Begin typing your search above and press return to search.

టైటానిక్ మనకి కనిపించేది మరో 12 ఏళ్లే.. ఆ తర్వాత..

By:  Tupaki Desk   |   6 Sep 2021 8:37 AM GMT
టైటానిక్ మనకి కనిపించేది మరో 12 ఏళ్లే.. ఆ తర్వాత..
X
ప్రపంచ చరిత్రలో అత్యంత విషాదంగా మిగిలిపోయిన టైటానిక్ ఓడ సముద్రంలో మునిగిపోయి దాదాపుగా 110 ఏళ్లు అవుతుంది. అయితే , నేటికీ కూడా ఆ టైటానిక్ గురించి ప్రజలు చర్చించుకుంటూనే ఉన్నారు. రాయల్ మెయిల్ షిప్ టైటానిక్ బ్రిటన్‌ లోని సౌతాంప్టన్ నుంచి బయలుదేరి ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో అనూహ్యంగా మునిగిపోయింది. నీటిపై తేలియాడే విలాసవంతమైన నగరంగా పేరొందిన టైటానిక్.. 1912 ఏప్రిల్ 14న రాత్రివేళ మంచుకొండను ఢీకొట్టింది. దీంతో ఏప్రిల్ 15న ఓడ పూర్తిగా మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 1,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇది చరిత్రలో అతిపెద్ద సముద్ర విపత్తులలో ఒకటిగా నిలిచిపోయింది.

సముద్ర ప్రయాణాలకు స్వర్ణ యుగంగా పేరొందిన కాలంలో టైటానిక్‌ను నిర్మించారు. 20వ శతాబ్దం ప్రారంభంలో పెరుగుతున్న వలసదారులు, సంపన్న ప్రయాణీకులకు సేవలందిస్తున్న ఇతర క్రూయిజ్ లైనర్లతో పోటీ పడటానికి దీన్ని రూపొందించారు. టైటానిక్ నిర్మాణానికి మొత్తం 7.5 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. ఇప్పటి విలువలో ఇది 192 మిలియన్ డాలర్లకు సమానం. వరదలను నిరోధించడానికి 16 వాటర్ టైట్ కంపార్ట్‌ మెంట్లను వాడారు. వీటిని బల్క్ హెడ్స్ అనేవారు. వీటితో పాటు విలాసవంతమైన ప్రయాణానికి ఉద్దేశించింది కావడంతో తయారీ ఖర్చు కూడా భారీగా పెరిగింది. దాదాపు 3,000 మంది వర్కర్లు రె౦డు స౦వత్సరాలు నిరంతరాయంగా పనిచేసిన తర్వాత టైటానిక్ తయారైంది. తన తొలి సముద్ర ప్రయాణంలోనే టైటానిక్ అనుకోని ప్రమాదానికి గురైంది. ఏప్రిల్ 14న రాత్రి 11.40 గంటలకు అది ఒక పెద్ద మంచు కొండను ఢీకొట్టింది. దీంతో క్రమంగా ఓడ లోపలికి నీరు చేరి మునిగిపోయింది.

ప్రమాదం జరిగిన సుమారు మూడు గంటల తరువాత.. అంటే ఏప్రిల్ 15, తెల్లవారుజామున 2.20 గంటలకు ఓడ సముద్రంలో పూర్తిగా మునిగిపోయింది. లైఫ్ బోట్లలో వెళ్లేందుకు అవకాశం దొరకని ప్రయాణికులు చల్లని, గడ్డకట్టుకుపోయే ఆ నీటిలో ప్రాణాలు వదిలారు. ఉదయం 4.10 గంటలకు అక్కడికి RMS కార్పతియా ఓడ చేరుకుంది. ఆ నౌకలోని సిబ్బంది మొదటి లైఫ్ బోట్ నుంచి బయటపడిన ప్రయాణికులను కాపాడారు. సుమారు 2,200 మందితో ప్రయాణం ప్రారంభించిన టైటానిక్ నుంచి కేవలం 700 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

అట్లాంటిక్‌ మహాసముద్రంలో మంచుకొండను ఢీ కొట్టి, మునిగిన, 73 ఏళ్ల తర్వాత కెనడాలోని న్యూఫౌండ్‌ ల్యాండ్‌ కు 740 కి.మీ. దూరంలో సముద్ర మట్టానికి 4 వేల మీటర్ల లోతున 2 ముక్కలైన టైటానిక్‌ అవశేషాలను గుర్తించిన విషయం తెలిసిందే. నేటికీ ఆ ఓడ శిధిలాలు అలాగే ఉన్నాయి. అయితే మరికొన్ని ఏళ్లల్లో ఆ ఛాన్స్‌ కూడా ఉండదట. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఒకరకమైన బ్యాక్టీరియా టైటానిక్‌ అవశేషాలను వేగంగా తినేస్తోందని చెప్తున్నారు. మరో 12 ఏళ్ల తర్వాత టైటానిక్‌ అని చెప్పుకోవడానికి నీళ్లల్లో ఒక్క ముక్క కూడా మిగలద’ని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటివరకూ ‘ఆర్‌ఎంఎస్‌ టైటానిక్‌ సంస్థ’ పలు పరిశోధక యాత్రలు చేపట్టి.. దాదాపు 5 వేలకు పైగా.. వెండి పాత్రలు, బంగారు నాణాలు వంటివెన్నో టైటానిక్‌ శిథిలాల నుంచి బయటకు తీసింది.