని ఉండాలని కోరారా ఇవన్నీ ఊహాగానాలే.

ఉండవల్లి అయితే వైఎస్సార్ కుటుంబానికి ఆప్తుడే కానీ జగన్ సీఎం అయ్యాక ఆయనతో పెద్దగా కలవడం లేదు, మరి జగన్ తో ఉండవల్లి ఏమైనా మాట్లాడుతారా, మాట్లాడితే ఏ విషయాలు చర్చకు వస్తాయి ఇలా చాలానే సందేహాలు ఉన్నాయి. అలాగే వైఎస్సార్టీపీలో ఉండవల్లిని కీలకంగా ఉండమని ఎవరైనా కోరుతున్నారా. లేక ఏపీలో షర్మిల పార్టీని విస్తరిస్తారా ఇలా ఎన్నో డౌట్లు వచ్చేస్తున్నాయి. మొత్తానికి ఉండవల్లి తో బ్రదర్ అనిల్ భేటీ కాదు కానీ చాలా విషయాలే చర్చించి ఉంటారని అంటున్నారు. అవేంటి అన్నది తెలియాలీ అంటే అనిల్ అన్నట్లుగా ఆయనే మరో టైమ్ చూసుకుని వివరించాలేమో.