Begin typing your search above and press return to search.

రెస్టారెంట్ బాత్రూంలో సీక్రెట్ మొబైల్ కెమెరా..: బయటపెట్టిన లేడీ లీడర్..

By:  Tupaki Desk   |   29 Jan 2022 5:28 AM GMT
రెస్టారెంట్ బాత్రూంలో సీక్రెట్ మొబైల్ కెమెరా..: బయటపెట్టిన లేడీ లీడర్..
X
ఓ రాజకీయ పార్టీ నాయకురాలు.. పార్టీ కార్యకర్తలతో అప్పటి వరకు సమావేశం నిర్వహించారు. ఆ తరువాత మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఓ రెస్టారెంట్ కు వెళ్లారు. ఈక్రమంలో ఆమె బాత్రూంలోకి వెళ్లింది. అయితే అక్కడ ఓ అట్టపెట్టె.. అందులో మొబైల్ ఉండడాన్ని గమనించింది. దానిని పరిశీలనగా చూసిన ఆమె మొబైల్ లో అక్కడి దృశ్యాలు రికార్డు అవుతుండడాన్ని గుర్తించారు. వెంటనే ఆ బాక్సును పోలీసులకు అందించారు.. దీంతో ఆ మొబైల్ ఎవరిది..? అక్కడ ఎవరు పెట్టారు..? అనే కోణంలో పరిశీలిస్తున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన ఆమె ఇలాంటి విషయం బయట పెట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే..?

తమిళనాడు ప్రజలు ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అనుగుణంగా నడుచుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే జయలలిత ప్రవేశపెట్టిన ‘అమ్మ భోజనం’ పథకాన్ని అదే పేరుతో కంటిన్యూ చేసి విమర్శకుల నుంచి ప్రశంసలు పొందారు. మొన్నటి వరదల సందర్భంగా ఊరూరా తిరుగుతూ ప్రజలకు ధైర్యం చెప్పారు.

ఇలాంటి డీఎంకే పార్టీలో ఉన్న ఓ మహిళా నాయకురాలు భారతి చురుగ్గా పనిచేస్తున్నారు. చెన్నైలోని మధురవాయల్ నియోజకవర్గానికి ఆర్గనైజర్ గా ఉన్న భారతి పార్టీ వ్యవహారాలను చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఆమె చేస్తున్న సేవలకు పార్టీ కార్యకర్తల నుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నిత్యం కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ పార్టీ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్తున్నారు. పార్టీ అధికారంలో ఉండడంతో ఆమె ఎక్కువగా ప్రజలతో సత్సంబంధాలను నెరుపుతున్నారు.

స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నందున భారతి నాయకులు, కార్యకర్తలతో కలిసి నిత్యం సమావేశాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా చెన్నైలోని కిండి రైల్వేస్టేషన్ సమీపంలో కార్యకర్తలతో మీటింగ్ అరేంజ్ చేశారు. విధి విధానాలను రూపొందించారు. అయితే మధ్యాహ్నం సమయంకావడంతో భోజనానికి అక్కడే ఉన్న ప్రముఖ రెస్టారెంట్లోకి వెళ్లారు. అయితే అక్కడే ఉన్న రెస్ట్ రూంలోకి వెళ్లారు. అందులో ఉన్న బాత్రూంలో ఒక అట్టపెట్టెలో మొబైల్ ఉండడాన్ని గమనించారు. అక్కడి దృశ్యాలు సెల్ ఫోన్లో రికార్డు అవుతుండడం చూశారు. దీంతో వెంటనే ఆ బాక్స్ ను పోలీసులకు అందించారు. అయితే ఆ ఫోన్ ఎవరిది..? అక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని పోలీసులు ఆరా తీస్తున్నారు.

సాధారణంగా అధికార పార్టీ నాయకులు ఇలాంటి విషయంలో వేరే విధంగా ప్రవర్తిస్తారు. కానీ భారతి చేసిన సాహసం చూసి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. అంతేకాకుండా ప్రజల్లో ఇలాంటి విషయాలపై ధైర్యంగా ఉండాలని ఆమె చెప్పారు. దీంతో ఆమె చేసిన పనికి మహిళా లోకం గర్విస్తోంది.