Begin typing your search above and press return to search.

జగన్ మా హీరోతో కలిసి తమిళనాడును రక్షించండి.. ఫ్యాన్స్ విజ్ఞప్తి

By:  Tupaki Desk   |   12 Feb 2020 6:45 AM GMT
జగన్ మా హీరోతో కలిసి తమిళనాడును రక్షించండి.. ఫ్యాన్స్ విజ్ఞప్తి
X
తమిళనాడులో హీరో విజయ్ నివాసంపై ఐటీ దాడులు అందరినీ కలవర పెట్టాయి. రెండు రోజుల పాటు సాగిన ఐటీ అధికారుల సోదాలతో తమిళనాడే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విజయ్ ను దెబ్బతీయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ దాడులను చేయించిందని అందరూ ఆరోపిస్తున్నారు. విజయ్ ఇంటిపై దాదాపు 23గంటల పాటు జరిగిన ఐటీ దాడుల తర్వాత తమిళనాడులో ఆందోళనలు మొదలయ్యాయి. తమిళనాడులో దళపతి విజయ్‌కు మద్దతుగా అభిమానులు నిరసనలు చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా రూపొందించిన పోస్టర్లు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే హీరో విజయ్ తో పాటు ముఖ్యమంత్రి జగన్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఫొటోలు ప్రచురించారు. దీంతో సర్వత్రా ఈ విషయం చర్చకు దారి తీసింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో పాటు రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్ తో కలిసి హీరో విజయ్ తమిళనాడును సేవ్ చేస్తారంట. ఆ పోస్టర్ లో 'మేం ఆంధ్రను బతికించుకున్నాం. మీరే సమస్యల్లో ఉన్న తమిళనాడును కాపాడుకోవాలి. ప్రజా సంక్షేమం గురించి జాగ్రత్తలు తీసుకోండి' అంటూ సందేశం ఇస్తూ పోస్టర్లను పెద్ద ఎత్తున అతికించారు.

గత వారం చెన్నైలో విజయ్ నివాసంపై ఐటీ శాఖ దాడులు చేయగా ఆ సమయంలో తమిళనాడులోని రాజకీయ పార్టీలన్నీ విజయ్ పై విమర్శలు చేశాయి. విజయ్ ను ఒంటరిని చేశాయి. ఈ సందర్భంగా చెన్నైలోని నవేలీ ప్రాంతంలో మాస్టర్ సినిమా షూటింగ్‌లో విజయ్ ఉండగా ఏజెంట్లు చెన్నైకు తీసుకొచ్చేశారు. బిగిల్ నిర్మాతలకు చెందిన ఏజీఎస్ ప్రొడక్షన్ కంపెనీ దాడుల అనంతరం విజయ్ ఇంటిపై సోదాలు నిర్వహించారు. 'ఈయన పెట్టుబడులు అన్ని స్థిరాస్థులు మీదనే ఉన్నాయి. బిగిల్ రెమ్యూనరేషన్ ఏం చేశారనే దానిపై ఎంక్వైరీ చేస్తున్నాం' అని ఐటీ అధికారి ప్రకటించారు.

ఈ సందర్భంగా విజయ్ అభిమానులతో పాటు తమిళ ప్రజలు విజయ్ కు అండగా నిలవాలని నిశ్చయించారు. ఈ సందర్భంగా జగన్ ఫొటో వేసుకుని విజయ్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. విజయ్ రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడు తన సినిమాల్లో బీజేపీకి వ్యతిరేకంగా కామెంట్లు చేశాడు. దానిపై పెద్ద దుమారమే రేగిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే కక్షపూరితంగా విజయ్ నివాసంపై ఐటీ దాడులు అని అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రను రక్షించనట్టు జగన్, పీకేతో కలిసి తమిళనాడును రక్షించాలని విజయ్ అభిమానులు కోరుతున్నారు. జగన్ - ప్రశాంత్ కిశోర్ - విజయ్ ఫొటోలతో కార్యక్రమాలు చేస్తున్నారు.