Begin typing your search above and press return to search.

పెట్రో మంట..మోడీకి దిమ్మదిరిగే సెటైర్..

By:  Tupaki Desk   |   17 Sep 2018 9:16 AM GMT
పెట్రో మంట..మోడీకి దిమ్మదిరిగే సెటైర్..
X
ఆహా.. ప్రజలు కూడా తెలివి మీరిపోయారు.. వర్తమాన సామాజిక - రాజకీయాలపై తమదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు. ముఖ్యంగా యువత స్పందిస్తున్న తీరు చూస్తే షాక్ అవ్వక మానరు. సోషల్ మీడియా వచ్చాక ఎవరి అభిప్రాయాలు వారు స్వేచ్ఛగా వెల్లడిస్తున్నారు. ఎలాంటి రాజకీయ - సామాజిక వార్తల పైనైనా ముక్కుసూటిగా స్పందిస్తున్నారు. అందుకే రాజకీయ నేతలు ఆచితూచి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడితే ఏమవుతుందోనన్న టెన్షన్ వారిని వెంటాడుతోంది.

తాజాగా దేశంలో పెట్రో మంటలు చెలరేగాయి. దాదాపు చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా లీటర్ పెట్రోల్ ధర రూ.90కి చేరువవుతోంది. దీనిపై సామాన్యులు - సెలబ్రెటీలు నెత్తినోరు మొత్తుకుంటున్నా అధికారంలోని బీజేపీ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్టుగా వ్యవహరిస్తోంది.

తాజాగా బీజేపీకి సన్నిహితంగా ఉండే బాబా రాందేవ్ కూడా పెట్రోమంటలపై ప్రధాని నరేంద్రమోడీని ఏకిపారేశాడు. రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్ - డీజిల్ ధరల వల్ల మోడీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించకతప్పదని రాందేవ్ బాబా హెచ్చరించాడు. తానే గనుక ప్రభుత్వంలో ఉంటే.. పెట్రోల్ - డీజిల్ ను 35-40 రూపాయలకే అందించేవాడనని బీజేపీకి దిమ్మదిరిగేలా జవాబిచ్చాడు. పెట్రో మంటలపై ఎంతైనా మాట్లాడే వాక్ స్వాతంత్ర్యం ప్రజల ప్రాథమిక హక్కు అని రాందేవ్ గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయనని ఖరాఖండీగా చెప్పేశాడు.

పెట్రోల్ మంటల ఎఫెక్ట్ ఎంత ఉందో తెలియజెప్పే ఓ సంఘటన తాజాగా తమిళనాడులో చోటుచేసుకుంది. తమ మిత్రుడికి పెళ్లి కానుకగా ఓ మిత్ర బృందం 5 లీటర్ల పెట్రోల్ క్యాన్ ను బహుమతిని ఇచ్చి ఆశ్చర్యపరిచారు. పెట్రోల్ క్యాన్ అందించగానే పెళ్లికి వచ్చిన వారంతా నివ్వెరపోయి.. అనంతరం అందరూ పగలబడి నవ్వేశారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలపై ఈ యువకులు వేసిన సెటైర్ మామూలుగా లేదని అందరూ కీర్తించారు.ఇంత వ్యతిరేకత వస్తున్నా మోడీ మాత్రం ఇప్పటివరకూ పెట్రో మంటలపై స్పందించకపోవడం అందరినీ నివ్వెరపరుస్తోంది.