Begin typing your search above and press return to search.

రిలయన్స్ జియో స్ట్రాటజీపై సెటైర్స్

By:  Tupaki Desk   |   6 Sep 2016 7:47 AM GMT
రిలయన్స్ జియో స్ట్రాటజీపై సెటైర్స్
X
గత కొన్ని రోజులుగా కమ్యునికేషన్ రంగంలో సంచలనాలు సృషిటిస్తున్న రిలయన్స్ జియో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ ఇద్దరు యువకులు మాట్లాడుకునే మాటల్లో అయినా జియో ప్రస్థావనే ఉంటుంది. మూడు నెలలపాటు అన్ని కాల్స్ ఫ్రీ - ఇంటర్నెట్ ఫ్రీ.. 4జీ ఫోన్ ఉంటే చాలు దున్నెయ్యొచ్చు.. మూడు నెలలపాటు ఆడేసుకోవచ్చు అని కుర్రాళ్లు తెగ ఆలోచిస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా జనాలను - ముఖ్యంగా యువతను ఇట్టే ఆకర్షించింది ఈ జియో. అయితే ఈ విషయంపై రకరకాల కథనాలు వస్తున్నప్పటికీ, తాజాగా మార్కెట్ నిపుణుల వాదనతో పాటు కొన్ని జోకులు కూడా సోషల్ మీడియా వేదికగా బాగానే పేలుతున్నాయి.

ఇండియాలో బిజినెస్ కు పర్యాయపదంలా ఉన్న రిలయన్స్ వాళ్లు అప్పనంగా ఇలా ఆఫర్లు ఇచ్చేస్తున్నారంటే ఇందులో కచ్చితంగా ఏదో ఒక మతలబు ఉండకపోదు అని మార్కెట్ నిపుణుల వాదిస్తున్నారు. ఈ విషయంపై జనాలకు మామూలుగా - బిజినెస్ టెర్మినాలజీతో చెబితే అర్ధం కాదనో ఏమో కానీ.. రిలయన్స్ వాళ్ల బిజినెస్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక జోక్ తయారు చేశారు కొందరు. ఈ జోక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇంతకూ ఈ జోక్ లో ఏముందంటే... "రిలయన్స్ వాళ్లు ముందుగా ఒక హోటల్ పెడతారట.. ఆ హోటల్ లో టిఫిన్ పెట్టి కేవలం రెండు రూపాయలే అంటారట. దీంతో జనం ఎగబడి వచ్చి రెండు రూపాయలు పెట్టి టిఫిన్ తింటారట.. అనంతరం ఒక్క రూపాయికే అన్ లిమిటెడ్ లంచ్ అందిస్తారట. ఇక చెప్పేదేముంది అక్కడున్న జనాలతో పాటు.. ఇంకా ఫుల్ గా జనాలు వచ్చి కడుపునిండా తింటారట. అక్కడితో ఆగకుండా అర్ధరూపాయికే డిన్నర్ అని కూడా ప్రకటిస్తారట. దీంతో జనాలు మరింతగా ఎగబడి డిన్నర్ కూడా చేస్తారట. దీంతో అప్పటికే ఆ జనాల పొట్టలు పగిలిపోయే స్థితి వచ్చి.. అర్జెంటుగా బాత్ రూం వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుందట. సరిగ్గా అప్పుడే.. టాయిలెట్ వాడుకోవడానికి రూ. 1250 రేటు పెడతారట." ఇది రిలయన్స్ వాళ్ల అసలు స్ట్రాటజీ - జియో వెనక ఉన్న అసలు సంగతి అని ఈ జోక్ తో చెబుతున్నారు. ప్రారంభంలో ఎన్ని ఉచిత ఆఫర్లు ఇచ్చినా, ఒక్కసారి కస్టమర్లుగా మారాక సీన్ వేరేలా ఉంటుందన్నది ఈ జోక్ ఉద్దేశం. దీంతో ఈ జోక్ వాట్సప్ గ్రూపుల్లో విపరీతంగా షేర్ అవుతుందట.