Begin typing your search above and press return to search.

మోడీతో సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఢీ...!!

By:  Tupaki Desk   |   31 Aug 2019 12:04 PM GMT
మోడీతో సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఢీ...!!
X
భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీతో బీజేపీ నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఢీ కొట్టేందుకు సిద్ద‌మ‌య్యాడా...? ప్ర‌ధాని తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను సుబ్ర‌మ‌ణ్య‌స్వామి విభేదిస్తున్నారా..? మోడీ చేప‌డుతున్న ఆర్థిక విధానాలు లోప‌భూయిష్టంగా ఉన్నాయా..? అస‌లు మోడీ ఆర్థిక విధానాలు తీసుకోవ‌డంలో పూర్తిగా విఫ‌లం కావ‌డ‌మే కాకుండా నూత‌న ఆర్థిక విధానాలు చేయ‌డ‌మే రాదా..? బీజేపీ నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామి చేస్తున్న సంచ‌ల‌న కామెంట్లు చూస్తే పై ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్‌ అవున‌నే అనిపిస్తుంది. ఇంత‌కు భార‌త ఆర్థిక విధానాల‌పై సుబ్ర‌మ‌ణ్య‌స్వామి చేసిన సంచ‌ల‌న కామెంట్లు ఏంటో ఓసారి చూద్దాం..

పార్ల‌మెంట్ లో బ‌డ్జెట్ ప్ర‌సంగం స‌మ‌యంలో ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చేసిన కామెంట్‌ ను సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ప్ర‌స్తావిస్తూ 5 ఏళ్ల కాలంలో 5 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ ల‌క్ష్య‌మ‌ని ఆర్థిక మంత్రి ప్ర‌క‌టించారు. అయితే నూత‌న ఆర్థిక విధానాలు లేకుండా ఆ ల‌క్ష్యం ఎలా ? సాధ్య‌మంటూ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ట్విట్ట‌ర్‌ లో సూటిగా ప్ర‌శ్నించాడు. న‌రేంద్ర‌మోడీ ప్ర‌భుత్వం భారీ ల‌క్ష్యాల‌ను పెట్టుకుని - సంస్క‌ర‌ణ‌ల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు చెప్పింద‌ని - కానీ దేశ స్థూల దేశియోత్ప‌త్తి త‌గ్గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుందని ఆయ‌న పేర్కొన్నారు.

దేశియోత్ప‌త్తి 2019-20 తొలి త్రైమాసికంలో 5 శాతానికి చేరింది. అంటే గ‌తంతో పోల్చితే 8 శాతం త‌గ్గింద‌ట‌. ఓ వైపు దేశియోత్ప‌త్తి త‌గ్గుతుంటే మ‌రోవైపు బ్యాంక్‌ ల‌ను విలీనం చేస్తున్న‌ట్లు ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించ‌డంతో సుబ్ర‌మ‌ణ్య‌స్వామి బీజేపీ నిర్ణ‌యంపై ట్విట్ట‌ర్ వేదిక‌గా ఫైర్ అయ్యారు.

అస‌లు దేశంలో నూత‌న ఆర్థిక విధానాల‌ను మోడీ స‌ర్కారు రూపొందించ‌లేదు.. భవిష్య‌త్‌ లో రూపొందిస్తార‌నే గ్యారంటీ లేదు... అలాంటిది 5 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ అనే దానికి ల‌క్ష్యం లేద‌ని - దానికి గుడ్‌ బై చెప్పాల్సిందేన‌ని ట్వీట్ చేశాడు సుబ్ర‌మ‌ణ్య‌స్వామి.

కొత్త విధానాలు - సంస్కరణలు లేకుండా ఎలా సాధ్యమని ప్రశ్నించారు సుబ్రమణ్య స్వామి. నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టాలంటే ధైర్యం మాత్రమే కాదు.. జ్ఞానం కూడా కావాలి.. విజ్ఞతతో వ్యవహరించి దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అభిప్రాయపడ్డారు. అలాంటి చర్యలతోనే ఆర్థిక వ్యవస్థ పురోగమన దిశలో పయనిస్తోందని చెప్పారు. ఈ రెండు అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థకు తప్పనిసరి అని .. కానీ ఆ రెండింటినీ మనం మరచిపోయామని సునీశితంగా విమర్శించారు.

ఇప్పుడు సుబ్ర‌మ‌ణ్య‌స్వామి చేసిన ఈ కామెంట్ల‌తో మోడీ స‌ర్కారు నూత‌న ఆర్థిక విధానాలు ప్ర‌క‌టించ‌డం చేత‌కాద‌ని - అస‌లు ఆర్థిక వ్య‌వ‌స్థ మీద‌నే అవ‌గాహ‌న లేద‌ని - కేవ‌లం కాంగ్రెస్ ప్ర‌ధాన‌మంత్రి పీవి న‌ర‌సింహ‌రావు చేసిన నూత‌న ఆర్థిక విధానాలే ఇప్ప‌టికి దేశానికి దిశానిర్ధేశం చేస్తున్నాయ‌నే అర్థ‌మ‌వుతుంది. సుబ్ర‌మ‌ణ్య‌స్వామి పేల్చిన ఈ బాంబ్ ఎలా పేలుతుందో చూడాలి.