Begin typing your search above and press return to search.

కోర్టు తీర్పు కూడా కామెడీ అయిపోయిందా?

By:  Tupaki Desk   |   21 Dec 2017 11:30 PM GMT
కోర్టు తీర్పు కూడా కామెడీ అయిపోయిందా?
X
సాధారణంగా కోర్టు తీర్పుల గురించి విమర్శలు చేయాలన్నా... వాటికి దురుద్దేశాలను ఆపాదించాలన్నా అందరూ చాలా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. మీడియాలో కూడా ఎవరికితోచిన రాతల్ని, విమర్శల్ని నాయకుల మీద అధికార్ల మీద అయితే ఎడాపెడా నర్మగర్భ అలంకారాలువేసి రాసేస్తారు గానీ.. కోర్టు తీర్పుల జోలికి మాత్రం వెళ్లరు. ఎందుకంటే.. కోర్టు తీర్పుల గురించి ఎలాంటి తప్పుడు వ్యాఖ్యాలు దొర్లినా సరే.. కోర్టు తనంతగా స్పందించి శిక్ష విధించేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకే అలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత.. వాటికి మినహాయింపు లేకుండాపోయింది. తమకు తీర్పు నచ్చకపోతే.. ఎవరికి తోచిన వ్యాఖ్యలు వారు గుప్పించేస్తున్నారు.

తాజాగా 2జీ స్కామ్ లో కనిమొళి - రాజా సహా మొత్తం నిందితులు అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ వచ్చిన తీర్పు మీద సోషల్ మీడియా మొత్తం భగ్గు మంటోంది. అందరూ ఎడాపెడా దీనిపై జోకులు వేస్తున్నారు.

2జీ స్కామ్ కూడా నిజం కాదని తేలిపోతే గనుక.. అసలు దేశాన్ని పరిపాలించే అధికారమే కాంగ్రెస్ చేతిలో ఉండాల్సిందని, దాన్ని అడ్డుపెట్టుకునే అవినీతి ముద్ర వేసి మోడీ గద్దె ఎక్కడాని కొందరు ఆడిపోసుకుంటూ ఉంటే.. నరేంద్రమోడీ.. భవిష్యత్తులో తమిళనాడు విషయంలో అన్నా డీఎంకే ను కాకుండా .. డీఎంకేను ఎన్డీయేలో కలుపుకునే మూడ్ లో ఉన్నారనడానికి నిదర్శనమే ఈ కోర్టు తీర్పు అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

2015 జనవరిలో కేంద్ర ఆర్థిక మంత్రి వచ్చి పురట్చితలైవి అమ్మను కలిశారని.. ఆ వెనుకనే.. కర్ణాటక హైకోర్టు.. జయలలిత మీద కేసులు కొట్టివేసిందని, 2017 నవంబరులో మోడీ వచ్చి కరుణానిదిని కలిసి వెళ్లగానే.. మొత్తం 2జీ నిందితులంతా నిర్దోషులుగా బయటపడిపోయారని మరికొన్ని జోకులు పేలుతున్నాయి.

ప్రధాని నరేంద్రమోడీ తలచుకుంటే.. ఎందరు నిందితులు అయినా ఇలా బయటపడిపోగలరని సెటైర్లు వేస్తున్న వారు కొందరు. అయినా.. ఇలా కోర్టు తీర్పునకు ఉద్దేశ్యాలను ఆపాదిస్తూ కామెంట్లు చేయడం తగదు గానీ.. సోషల్ మీడియాలో ఇలాంటివి నియంత్రణ లేకుండా చక్కర్లు కొడుతుండడం విశేషం.