Begin typing your search above and press return to search.

మూడు రాజధానుల మర్మం ఏంటి...?

By:  Tupaki Desk   |   30 Dec 2019 4:07 PM GMT
మూడు రాజధానుల మర్మం ఏంటి...?
X
ప్రస్తుతం రాజధాని అమరావతి విషయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజధానిని ఎందుకు మారుస్తున్నారు. మూడు రాజధానుల మర్మం ఏంటి? అసలు జగన్‌ ఎందుకు ఇలా చేస్తున్నారు? అనే చర్చ సామాన్యుల నుంచి మేదావుల వరకు కూడా భారీ ఎత్తున సాగుతోంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కలలో కూడా ఊహించని విధంగా, ఫార్టీ ఇయర్స్‌ పొలిటికల్‌ ఇండస్ట్రీ చంద్రబాబుకు సైతం అంతుపట్టని విధంగా జగన్‌ ఇలా ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నారు? అనే చర్చ టీడీపీ సీనియర్లలో సైతం సాగుతుండడం గమనార్హం. వాస్తవానికి జగన్‌ ప్రభుత్వం ఏర్పటయ్యాక.. ఇక, జగన్‌ చేయాల్సింది ఏముంది? అంతా మేమే చేసేశాం.. పునాది రాళ్లు వేసేశాం.. శిలా ఫలకాలు పెట్టేశాం.. అనుకున్నారు టీడీపీ నాయకులు.

అయితే, వీరి అంచనాలకు భిన్నంగా జగన్‌ దూసుకుపోతుండడం ఇప్పుడు వీరికి అంతు పట్టని చిక్కు ప్రశ్నగా పరిణమించింది. ప్రతి విషయంలోనూ తన దైన సరికొత్త ఆలోచనతో జగన్‌ దూసుకుపోతున్నారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది! అని అనిపించేరీతిలో ఆయన నిర్ణయాలు ఉండడం గమనార్హం. రైతుల నుంచి విద్యార్థుల వరకు ఉద్యోగుల నుంచి మహిళల వరకు ఇలా అన్ని వర్గాలకు జగన్‌ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఒక విధంగా ఆశ్చర్యం కల్పిస్తుంటే.. కీలకమైన రాజధాని విషయంలోనూ పెను మార్పులకు శ్రీకారం చుట్టారు. దీంతో రాజధాని విషయం ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పెను చర్చకు దారితీస్తోంది.

ఇక, రాజధాని విషయానికి వస్తే.. మూడు రాజధానుల ప్రకటన వెనుక జగన్‌ వ్యూహం ఏంటి? వైసీపీ మర్మం ఏంటి? అనే కోణం ఎక్కువగా వినిపిస్తోంది. 1938 నాటి శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కోస్తా జిల్లాలకు, రాయలసీమ జిల్లాలకు మధ్య ఒప్పందం జరిగింది. వెనుకబడిన సీమ ప్రాంతాలను అభివృద్ధి చేసేలా అప్పటి ఒప్పందం స్పష్టం చేస్తోంది. అయితే, దీనిని తర్వాత కాలంలో పెద్దగా ఎవరూపట్టించుకోలేదు. సీమ ప్రాంతానికే చెందిన వైఎస్‌ కానీ, చంద్రబాబు కానీ, కిరణ్‌కుమార్‌ రెడ్డి కానీ సీఎంలు అయినా శ్రీబాగ్‌ ఒప్పందం మాత్రం అమలుకు నోచుకోలేదు. దీంతో ఈ ఒప్పందం అమలు చేయాలంటూ.. అప్పటి నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.

సీమలో రాజధాని ఏర్పాటు లేదా హైకోర్టు ఏర్పాటు చేయాలని ఈ ఒప్పందం స్పష్టం చేస్తోంది. మెజారిటీ సీమ ప్రజల అభిప్రాయాన్ని అమలు చేయాలని కూడా స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు జగన్‌ దీనిని అమలు చేసేందుకు పూనుకున్నారు. అయితే, తద్వారా పూర్తిగా సీమ జిల్లాలపై ఆయన పట్టు సాధించడంతోపాటు చంద్రబాబు ఉనికిని దాదాపు చెరిపివేయనున్నారనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం. ఇక, ఎవరూ కోరని విధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ అభివృద్ధి వీచికలు వీచేలా జగన్‌ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొంత మేరకు అభివృద్ధి సాధించిన విశాఖ అయితే.. అన్ని వర్గాలకు అనుకూలంగా ఉంటుందన్న అంచ‌నాకు జ‌గ‌న్ వ‌చ్చారు.

ఇప్ప‌టికే వైజాగ్ ప‌ర్యాట‌క‌, సినిమా, ఫార్మా, ఐటీ రంగాల్లో దూసుకుపోతోంది. ఈ రంగాల‌కు మరింత ఊతం ఇవ్వడం ద్వారా ఆ నాలుగు జిల్లాలను అభివృద్ధి చేయడంతోపాటు తన ఉనికిని చిరస్థాయి చేసుకోవచ్చనే కీలకమైన ఆలోచనతోనే జగన్‌ అడుగులు వేస్తున్నారనేది వాస్తవంగా కనిపిస్తోందని మేధావులు చెబుతున్నారు. ఈ పరిణామాల వెనుక మర్మం ఒక్కటే.. రాష్ట్రంలో మిగిలిన పార్టీలపై పైచేయి సాధించడంతోపాటు జగన్‌ మగాడ్రా బుజ్జీ అని అనిపించుకోవాలనే ప్రధాన వ్యూహం ఉందని అంటున్నారు. మరి ఏది నిజమో కాదో తేలాలంటే కొంత కాలం వెయిట్‌ చేయకతప్పదు.